త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | “ఇది గాంధీ భవన్.. బీఆర్ఎస్ వాళ్లతో కలిసి ఎలా కూర్చుంటాం?” – జీవన్ రెడ్డి ధ్వజం

"పార్టీ కోసం పోరాడిన కార్యకర్తల పరిస్థితి ఏంటి?" అంటూ గాంధీ భవన్ వేదికగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపుదారులతో కలిసి కూర్చోలేనంటూ సమావేశాన్ని బహిష్కరించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలను కాపాడాలని డిమాండ్ చేశారు.

J

Hyderabad | Published On Jan 21, 2026, 9.30 pm IST

Jeevan Reddy | “ఇది గాంధీ భవన్.. బీఆర్ఎస్ వాళ్లతో కలిసి ఎలా కూర్చుంటాం?” – జీవన్ రెడ్డి ధ్వజం
Advertisement

Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. బుధవారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ కీలక సమావేశం నుండి సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిరసనగా బయటకు వచ్చారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అంతర్గత సమావేశాల్లో కూర్చోబెట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారికి విలువా?

సమావేశం అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వెళ్లగక్కారు. "ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం. పదేళ్ల పాటు బీఆర్ఎస్ అక్రమాలపై పోరాటం చేసిన కార్యకర్తలకు మనం ఏం సమాధానం చెబుతాం? రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పార్టీ ఫిరాయించిన వారిని, స్పీకర్ విచారణలో తాము కాంగ్రెస్ లో లేమని అఫిడవిట్ ఇచ్చిన వారిని మన పక్కన ఎలా కూర్చోబెట్టుకుంటాం?" అని ఆయన ప్రశ్నించారు.

కార్యకర్తల ఆవేదన నా ఆవేదన

గత పదేళ్లుగా బీఆర్ఎస్ అరాచకాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నానని, నిన్నటి వరకు కూడా సదరు ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలపై పోరాడానని ఆయన గుర్తు చేశారు. "మరోవైపు సదరు నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలను కలిసి.. మీకు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు కావాలా అని అడుగుతున్నారు. దశాబ్ద కాలంగా పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటి? పార్టీని చులకన చేస్తున్నారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సోనియా, రాహుల్ గాంధీ విధానాలకు వ్యతిరేకం

ఈ సమావేశం జరుగుతున్న తీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఆశయాలకు విరుద్ధంగా ఉందని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ చర్చను తాను భరించలేకపోయానని, అందుకే పీసీసీకి క్షమాపణలు చెప్పి సమావేశం నుండి బయటకు వచ్చానని స్పష్టం చేశారు.

పార్టీని వీడే ప్రసక్తే లేదు

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. "నేను పార్టీ ఎందుకు వీడుతాను? ఇది నా పార్టీ. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లోనే ఉన్నాను. పార్టీ నాకు గుర్తింపు ఇచ్చింది. కేవలం ఈ రోజు జరుగుతున్న సమావేశం తీరుకు నిరసనగా మాత్రమే నేను బయటకు వచ్చాను" అని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు.

పార్టీలోని సీనియర్ నేత ఇలా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

[video width="1280" height="720" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/01/WhatsApp-Video-2026-01-21-at-20.10.10.mp4"][/video]

Advertisement

తాజావార్తలు

Advertisement