త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఘ‌నంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (ఆలయ శుద్ధి కార్యక్రమం)ను అర్చకులు, అధికారులు ఆగమోక్తంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

P

Devotional | Published On Sep 8, 2026, 4.00 pm IST

TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఘ‌నంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
Advertisement

TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (ఆలయ శుద్ధి కార్యక్రమం)ను అర్చకులు, అధికారులు ఆగమోక్తంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. సెప్టెంబరు 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలతోపాటు ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి వంటి ముఖ్య పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు.

ఆలయం అంతటా శుద్ధి

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంలో భాగంగా ఆనందనిలయం నుంచి బంగారు వాకిలి వరకు ఆలయ అంతర్భాగాలను శుద్ధి చేశారు. శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పులతోపాటు పూజా సామగ్రిని సైతం శుభ్రపరిచారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా ఈ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమయంలో శ్రీవారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి కార్యక్రమం ముగిసిన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి అర్చకులు ప్రత్యేక పూజలు, నైవేద్యాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమంలో పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో భాస్కర్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement