త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mumbai Monsoon 2026 | ముంబైని వణికిస్తున్న వర్షాలు.. కొత్త షాప్ తెరుస్తుండగా చెట్టు విరిగిపడి వృద్ధుడి దుర్మరణం!

ముంబైలో భారీ వర్షాలకు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కుర్లాలో తన కొత్త షాపును ప్రారంభించేందుకు వచ్చిన ఓ వృద్ధుడిపై భారీ చెట్టు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

J

Crime | Published On Jul 5, 2026, 5.11 pm IST

Mumbai Monsoon 2026 | ముంబైని వణికిస్తున్న వర్షాలు.. కొత్త షాప్ తెరుస్తుండగా చెట్టు విరిగిపడి వృద్ధుడి దుర్మరణం!
Advertisement
  • ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు కుర్లా ప్రాంతంలో 63 ఏళ్ల యూనస్ షేక్ అనే వృద్ధుడిపై చెట్టు పడి మృతి
  • కొత్త షాప్ ఓపెనింగ్ కోసం వచ్చిన ఆయనపై చెట్టు పడిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్
  • గత కొద్ది రోజుల్లోనే ముంబైలో చెట్లు విరిగిపడి, మ్యాన్‌హోల్స్‌లో పడి నలుగురు మృతి
  • ముంబైకి IMD రెడ్ అలర్ట్ జారీ
  • గంటకు 55-65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక

Mumbai Monsoon 2026 | త్రినేత్ర.న్యూస్ : ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్షాకాలం (Monsoon) ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వర్షాలకు సంబంధించిన ప్రమాదాలు నగర వాసుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా ఆదివారం మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో ముంబైలోని కుర్లా వెస్ట్‌లో (Kurla West) ఓ 63 ఏళ్ల వృద్ధుడిపై భారీ చెట్టు విరిగిపడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

కొత్త షాప్ ఓపెన్ చేద్దామనుకుంటే

మృతుడిని యూనస్ హకీముద్దీన్ షేక్‌గా పోలీసులు గుర్తించారు. నౌపడ ప్రాంతంలో ఆయన ఇటీవలే ఓ కొత్త షాపును కొనుగోలు చేశారు. దాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకునేందుకు ఆదివారం ఉదయం అక్కడికి వచ్చారు. షాప్ ముందు నిలబడి ఉండగా.. ఒక్కసారిగా భారీ వృక్షం ఆయనపై విరిగిపడింది. ఈ భయానక దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

చెట్టు పడిన వెంటనే స్థానికులు ఆయన్ను శిథిలాల నుంచి బయటకు తీసి ఫౌజియా ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, చెట్టు పడిన తర్వాత కనీసం రెండు గంటల వరకు బీఎంసీ (BMC) సిబ్బంది ఎవరూ అక్కడికి రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అంబానీ కాన్వాయ్ ముందు విరిగిపడిన మరో చెట్టు

ఈ ప్రమాదం జరిగిన కుర్లాకు కొద్ది కిలోమీటర్ల దూరంలో బాంద్రా ఈస్ట్‌లో మరో భారీ చెట్టు విరిగిపడింది. సరిగ్గా ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సెక్యూరిటీ కాన్వాయ్ వెళ్తున్న సమయంలోనే ఈ ఘటన జరగడంతో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే పోలీసులు, బీఎంసీ సిబ్బంది అప్రమత్తమై రోడ్డును క్లియర్ చేశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

వరుస ప్రమాదాలు.. భయంలో ముంబైకర్లు

గత కొద్ది రోజులుగా ముంబైలో ఇలాంటి ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. జూన్ 30న ఓ స్కూల్ బస్సుపై పీపల్ చెట్టు విరిగిపడటంతో 11 ఏళ్ల బాలుడు విహాన్ శ్రీవాస్తవ ప్రాణాలు కోల్పోయాడు. అలాగే మీరా భయందర్ ప్రాంతంలో మరో వ్యక్తి చెట్టు కిందపడి మరణించాడు. ఇక జూలై 2న సాకినాకా ప్రాంతంలో పనికి వెళ్తున్న 55 ఏళ్ల వ్యక్తి.. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్ (Open Manhole) లో పడి ప్రాణాలు విడిచాడు. మున్సిపల్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ఈ మరణాలకు కారణమని ప్రజలు మండిపడుతున్నారు.

ముంబైకి రెడ్ అలర్ట్

గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 250 నుంచి 300 మి.మీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే గంటల్లో గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బీఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. వాటర్ లాగింగ్ సమస్య ఉన్న కుర్లా-అంధేరి రోడ్డు గుండా ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement
Advertisement