త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sumanth Prabhas | ‘గోదారి గట్టుపైన’ సూపర్ క్యూట్ ఫ్యామిలీ డ్రామా.. అందరినీ కట్టిపడేసే ఎమోషన్స్: హీరో సుమంత్ ప్రభాస్

'మేము ఫేమస్' సినిమాతో యూత్‌ను ఆకట్టుకున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్.. మూడేళ్ల గ్యాప్ తర్వాత 'గోదారి గట్టుపైన' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మే 8న విడుదల కానున్న ఈ మూవీ క్యూట్ ఫ్యామిలీ డ్రామాగా అలరించనుందని, జగపతి బాబు పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని సుమంత్ ప్రభాస్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

J

Entertainment | Published On May 5, 2026, 10.39 pm IST

Sumanth Prabhas | ‘గోదారి గట్టుపైన’ సూపర్ క్యూట్ ఫ్యామిలీ డ్రామా.. అందరినీ కట్టిపడేసే ఎమోషన్స్: హీరో సుమంత్ ప్రభాస్
Advertisement

Sumanth Prabhas | త్రినేత్ర.న్యూస్ : 'మేము ఫేమస్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్‌కు బాగా దగ్గరైన యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'గోదారి గట్టుపైన'. రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా.. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభినవ్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న హీరో సుమంత్ ప్రభాస్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

మూడేళ్ల గ్యాప్.. అందుకే ఆ అగ్రెషన్

తన తొలి సినిమా 'మేము ఫేమస్' తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించడానికి దాదాపు మూడేళ్లు పట్టిందని సుమంత్ తెలిపారు. అందువల్ల ఈ సినిమా కూడా తనకు తొలి సినిమా లాంటిదేనని, ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గకుండా వినూత్నంగా ప్లాన్ చేశామని చెప్పారు. సమ్మర్‌లో సినిమా వస్తుండటంతో 'కూల్' కాన్సెప్ట్‌తో తానే స్వయంగా యాడ్స్ రాసి డైరెక్ట్ చేశానని, వీటికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. యాడ్స్‌లో ఉన్న కూల్‌నెస్ సినిమా చూసినప్పుడు కూడా ప్రేక్షకులు ఫీల్ అవుతారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

గోదావరి యాస కోసం నాలుగు నెలల కష్టం

తెలంగాణలో పుట్టి పెరిగిన సుమంత్, ఈసారి గోదావరి బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం విశేషం. ఈ సినిమాలో తన పాత్ర కోసం, ముఖ్యంగా గోదావరి యాస కోసం దాదాపు నాలుగు నెలల పాటు రిహార్సల్స్ చేశానని వెల్లడించారు. గోదావరి ప్రాంతం వారు విన్నప్పుడు కచ్చితంగా తమలాగే మాట్లాడుతున్నాడనే ఫీలింగ్ రావాలని ఎంతో కష్టపడ్డానన్నారు. ఇందులో ఆటో డ్రైవర్‌గా కనిపించనున్న సుమంత్, ఆటో రేస్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశానని తెలిపారు. సాధారణంగా ఆటో డ్రైవర్లను మాస్‌గా చూపిస్తారని, కానీ ఇందులో ఫ్రెండ్స్, ఫ్యామిలీకి విలువ ఇచ్చే ఇన్నోసెంట్, క్యూట్ పాత్రలో తాను కనిపించనున్నట్లు చెప్పారు.

సరికొత్తగా జగపతి బాబు పాత్ర

ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సుమంత్ చెప్పారు. ఇటీవల ఆయన ఎక్కువగా ఇంటెన్స్, అగ్రెసివ్ పాత్రల్లో కనిపిస్తున్నప్పటికీ.. ఇందులో మాత్రం 'శుభలగ్నం', 'ఫ్యామిలీ సర్కస్' సినిమాల తరహాలో చాలా క్యూట్‌గా, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఆయన పాత్ర ఉంటుందని తెలిపారు. సినిమాలో ఫాదర్-డాటర్ ఎమోషన్స్, లవ్ ట్రాక్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయన్నారు. జగపతిబాబు, లైలా కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందని, మంచి ఫ్యామిలీ వైబ్ ఉంటుందని పేర్కొన్నారు. హీరోయిన్ నిధి తెలుగు చక్కగా నేర్చుకుని అద్భుతంగా నటించిందని కితాబిచ్చారు.

డైరెక్టర్‌కు పూర్తిగా సరెండర్ అయ్యా

తాను కూడా డైరెక్టర్‌నే అయినప్పటికీ, ఈ సినిమా కోసం పూర్తిగా దర్శకుడు సుభాష్ చంద్ర విజన్‌కు సరెండర్ అయ్యానని సుమంత్ చెప్పారు. సుభాష్ వందకు పైగా షార్ట్ ఫిల్మ్స్ తీశారని, ఆయన కథ చెప్పిన విధానం, సినిమా స్టైల్‌లో మేకింగ్ తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు. అలాగే, తన తండ్రి పాత్రలో నటించిన దేవి ప్రసాద్ ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఇక నాగవంశీ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు.

మహేష్ బాబు ప్రోత్సాహం మరువలేనిది

తన తొలి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేనని సుమంత్ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన సినిమాలోని పాటను టైటిల్‌గా పెట్టుకోవడం యాదృచ్ఛికమే అయినా చాలా ఆనందంగా ఉందన్నారు. మంచి స్క్రిప్ట్ ఉంటే తమ బ్యానర్‌లోనే సినిమా చేయమని మహేష్ చెప్పడం ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక సినిమా చిత్రీకరణ పూర్తయిందని, త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తానని.. ఇకపై గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తానని సుమంత్ ప్రభాస్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement