త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | జీవోలు తెచ్చినా సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధ‌ర‌ల‌ను పెంచం – తెలంగాణ ఎగ్జిబిట‌ర్ల నిర్ణయం

సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు మూత‌ప‌డ‌కుండా ఉండాలంటే పర్సెంటేజ్ షేరింగ్ విధానంఅమలు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి తెలంగాణ ఎగ్జిబిట‌ర్లు తెలిపారు. సింగిల్ స్క్రీన్లను కాపాడ‌టానికి తాము చేస్తోన్న ఈ పోరాటానికి స్టార్ హీరోలు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని అన్నారు. ఇక‌పై సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ రేట్ల‌ను పెంచేది లేద‌ని అన్నారు.

N

Entertainment | Published On May 12, 2026, 7.48 pm IST

Tollywood |  జీవోలు తెచ్చినా సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధ‌ర‌ల‌ను పెంచం – తెలంగాణ ఎగ్జిబిట‌ర్ల నిర్ణయం
Advertisement

Tollywood |  టాలీవుడ్‌లో నిర్మాత‌ల‌కు, ఎగ్జిబిట‌ర్ల‌కు మ‌ధ్య మొద‌లైన వివాదం రాను రాను మ‌రింత ముదురుతోంది. సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో ప‌ర్సంటేజీ విధానాన్ని అమ‌లు చేయాలంటూ గ‌త కొద్ది రోజులుగా ఎగ్జిబిట‌ర్ల‌తో పాటు థియేట‌ర్ యాజ‌మాన్యాలు డిమాండ్ చేస్తోన్నాయి. నిర్మాత‌లు మాత్రం రెంట‌ల్ సిస్ట‌మ్‌లోనే సింగిల్ స్క్రీన్స్‌లో త‌మ సినిమాల‌ను ప్ర‌ద‌ర్శిస్తామ‌ని అంటున్నారు. గ‌త కొద్ది రోజులుగా ఈ వివాదం నానుతూనే ఉంది. ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిగిన స‌మ‌స్య ప‌రిష్కారం మాత్రం కాలేదు.ఈ వివాదం ఎఫెక్ట్ రామ్‌చ‌ర‌ణ్ పెద్దితో పాటు జూన్‌లో రాబోతున్న ప‌లు సినిమాల‌పై ప‌డ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ ఎగ్జిబిట‌ర్లు మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ఓ స‌మావేశాన్ని ఏర్పాటుచేశారు. సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు మూత‌ప‌డ‌కుండా ఉండాలంటే పర్సెంటేజ్ షేరింగ్ విధానంఅమలు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అని ఈ మీటింగ్‌లో తీర్మాణించారు. సింగిల్ స్క్రీన్లను కాపాడ‌టానికి తాము చేస్తోన్న ఈ పోరాటానికి స్టార్ హీరోలు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని అన్నారు. ఈ స‌మావేశానికి నిర్మాత చదలవాడ శ్రీనివాస‌రావుతో పాటు శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్‌తో పాటు పలువురు ఎగ్జిబిటర్ సభ్యులు హాజ‌ర‌య్యారు.

థియేట‌ర్ల‌ను ర‌క్షించండి...

నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ..."ఏ సినిమాను టార్గెట్ చేసి గానీ, ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో గానీ ఈ పోరాటం చేయడం లేదు. థియేటర్లను రక్షించండి. మిగిలిన రాష్ట్రాల్లో థియేట‌ర్లకు ప‌ర్సంటేజీ విధానం అమ‌లు చేసి తెలుగులో మాత్రం ఎందుకు రెంట‌ల్ ప‌ద్ధతి లో సినిమా రిలీజ్ చేస్తున్నారో తెలియ‌డం లేదు. దయచేసి ఎగ్జిబిటర్లను కాపాడాల‌ని నిర్మాత‌ల‌ను కోరుతున్నా. ఇక‌పై ప్ర‌భుత్వం నుంచి జీవోలు వచ్చినా కూడా సింగిల్ స్క్రీన్‌ థియేటర్లో టికెట్ రేట్లు పెంచమని తెలియజేస్తున్నాం" అని అన్నారు.

2008 నుంచి పోరాటం...

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ.. "పర్సెంటేజ్ విధానం కోసం మేము 2008 నుంచే పోరాడుతున్నాం. చివరిగా ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల సమయంలో కూడా పర్సెంటేజ్ అమలు చేస్తామని చెప్పారు. కానీ అది జరగలేదు. మేము థియేటర్లు బంద్ చేస్తున్నామని అసత్య ప్రచారం చేశారు. మేము థియేటర్లు బంద్ చేయడం లేదు. ఎవరైతే పర్సెంటేజ్ ఇస్తారో వాళ్ల సినిమాలను ప్రదర్శిస్తామని చెబుతున్నాం. దేశమంతా పర్సెంటేజ్ విధానంలోనే సినిమాలు ప్రదర్శిస్తున్నారు. మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. పర్సెంటేజ్ విధానం ఉంటే థియేటర్లు నడుపుతాం. లేకపోతే బంద్ చేసుకోవాల్సి వస్తుంది" అని సవినయంగా తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.

నిర్మాత‌లు న‌ష్టాల్లోనే...

సునీల్ నారంగ్ మాట్లాడుతూ "టాలీవుడ్‌లో నిర్మాతలు కూడా నష్టాల్లోనే ఉన్నారు. అందరి పరిస్థితి బాగోలేదు. . మల్టీప్లెక్సుల్లో కొత్త టెక్నాలజీలు, ఆధునిక సౌకర్యాలు తీసుకొస్తున్నారు. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అలాంటి సదుపాయాలు కల్పించలేకపోతున్నాం. డాల్బీ వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సింగిల్ స్క్రీన్స్‌కి కూడా వస్తారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడితే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకే నష్టం. మేము ఏ సినిమాను టార్గెట్ చేయడం లేదు. చాలా ఏళ్లుగా ఈ విషయాన్ని నిర్మాతల దృష్టికి తీసుకెళ్తున్నాం. వారు హామీ ఇస్తున్నారు కానీ ఆ హామీని నిలబెట్టుకోవడం లేదు" అని చెప్పారు.

 

Advertisement
Advertisement