త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజ‌య్ జాజు ఆదేశం..

CS Jaju | ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సమర్థంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పంటల వైవిధ్యీకరణపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

P

Telangana | Published On Aug 25, 2026, 6.03 pm IST

CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజ‌య్ జాజు ఆదేశం..
Advertisement

CS Jaju | ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సమర్థంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పంటల వైవిధ్యీకరణపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీజనల్‌ పరిస్థితులు, నీట్‌-పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధిపై సమీక్షించారు. జిల్లాల వారీగా వాతావరణ పరిస్థితులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చేపడుతున్న ముందస్తు చర్యలను సీఎస్‌ అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంచనా వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన కాంటింజెన్సీ క్రాప్‌ ప్రణాళికను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. తక్కువ నీటి అవసరం ఉండే, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగుపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.

30న నీట్‌-పీజీ పరీక్ష

ఈ నెల 30న జరగనున్న నీట్‌-పీజీ ప్రవేశ పరీక్షకు జిల్లాల్లో చేపడుతున్న ఏర్పాట్లను సీఎస్‌ సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యుత్‌, తాగునీరు, రవాణా వంటి మౌలిక సదుపాయాలతోపాటు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్ష ప్రశాంతంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా చూడాలన్నారు. హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 30 కేంద్రాల్లో పరీక్ష జరగనున్న నేపథ్యంలో నిరంతర విద్యుత్‌ సరఫరా, ఇతర మౌలిక వసతులు, బందోబస్తుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి

తెలంగాణ టూరిజం 2047 పాలసీలో భాగంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని సంజయ్‌ జాజు సూచించారు. ప్రతి జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను గుర్తించి మౌలిక వసతులు, రహదారి అనుసంధానం, పరిశుభ్రత, పర్యాటకుల సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పారు. చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను సంబంధిత శాఖల సమన్వయంతో సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్రంలో 27 స్పెషల్‌ టూరిజం ఏరియాలను (STA) గుర్తించిన నేపథ్యంలో వాటి అభివృద్ధికి కలెక్టర్లు ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. తెలంగాణ బ్రాండ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు టూరిజం 2047 ప్రణాళికలు దోహదపడతాయని పేర్కొన్నారు. స్పిరిచ్యువల్‌, హెరిటేజ్‌, ఎకో, క్రాఫ్ట్స్‌ టూరిజం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్‌ సీఎస్‌ వాణిప్రసాద్‌, వైద్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, పోలీస్‌ శాఖ డీజీ మహేశ్‌ భగవత్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement