త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

POCSO Judgment | 12 ఏండ్ల బాలిక‌పై అఘాయిత్యం చేశాడు.. 10 ఏండ్ల జైలు శిక్ష వేశారు

POCSO Judgment | 12 ఏండ్ల బాలిక‌పై ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డిన నిందితుడు క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. ఫిలింన‌గ‌ర్‌కు చెందిన‌ నిందితుడికి 10 ఏండ్ల జైలు శిక్ష, 10,000 జ‌రిమానా విధిస్తూ హైదరాబాద్ హాకా భవన్‌లోని పోక్సో ప్ర‌త్యేక కోర్టు తీర్పు వెలువ‌రించింది.

S

Flash news | Published On Aug 7, 2026, 6.24 pm IST

POCSO Judgment | 12 ఏండ్ల బాలిక‌పై అఘాయిత్యం చేశాడు.. 10 ఏండ్ల జైలు శిక్ష వేశారు
Advertisement
  • పోక్సో కేసులో ప్ర‌త్యేక‌ కోర్టు తీర్పు.. 10,000 జ‌రిమానా
  • తీర్పుపై సంతోషం వ్య‌క్తం చేసిన‌ బాధిత కుటుంబం

త్రినేత్ర‌.న్యూస్‌: 12 ఏండ్ల బాలిక‌పై ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డిన నిందితుడు క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. ఫిలింన‌గ‌ర్‌కు చెందిన‌ నిందితుడికి 10 ఏండ్ల జైలు శిక్ష, 10,000 జ‌రిమానా విధిస్తూ హైదరాబాద్ హాకా భవన్‌లోని పోక్సో ప్ర‌త్యేక కోర్టు తీర్పు వెలువ‌రించింది. కోర్టు తీర్పు పట్ల బాధితురాలి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

హైద‌రాబాద్ ఉమెన్ సేఫ్టీ డీసీపీ డాక్టర్ లావణ్య తెలిపిన వివ‌రాల ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఫిలింన‌గ‌ర్‌కు చెందిన మహమ్మద్ మోహసిన్ (45) పెట్రోల్ పంపులో ప‌ని చేస్తున్నాడు. చిన్నారి తల్లి ఇల్లు ఇరుకుగా ఉండటంతో పిల్లలు తమ బావ మ‌హ‌మ్మ‌ద్ మోహ‌సిన్‌ ఇంట్లో నిద్రించేవారు. ఈ క్ర‌మంలో మోహ‌సిన్ స‌ద‌రు బాలిక‌పై ప‌లుమార్లు అత్యాచారం చేశాడు. 2019, మే 15న బాధితురాలు వాంతులు చేసుకోవడంతో క్లినిక్‌కు తీసుకెళ్లారు. మ‌రుస‌టి రోజు కడుపునొప్పి అని చెప్పడంతో మళ్లీ అదే క్లినిక్‌లో చికిత్స అందించారు.

తిరిగి అదే నెల 18న‌ బాధితురాలికి స్నానం చేయిస్తుండగా ఆమె దుస్తులపై మరకలను గమనించిన తల్లి ప్రశ్నించగా బాలిక అస‌లు విష‌యం చెప్పింది. ఇల్లు ఊడుస్తున్న స‌మ‌యంలో త‌న‌పై అత్యాచారం చేశాడ‌ని వివ‌రించింది. ఈ విషయాన్ని బయటకు చెప్పొద్ద‌ని బెదిరించాడ‌ని పేర్కొంది. అంతకుముందు కూడా బాలిక‌ అవయవాలను అనుచితంగా తాకాడ‌ని బాధితురాలు వివరించింది. దీంతో మే 22న బాధితురాలి తల్లి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదు చేసి బాలిక‌ను భ‌రోసా కేంద్రానికి త‌ర‌లించి దర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు డీసీపీ తెలిపారు.

ఏసీపీ ప్రసన్న లక్ష్మి, భరోసా ఇన్‌స్పెక్టర్ పి.పద్మ, భరోసా కేంద్ర అధికారుల ప్రయత్నాలను నిరంతరం పర్యవేక్షించిన‌ట్లు డీసీపీ లావ‌ణ్య తెలిపారు. నిందితుడికి శిక్ష ప‌డేలా కృషి చేసిన ఏసీపీ శ్రీనివాసరావు, ఆర్.కాళింగ రావు, ఎ. రమాదేవి (స్పెషల్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్), కె.ప్రతాప్ రెడ్డి (పబ్లిక్ ప్రాసిక్యూటర్), టి.కల్పన, ఎ.ఆర్.హిమా మీనన్ (లీగల్ కౌన్సెలర్లు), ఇతర భరోసా బృందం, ఎమ్.నాగరాజు, ఎస్. వెంకట్ రెడ్డి తదితరులను హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ అభినందించారు.

Advertisement
Advertisement