Gas KYC | గ్యాస్ కేవైసీ అప్డేట్ పేరిట సైబర్ మోసాలు.. జర జాగ్రత్త సుమా..!
Gas KYC | గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్, అత్యవసర గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న సరికొత్త మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు.
ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేస్తే ఖాతాలు ఖాళీ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరిక
Gas KYC | త్రినేత్ర.న్యూస్ : గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్, అత్యవసర గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న సరికొత్త మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకుని, నేరగాళ్లు అమాయక ప్రజల ఖాతాల్లోని సొమ్మును కాజేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కేవైసీ అప్డేట్ చేయాలంటూ వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే గుర్తుతెలియని లింక్లను క్లిక్ చేయడం, వారు పంపే ఏపీకే ఫైల్స్ను మొబైల్లో ఇన్స్టాల్ చేయడం చాలా ప్రమాదకరమని స్పష్టం చేశారు. నేరగాళ్లు పంపే ఆ చిన్న యాప్ను డౌన్లోడ్ చేస్తే చాలు, మొబైల్ నియంత్రణ మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోతుందని వివరించారు. దీని ద్వారా ఫోన్కు వచ్చే బ్యాంక్ ఓటీపీలు, రహస్య మెసేజ్లు నేరుగా సైబర్ నేరగాళ్లకు చేరిపోతాయని హెచ్చరించారు.
ఇటీవల మహారాష్ట్రలోని డోంబివాలి ప్రాంతంలో జరిగిన ఓ ఘటనను ఆయన ఉదాహరణగా వివరించారు. "ప్రముఖ గ్యాస్ కంపెనీ ప్రతినిధులమని చెబుతూ సైబర్ నేరగాళ్లు ఇద్దరు మహిళలకు ఫోన్ చేశారు. గ్యాస్ కనెక్షన్ సమాచారంతో పాటు కేవైసీని వెంటనే అప్డేట్ చేయాలని నమ్మించి, వాట్సాప్లో ఒక ఏపీకే ఫైల్ పంపారు. ఆ ఫైల్ను డౌన్లోడ్ చేసి అందులో ఉన్న ఫారం నింపాలని సూచించారు. ఆ మహిళలు వారు చెప్పినట్లే యాప్ ఇన్స్టాల్ చేసి వివరాలు నమోదు చేయగానే, వారి బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా నాలుగు లక్షల రూపాయలు మాయం అయ్యాయి." అని వివరించారు. ఇలాంటి మోసాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అలాగే, తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చే నకిలీ ప్రకటనలను నమ్మవద్దని కోరారు. ముందుగా డబ్బులు చెల్లిస్తేనే గ్యాస్ వస్తుందని నమ్మబలికే సందేశాలు వస్తే, అవి కచ్చితంగా సైబర్ మోసాలేనని గుర్తించాలన్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు.
గ్యాస్ బుకింగ్ లేదా కేవైసీ అప్డేట్ కోసం గ్యాస్ కంపెనీలకు చెందిన అధికారిక యాప్స్, వెబ్సైట్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికే వెళ్లి సంప్రదించడం సురక్షితమని పేర్కొన్నారు. ఆన్లైన్ మోసాల పట్ల ప్రజల అప్రమత్తతే అసలైన విరుగుడని ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930 కి కాల్ చేయాలని, లేదా కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





