త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kedarnath Yatra | తొలిసారి కేదార్‌నాథ్ యాత్ర‌కు వెళ్తున్నారా? ఈ చిట్కాలు పాటించండి..!

Kedarnath Yatra | ఉత్తరాఖండ్‌ అందమైన లోయల మధ్య విరాజిల్లుతున్న కేదార్‌నాథ్ దేవాలయ దర్శనం ప్రతి భక్తుడి కల. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్రక్షేత్రాన్ని దర్శించేందుకు తరలివస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారంతా ఎక్కువగా ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడి నుంచి యాత్రకు బయలుదేరుతారు.

P

Devotional | Published On Apr 18, 2026, 3.23 pm IST

Kedarnath Yatra | తొలిసారి కేదార్‌నాథ్ యాత్ర‌కు వెళ్తున్నారా? ఈ చిట్కాలు పాటించండి..!
Advertisement

Kedarnath Yatra | ఉత్తరాఖండ్‌ అందమైన లోయల మధ్య విరాజిల్లుతున్న కేదార్‌నాథ్ దేవాలయ దర్శనం ప్రతి భక్తుడి కల. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్రక్షేత్రాన్ని దర్శించేందుకు తరలివస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారంతా ఎక్కువగా ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడి నుంచి యాత్రకు బయలుదేరుతారు. అయితే, ఈ యాత్ర ఆధ్యాత్మికంగా ఎంత గొప్పదో.. అంతే కష్టసాధ్యమైంది. కఠినమైన కొండ మార్గాలు, క్షణాల్లో మారే వాతావరణ పరిస్థితులు, పొడవైన ట్రెక్కింగ్‌ కారణంగా ఈ ప్రయాణం సవాళ్లతో కూడి ఉంటుంది. అందుకే కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లే ముందు సరైన ప్రణాళిక, అవసరమైన సమాచారం తప్పనిసరి. చిన్న పొరపాటు కూడా యాత్రను ఇబ్బందికరంగా మార్చే అవకాశం ఉంది.

యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..?

ఈ ఏడాది ఏప్రిల్‌ 22న కేదార్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు ఆలయ ద్వారాలు భక్తులకు తెరవనున్నారు. చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్‌ 19న యమునోత్రి–గంగోత్రి యాత్రతో ప్రారంభమవుతుంది. బద్రీనాథ్ యాత్ర ఏప్రిల్‌ 23న ప్రారంభమవుతుంది. ఢిల్లీ నుంచి కేదార్‌నాథ్ చేరుకోవాలంటే ముందుగా రైలు లేదంటే బస్సు ద్వారా హరిద్వార్, ఋషికేశ్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి గౌరికుండ్‌ వరకు ప్రయాణించాలి. గౌరికుండ్ నుంచే ట్రెక్కింగ్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సుమారు 16 నుంచి 18 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. ఋషికేశ్‌ నుంచి గౌరికుండ్‌కు బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి..

కేదార్‌నాథ్ యాత్రకు ప్రభుత్వ అనుమతి, రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇది యాత్ర భద్రతకు తోడ్పడటమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో సహాయకారిగా ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో వాతావరణం ఎప్పుడైనా మారిపోతుంటుంది. అందువల్ల వెచ్చని దుస్తులు, రేన్‌కోట్‌, ట్రెక్కింగ్ షూలు, అవసరమైన మందులు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. అలాగే వాటర్‌ బాటిల్‌, ఇన్‌స్టంట్‌ ఎనర్జీ ఇచ్చే ఆహార పదార్థాలను వెంట తీసుకెళ్లడం మంచిది. ఈ యాత్రలో పొడవైన ట్రెక్కింగ్ ఉండటంతో శారీరకంగా దృఢంగా ఉండాలి. యాత్రకు ముందు రోజూ స్వల్పంగా నడవడం, తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల ట్రెక్కింగ్ సమయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉండవు.

వాతావరణం, భద్రత విషయంలో జాగ్రత్త

ప్రయాణానికి ముందు వాతావరణ పరిస్థితులు తెలుసుకోవాలి. వర్షం, మంచు పడే సమయంలో యాత్రను నివారించడం మంచిది. ప్రభుత్వం జారీ చేసే సూచనలు పాటిస్తూ సురక్షిత మార్గాలను మాత్రమే ప్రయాణించడం మంచిది. ముందస్తు జాగ్రత్తలు, సరైన ప్రణాళిక కలిసివస్తే కేదార్‌నాథ్ యాత్రను సురక్షితంగా, సుఖంగా పూర్తి చేసుకోవచ్చు.

చార్‌ధామ్ యాత్రకు ఆన్‌లైన్ నమోదు ఇలా..

చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు ముందుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం తప్పనిసరి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించాలి. నమోదు ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకునేందుకు కొన్ని దశలను అనుసరించాలి. మొదట registrationandtouristcare.uk.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ‘రిజిస్ట్రేషన్’ లేదా ‘చార్‌ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్’ ఎంపికపై క్లిక్ చేయాలి. కొత్తగా నమోదు చేసుకునే వారు తమ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ వివరాలతో సైన్‌అప్ పూర్తి చేయాలి. ఆ తర్వాత లాగిన్ అయిన తర్వాత యాత్రకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. ఇందులో యాత్ర తేదీలు, యాత్ర రకం, ప్రయాణించే వారి వివరాలు వంటి అంశాలు ఉంటాయి. అలాగే ప్రతి యాత్రికుడి గుర్తింపు కోసం ఆధార్, పాన్ వంటి ఫోటో ఐడీలను అప్‌లోడ్ చేయాలి. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించి చివరగా సబ్మిట్ చేయాలి. నమోదు విజయవంతంగా పూర్తయ్యాక యాత్రికులకు రిజిస్ట్రేషన్ స్లిప్ లేదా క్యూ ఆర్ కోడ్ అందుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.

అవసరమైన పత్రాలు

ఆన్‌లైన్ నమోదు కోసం కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు తప్పనిసరి. అందులో ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రం, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉంటాయి. రిజిస్ట్రేషన్ లేకుండా యాత్ర చేయడం కష్టసాధ్యం కాబట్టి ముందుగానే నమోదు చేసుకోవడం మంచిది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం యాత్రను కొనసాగించాలి. అలాగే, ప్రయాణానికి ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. సమగ్ర ప్రణాళికతో పాటు ఆన్‌లైన్‌లో ముందస్తు నమోదు పూర్తి చేస్తే చార్‌ధామ్ యాత్రను సురక్షితంగా, సౌకర్యవంతంగా పూర్తి చేయొచ్చు.

Advertisement
Advertisement