త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ అవకతవకలు : దాసోజు శ్రవణ్‌

Dasoju Sravan | రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ దందాలు, అవినీతికి పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన ‘పీఎం ఏక్తా మాల్‌’ ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకలపై పలు ఆరోపణలు చేశారు.

P

Telangana | Published On Aug 21, 2026, 8.10 pm IST

Dasoju Sravan | ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ అవకతవకలు : దాసోజు శ్రవణ్‌
Advertisement

Dasoju Sravan | రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ దందాలు, అవినీతికి పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన ‘పీఎం ఏక్తా మాల్‌’ ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకలపై పలు ఆరోపణలు చేశారు. కేంద్ర నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును ప్రైవేటు బిల్డర్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్రం ‘స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ పథకం కింద దేశవ్యాప్తంగా ఏక్తా మాల్స్‌ కోసం రూ.5 వేల కోట్లు కేటాయించిందని, తెలంగాణకు రూ.202 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. 33 జిల్లాల సంప్రదాయ చేతివృత్తుల ఉత్పత్తులను ఒకే వేదికపై ప్రదర్శించాలన్నదే ప్రాజెక్టు ఉద్దేశమన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రూపొందించిన డీపీఆర్‌లో గ్రౌండ్‌ ప్లస్‌ నాలుగు అంతస్తులతో మొత్తం ఆరు ఫ్లోర్లు, 2.12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.202 కోట్లతో నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు. రూ.101 కోట్లను తొలి విడతగా విడుదల చేసిందన్నారు.

డీపీఆర్ కాక‌ముందే..

అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్ర అనుమతి లేకుండానే ఆ ప్రాజెక్టును 43 అంతస్తుల ట్విన్‌ టవర్లుగా మార్చిందని శ్రవణ్‌ ఆరోపించారు. నిర్మాణ విస్తీర్ణాన్ని 2 లక్షల నుంచి 27 లక్షల చదరపు అడుగులకు పెంచారని విమర్శించారు. డీపీఆర్‌ ఖరారు కాకముందే, జీహెచ్‌ఎంసీ అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టారని.. తొలుత రూ.7.78 కోట్లుగా ఉన్న ఎక్సకవేషన్‌ కాంట్రాక్టును రూ.26.04 కోట్లకు పెంచారని ఆరోపించారు. టెండర్‌ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు. ప్రీ-బిడ్‌ సమావేశానికి పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు హాజరైనా.. చివరకు అపర్ణ బిల్డర్స్‌ను వంశీరామ్‌ బిల్డర్స్‌తో కన్సార్టియంగా తెరపైకి తెచ్చారని ఆరోపించారు. మొత్తం 27 లక్షల చదరపు అడుగుల్లో ప్రభుత్వానికి 9.18 లక్షల చదరపు అడుగులు మాత్రమే దక్కేలా, మిగిలిన స్థలం, భవిష్యత్తు టీఆర్ఆర్‌, ఎఫ్‌ఎస్‌ఐ హక్కులు ప్రైవేటు సంస్థలకు వెళ్లేలా ఒప్పందాలు చేస్తున్నారని విమర్శించారు.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బ‌దిలీ..

లిప్కో ఆధీనంలోని 6 ఎకరాల 12 గుంటల దళితుల భూమిని, మార్కెట్‌ విలువ సుమారు రూ.1,300 కోట్లుగా ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్‌ బదిలీ పేరుతో ప్రైవేటు బిల్డర్లకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. టెండర్లు ఖరారు కాకముందే కేంద్ర నిధుల నుంచి రూ.60 కోట్లను జీహెచ్‌ఎంసీ పర్మిషన్‌ ఫీజుగా చెల్లించడంపైనా ఆయన ప్రశ్నలు సంధించారు. ఈ వ్యవహారంపై కేటీఆర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసిన నేపథ్యంలో.. డీపీఆర్‌, ప్రాజెక్టు వ్యయం, నిధుల వినియోగంపై కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) రాష్ట్రాన్ని వివరణ కోరిందని శ్రవణ్‌ తెలిపారు.

బీఆర్‌ఎస్‌ డిమాండ్లు

ప్రస్తుత ఏక్తా మాల్‌ టెండర్‌ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని, కేంద్ర నిధుల దుర్వినియోగం, దళితుల భూముల వ్యవహారంపై సీబీఐ, సీఏజీ, కేంద్ర లోక్‌పాల్‌తో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే లోకాయుక్తను ఆశ్రయించామని తెలిపారు. అసెంబ్లీ లేదా శాసనమండలిలో పత్రాలు, ఆధారాలతో బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. ఈ వ్యవహారంపై ప్రజాక్షేత్రంలో, చట్టసభల్లో బీఆర్‌ఎస్‌ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Advertisement
Advertisement