త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Srihari | రాజకీయ కక్షతోనే సీఎం అమెరికా పర్యటనను అడ్డుకున్నారు : మంత్రి వాకిటి శ్రీహరి

Minister Srihari | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. రాజకీయ కక్షతోనే సీఎం పర్యటనను అడ్డుకున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రులు జీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఈ అంశంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

P

Telangana | Published On Aug 21, 2026, 7.29 pm IST

Minister Srihari | రాజకీయ కక్షతోనే సీఎం అమెరికా పర్యటనను అడ్డుకున్నారు : మంత్రి వాకిటి శ్రీహరి
Advertisement

Minister Srihari | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. రాజకీయ కక్షతోనే సీఎం పర్యటనను అడ్డుకున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రులు జీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఈ అంశంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పేద, బడుగు, బలహీన, దళిత, మైనార్టీ వర్గాల పిల్లలకు ప్రపంచస్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణకు ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను తీసుకురావడం, విద్యారంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, అత్యుత్తమ విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడంపై పర్యటనలో చర్చించాలనుకున్నారని పేర్కొన్నారు.

అనుమ‌తి నిరాక‌రించ‌డం దుర‌దృష్ట‌క‌రం..

అమెరికా పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కేంద్రానికి అధికారికంగా పంపించినప్పటికీ.. రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం దురదృష్టకరమని శ్రీహరి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలను కూడా రాజకీయాలకు అతీతంగా చూడలేని స్థాయికి భాజపా దిగజారిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రపంచస్థాయి విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే.. భాజపా, భారాస నేతలు రాజకీయ విమర్శలతో కాలం గడుపుతున్నారని అన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

రాజ‌కీయాలు చేయ‌డం మానాలి..

“తెలంగాణలోని బడుగు, బలహీన, దళిత, మైనార్టీ వర్గాల పిల్లలకు ప్రపంచస్థాయి విద్యా అవకాశాలు కల్పించేందుకు సీఎం వెళ్తే అడ్డంకులు సృష్టిస్తారా?” అని మంత్రి ప్రశ్నించారు. సీఎం పర్యటనను కేంద్రం నిరాకరించిన అంశంపై భాజపా ఎంపీలు రఘునందన్‌రావు, ధర్మపురి అరవింద్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భాజపా, భారాస మధ్య రాజకీయ అవగాహన మరోసారి బహిర్గతమైందని శ్రీహరి అన్నారు. కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వానికి లభిస్తున్న ఆదరణను చూసి రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించినంత మాత్రాన తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. “విద్యార్థుల భవిష్యత్తుపై రాజకీయాలు చేయడం మానుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి” అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

Advertisement
Advertisement