త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirumala | శేషాచలం అడవుల్లో ‘రోబో డాగ్‌’ నిఘా.. భక్తుల భద్రతకు టీటీడీ సరికొత్త అడుగు..

Tirumala | శేషాచలం అడవుల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడంతోపాటు, తిరుమల వచ్చే భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు సిద్ధమవుతోంది. ప్రమాదకరమైన, మనుషులు సులభంగా చేరుకోలేని అటవీ ప్రాంతాల్లో నిఘా కోసం నాలుగు కాళ్లతో నడిచే ‘క్వాడ్రుపెడ్ రోబోట్‌’ లేదా ‘రోబో డాగ్‌’ను ఉపయోగించే అంశాన్ని పరిశీలిస్తోంది.

P

Devotional | Published On Aug 21, 2026, 9.35 pm IST

Tirumala | శేషాచలం అడవుల్లో ‘రోబో డాగ్‌’ నిఘా.. భక్తుల భద్రతకు టీటీడీ సరికొత్త అడుగు..
Advertisement

Tirumala | శేషాచలం అడవుల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడంతోపాటు, తిరుమల వచ్చే భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు సిద్ధమవుతోంది. ప్రమాదకరమైన, మనుషులు సులభంగా చేరుకోలేని అటవీ ప్రాంతాల్లో నిఘా కోసం నాలుగు కాళ్లతో నడిచే ‘క్వాడ్రుపెడ్ రోబోట్‌’ లేదా ‘రోబో డాగ్‌’ను ఉపయోగించే అంశాన్ని పరిశీలిస్తోంది. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద రోబో డాగ్‌ పనితీరును టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, అటవీ, భద్రతా విభాగాల అధికారులు పరిశీలించారు. కొండ ప్రాంతాల్లో సాధారణ సిబ్బంది వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండే ప్రదేశాల్లో వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు ఈ సాంకేతికత ఎంతవరకు ఉపయోగపడుతుందన్న అంశంపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.

చీకట్లోనూ జంతువుల గుర్తింపు

రోబో డాగ్‌లో అత్యాధునిక నిఘా పరికరాలను అమర్చారు. ఆప్టికల్‌ కెమెరాతోపాటు థర్మల్‌ ఇమేజింగ్‌ కెమెరా, 360 డిగ్రీల లైడార్‌ సెన్సార్‌ ఇందులో ఉన్నాయి. దీంతో రాత్రివేళ చీకట్లోనూ, దట్టమైన పొగమంచు ఉన్న సమయంలోనూ పరిసరాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత వ్యవస్థ ద్వారా జంతువులు, మనుషులు, వాహనాలను గుర్తించి వేరు చేయగల సామర్థ్యం కూడా దీనికి ఉంది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడక మార్గాల్లో గతంలో చిరుతల సంచారం భక్తుల్లో ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో నడకదారులకు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో రోబో డాగ్‌ను మోహరించడం ద్వారా ముందస్తు హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని టీటీడీ భావిస్తోంది. చిరుత లేదా ఇతర వన్యప్రాణి కదలికలను గుర్తించిన వెంటనే రోబోట్‌ జియో-ట్యాగ్‌ ఆధారిత సమాచారాన్ని కంట్రోల్‌ రూమ్‌కు పంపేలా వ్యవస్థను రూపొందించవచ్చు. దీనికి అనుసంధానమైన లైవ్‌ వీడియో, థర్మల్‌ ఇమేజింగ్‌ ఫీడ్‌ ద్వారా భద్రతా సిబ్బందికి పరిస్థితిని వెంటనే అర్థం చేసుకునే వీలు ఉంటుంది. తద్వారా భక్తులను అప్రమత్తం చేయడంతోపాటు అవసరమైన భద్రతా చర్యలు వేగంగా చేపట్టవచ్చు.

వన్యప్రాణులను వెనక్కి మళ్లించేలా..

భక్తులు సంచరించే ప్రాంతాల వైపు వన్యప్రాణులు వస్తే వాటిని ఎలాంటి హాని కలిగించకుండా తిరిగి అడవిలోకి మళ్లించే అవకాశాలపైనా అధికారులు దృష్టి సారించారు. ఇందుకోసం రోబోట్‌లోని లైట్‌, సౌండ్‌ యూనిట్లను అవసరమైన సందర్భాల్లో ఉపయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీనివల్ల మనుషులు-వన్యప్రాణుల మధ్య ఎదురయ్యే ఘర్షణలను తగ్గించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రోబో డాగ్‌ను ఇప్పటికే అందుబాటులో ఉన్న కెమెరా ట్రాప్‌లు, అటవీ సిబ్బంది ఫుట్‌ పెట్రోలింగ్‌కు ప్రత్యామ్నాయంగా కాకుండా అదనపు నిఘా వ్యవస్థగా వినియోగించాలని టీటీడీ యోచిస్తోంది. వన్యప్రాణుల సంచారం అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చోట్ల దీన్ని మొబైల్‌ మానిటరింగ్‌ యూనిట్‌గా ఉపయోగించే అవకాశాలున్నాయి. రోబోట్‌ ద్వారా సేకరించే సమాచారం, వీడియోలు, వన్యప్రాణుల కదలికల వివరాలను విశ్లేషించడం ద్వారా వాటి సంచార తీరుపై మరింత అవగాహన పొందవచ్చు. ఆ సమాచారాన్ని భవిష్యత్‌ భద్రతా ప్రణాళికల్లో ఉపయోగించడంతో తిరుమలలో భక్తుల రక్షణతోపాటు వన్యప్రాణుల సంరక్షణను కూడా మరింత సమర్థంగా చేపట్టే అవకాశం ఉంటుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement