త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Twisha Sharma | ట్విషా శర్మ కేసులో ట్విస్ట్‌.. రెండోసారి పోస్ట‌మార్టంకు హైకోర్టు అనుమ‌తి

Twisha Sharma | తెలుగు న‌టి ట్విషా శ‌ర్మ కేసులో మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. రెండోసారి పోస్టుమార్టం చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ పోస్టుమార్టం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యుల బృందం నిర్వ‌హిస్తుంద‌ని కోర్టు స్పష్టం చేసింది.

P

Entertainment | Published On May 22, 2026, 4.09 pm IST

Twisha Sharma | ట్విషా శర్మ కేసులో ట్విస్ట్‌.. రెండోసారి పోస్ట‌మార్టంకు హైకోర్టు అనుమ‌తి
Advertisement

Twisha Sharma | తెలుగు న‌టి ట్విషా శ‌ర్మ కేసులో మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. రెండోసారి పోస్టుమార్టం చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ పోస్టుమార్టం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యుల బృందం నిర్వ‌హిస్తుంద‌ని కోర్టు స్పష్టం చేసింది. అయితే, పోస్టుమార్టం ప్రక్రియ మాత్రం భోపాల్‌లోనే నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. ఇందు కోసం ఎయిమ్స్ బృందాన్ని ప్ర‌త్యేక విమానంలో భోపాల్‌కు త‌ర‌లించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా న్యాయస్థానం సూచించింది. దిగువ కోర్టు రెండో పోస్టుమార్టం పిటిషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో ట్విషా కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే హైకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

జుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనుదిత గుప్తా విధానపరమైన లోపాల కారణంగా రెండో పోస్టుమార్టం అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేశారు. విచారణలో భాగంగా ట్విషా మృతదేహాన్ని భోపాల్ ఎయిమ్స్ మార్చురీలో మైన‌స్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌ల్లో ఉంచిన‌ట్లుగా కోర్టు గుర్తించింది. అయితే, దీర్ఘకాలం భద్రపరచాలంటే మైనస్ 80 డిగ్రీల సెల్సియస్ అవసరమని, ఇందుకు స్థానికంగా స‌దుపాయాలు లేవ‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. ఇదిలా ఉండ‌గా.. కేసు ద‌ర్యాప్తు మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సీబీఐకి అప్ప‌గించాల‌ని ప్ర‌తిపాదించింది. రాష్ట్ర హోంశాఖ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది.

క‌టారా హిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లో ప‌లు సెక్ష‌న్ల కింద న‌మోదైన కేసును సీబీఐకి బ‌దిలీ చేయాల‌ని ప్ర‌తిపాదించిన‌ట్లు హోంశాఖ పేర్కొంది. 33 ఏళ్ల ట్విషా శర్మ స్వ‌స్థ‌లం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా. ఈ నెల 15న భోపాల్‌లో అత్త‌వారింట్లో శ‌వ‌మైన క‌నిపించింది. ఆమెను అత్తింటి వారే అధ‌న‌పు వ‌ర‌క‌ట్నం కోసం వేధించి చంపార‌ని ఆరోపించారు. అయితే, డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డింద‌ని అత్తింటి వారు పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో ట్విషా భర్త సమర్థ్ సింగ్ ఘటన తర్వాత నుంచి పరారీలో ఉన్నాడు. అత‌న్ని పట్టుకునేందుకు పోలీసులు రివార్డు కూడా ప్రకటించారు. సమర్థ్ సింగ్ త్వ‌ర‌లోనే లొంగిపోతాడ‌ని అత‌ని త‌ర‌ఫు న్యాయ‌వాది తెలిపారు.

Advertisement
Advertisement