త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Party | కంటోన్మెంట్‌లో రూ.800 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడాలి : కలెక్టర్‌కు బీఆర్ఎస్ వినతి

BRS Party | కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలం తొకట్టలో ఉన్న సుమారు రూ.800 కోట్ల విలువైన ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి డాక్ట‌ర్ మన్నె క్రిషాంక్ ఆధ్వ‌ర్యంలో ఆ పార్టీ నేత‌లు హైద‌రాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

P

Hyderabad | Published On Jun 15, 2026, 4.23 pm IST

BRS Party | కంటోన్మెంట్‌లో రూ.800 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడాలి : కలెక్టర్‌కు బీఆర్ఎస్ వినతి
Advertisement

BRS Party | కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలం తొకట్టలో ఉన్న సుమారు రూ.800 కోట్ల విలువైన ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి డాక్ట‌ర్ మన్నె క్రిషాంక్ ఆధ్వ‌ర్యంలో ఆ పార్టీ నేత‌లు హైద‌రాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తొకట్ట సర్వే నంబర్ 157/1లో ఉన్న ఈ భూమి చారిత్రాత్మకంగా "పోరంబోకు సర్కారీ"గా నమోదైన ప్రభుత్వ భూమని, దీనికి సంబంధించిన పలు రికార్డులు సైతం ప్రభుత్వ హక్కులను స్పష్టంగా నిర్ధారిస్తున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. 1955 నుంచి అందుబాటులో ఉన్న భూ రికార్డులు, 1975-76 భూ ఆక్రమణ చట్టం కింద జరిగిన చర్యలు, అలాగే వివిధ న్యాయపరమైన విచారణల్లోనూ ఈ భూమి ప్ర‌భుత్వానిదేన‌ని గుర్తించిన‌ట్లు తెలిపారు.

ఈ భూమిపై ప్రైవేట్ వ్యక్తులు చేసిన యాజమాన్య వాదనలను గతంలో కోర్టులు, రెవెన్యూ అధికారులు పలుమార్లు తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. 2025లో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ భూమిలో 6వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదన చేసినప్పుడు కూడా దీన్ని ప్రభుత్వ భూమిగానే పరిగణించారని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లినట్లు, చుట్టూ ప్రహరీ నిర్మాణం జరిగినట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ భూమి అని నిర్ధారించిన త‌ర్వాత భూమి ఎలా ప్రైవేట్ అధీనంలోకి వెళ్లింద‌నే అంశంపై స‌మ‌గ్ర విచార‌ణ విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భూమి యాజమాన్యం, సరిహద్దులు, స్వాధీనం, ప్రస్తుత పరిస్థితిపై తక్షణ విచారణ చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు.

రెవెన్యూ, సర్వే, న్యాయ శాఖల చారిత్రక రికార్డులను పరిశీలించి ధ్రువీక‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అవసరమైతే ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, ఏవైనా అక్రమాలు లేదా అధికార దుర్వినియోగం జరిగి ఉంటే వాటిపై దర్యాప్తు జరపాలని కోరారు. విచారణకు సంబంధించిన వివరాలు, రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ప్రతిపాదిత 6వేల ఇందిరమ్మ ఇళ్ల ప్రాజెక్టు ప్రస్తుత స్టేట‌స్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆస్తులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, ఇంత భారీ విలువైన భూమి విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని క్రిషాంక్ పేర్కొన్నారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల, అంశాన్ని పరిశీలించి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చార‌ని బీఆర్ఎస్ నేత‌లు తెలిపారు.

 

Advertisement
Advertisement