త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GHMC | జీహెచ్ఎంసీ విభ‌జ‌న‌పై హైకోర్టులో పిటిష‌న్‌.. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు నోటీసులు

GHMC | గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (GHMC) పున‌ర్విభ‌జ‌న‌పై హైకోర్టులో (High Court) పిటిష‌న్ దాఖ‌లైంది. జీహెచ్ఎంసీని మూడు కొత్త కార్పొరేష‌న్లుగా (GHMC Reorganisation) ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఈ నెల 11న జీవో 55 విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

G

Hyderabad | Published On Feb 19, 2026, 2.23 pm IST

GHMC | జీహెచ్ఎంసీ విభ‌జ‌న‌పై హైకోర్టులో పిటిష‌న్‌.. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు నోటీసులు
Advertisement

GHMC | త్రినేత్ర‌.న్యూస్‌: గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (GHMC) పున‌ర్విభ‌జ‌న‌పై హైకోర్టులో (High Court) పిటిష‌న్ దాఖ‌లైంది. జీహెచ్ఎంసీని మూడు కొత్త కార్పొరేష‌న్లుగా (GHMC Reorganisation) ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఈ నెల 11న జీవో 55 విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. దీనిని స‌వాల్ చేస్తూ న‌గ‌రానికి చెందిన వ్యాపారి గురువారెడ్డి రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 2027 జ‌నాభా లెక్క‌ల‌పై కేంద్రం విడుద‌ల చేసిన స‌ర్క్యూల‌ర్‌కు ఇది విరుద్ధ‌మ‌ని పేర్కొన్నారు. జ‌న‌గ‌ణ‌న ముగిసే వ‌ర‌కు జీవోపై స్టే విధించాల‌ని, అప్ప‌టివ‌ర‌కు జీహెచ్ఎంసీని య‌థావిధిగా ఉంచాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంట‌ర్లు దాఖ‌లు చేయాలంటూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేషన్ కుమార్ సింగ్ ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరఫు లాయ‌ర్ రాజ్‌కుమార్ గుమ్మి వాదనలు వినిపించారు. ఈ సంద‌ర్భంగా జనగణన కార్యక్రమాల కోసం ఒకసారి జ్యూరిస్‌డిక్ష‌న్ ఫ్రీజ్ ప్రకటించాక మున్సిపల్ సరిహద్దుల మార్పులు, స్థానిక సంస్థల పునర్వ్యవస్థీకరణ అనుమతించబడవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాంటి చర్యలు ప్రారంభం నుంచే చెల్లవని పేర్కొన్నారు. అందువల్ల చట్ట విరుద్ధంగా, అధికార పరిధి లేకుండా జారీ చేసిన జీవో 55ను రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ తరఫున వాదనలు విన్న ధ‌ర్మాస‌నం కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని స్ప‌ష్టం చేసింది.

జీహెచ్ఎంసీ విభ‌జ‌న ఇలా..

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రాన్ని మూడు కార్పొరేష‌న్లుగా విభ‌జిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఫిబ్ర‌వ‌రి 11న ఉత్త‌ర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ (GHMC)తో పాటు సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (CMC), మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (MMC)ను ఏర్పాటు చేసింది.

పాత గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని 150 డివిజ‌న్లు డీలిమిటేష‌న్‌తో 243కు పెరిగాయి. విలీన మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల ప‌రిధిలో 57 డివిజ‌న్లు ఏర్పాట‌య్యాయి. మొత్తం 300 డివిజ‌న్ల‌కు విస్త‌రించిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిపాల‌న సౌల‌భ్యం, అధికార వికేంద్రీక‌ర‌ణ ల‌క్ష్యాల‌తో మూడు కార్పొరేష‌న్లుగా విభ‌జించింది. జీహెచ్ఎంసీ చ‌ట్టం-1995, సెక్ష‌న్‌-3(1) ప్ర‌కారం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేసింది.

  • గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోకి శంషాబాద్, రాజేంద్ర నగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు వస్తాయి.
  • సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలోకి శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు వస్తాయి.
  • మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) పరిధిలోకి మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లు వస్తాయి.

ఇక‌ డివిజ‌న్ల వారీగా చూస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలోకి 150 డివిజన్లు, సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి 76, మల్కాజ్‌గిరి పరిధిలోకి 74 డివిజన్లు ఉన్నాయి.

Advertisement
Advertisement