త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vehicle Thefts in India | దేశంలో ప్రతి 2.3 నిమిషాలకు ఒక వాహనం చోరీ.. తెలంగాణలో ఎన్ని ఎత్తుకుపోయారంటే?

భారత్‌లో వెహికల్ దొంగతనాలు భారీగా పెరిగాయి. ఎన్సీఆర్‌బీ 2024 నివేదిక ప్రకారం ప్రతి 2.3 నిమిషాలకు ఒక వాహనం చోరీకి గురవుతోంది. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే?

J

Crime | Published On Aug 12, 2026, 4.16 pm IST

Vehicle Thefts in India | దేశంలో ప్రతి 2.3 నిమిషాలకు ఒక వాహనం చోరీ.. తెలంగాణలో ఎన్ని ఎత్తుకుపోయారంటే?
Advertisement
  • 2024లో దేశవ్యాప్తంగా 2.3 లక్షలకు పైగా వాహనాలు చోరీకి గురయ్యాయని ఎన్సీఆర్‌బీ (NCRB) నివేదిక
  • సగటున ప్రతి 2.3 నిమిషాలకు ఒక వాహనం దొంగతనం
  • 40,139 కేసులతో ఢిల్లీ టాప్ ప్లేస్‌లో
  • తెలంగాణలో 8,330, ఆంధ్రప్రదేశ్‌లో 5,208 వెహికల్ దొంగతనాల కేసులు నమోదు
  • లక్షద్వీప్‌లో ఒక్క కేసు నమోదు కాకపోగా, లడఖ్, అండమాన్ నికోబార్ దీవులు అత్యంత సురక్షితంగా 

Vehicle Thefts in India | త్రినేత్ర.న్యూస్ : భారత్‌లో వాహనాల దొంగతనాలు (Vehicle thefts) ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2024 నివేదిక విస్తుపోయే నిజాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా గతేడాది ఏకంగా 2.3 లక్షలకు పైగా వెహికల్స్ చోరీకి గురయ్యాయి. అంటే, సగటున ప్రతి 2.3 నిమిషాలకు ఒక కారు లేదా బైక్‌ను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. ఈ ప్రాపర్టీ క్రైమ్ (Property crime) డేటాలో ఢిల్లీ అందరికంటే ముందుంది.

ఢిల్లీలోనే అత్యధికం.. టాప్-5లో ఎవరంటే?

ఈ దొంగతనాల్లో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ రికార్డు స్థాయిలో 40,139 వాహనాలు దొంగతనానికి గురవుతున్నాయి. దేశంలోని మరే ఇతర రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం దరిదాపుల్లో కూడా లేనంత భారీగా ఇక్కడ దొంగతనాలు జరుగుతుండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్ (28,411), మహారాష్ట్ర (26,782), ఉత్తరప్రదేశ్ (20,315), రాజస్థాన్ (17,353) రాష్ట్రాలు టాప్-5లో నిలిచాయి. హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో 2024లో 8,330 వెహికల్ చోరీ కేసులు నమోదయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా 5,208 వాహనాలను దొంగలు అపహరించారు. మన పొరుగున ఉన్న కర్ణాటక (11,659), తమిళనాడు (7,663) రాష్ట్రాల్లోనూ ఈ తరహా క్రైమ్ రేట్ ఎక్కువే ఉంది.

Vehicle Thefts in India 1 Stolen Every 2.3 Mins Delhi Tops List

అత్యంత సురక్షిత ప్రాంతాలు ఇవే

ఒకవైపు వేల సంఖ్యలో వాహనాలు మాయం అవుతుంటే.. కొన్ని చోట్ల మాత్రం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. లక్షద్వీప్‌లో 2024లో ఒక్క వెహికల్ చోరీ కేసు కూడా నమోదు కాలేదు (జీరో కేసులు). ఇక లడఖ్‌లో కేవలం 2, అండమాన్ నికోబార్ దీవుల్లో 3, సిక్కింలో 5 కేసులు మాత్రమే రికార్డ్ అయ్యాయి.

అయితే, ఇక్కడో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇవి కేవలం పోలీసులకు రిపోర్ట్ చేయబడిన (Registered cases) దొంగతనాల కచ్చితమైన సంఖ్య మాత్రమే. రాష్ట్ర జనాభా లేదా అక్కడ రిజిస్టర్ అయిన మొత్తం వాహనాల సంఖ్య ఆధారంగా తీసిన క్రైమ్ రేట్ (Crime rate) కాదు. కాబట్టి, ఏ రాష్ట్రంలో అత్యధికంగా దొంగతనాలు రికార్డ్ అయ్యాయో మాత్రమే ఈ డేటా సూచిస్తుంది. కానీ, ఒక వాహనానికి ఎక్కడ ఎక్కువ ముప్పు ఉందనేది కచ్చితంగా నిర్ధారించలేము.

Advertisement
Advertisement