త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dharwad Murder Case | నెత్తురోడుతున్న భర్త శవం.. చావుబతుకుల్లో కొడుకు: ఫోన్ చూసుకుంటూ భార్య! కళ్లు చెదిరే క్రైమ్ స్టోరీ

ధార్వాడ్‌లో దారుణం! భర్త రక్తపు మడుగులో విగతజీవిగా, 8 ఏళ్ల కొడుకు తీవ్ర గాయాలతో పడి ఉంటే.. డాక్టర్ అయిన భార్య బెడ్‌పై ఏం చేస్తూ దొరికిందంటే?

J

Crime | Published On Jul 16, 2026, 6.17 pm IST

Dharwad Murder Case | నెత్తురోడుతున్న భర్త శవం.. చావుబతుకుల్లో కొడుకు: ఫోన్ చూసుకుంటూ భార్య! కళ్లు చెదిరే క్రైమ్ స్టోరీ

సంక్షిప్త సారాంశం

కర్ణాటకలోని ధార్వాడ్‌లో డాక్టర్ కిరణ్ హొన్నానవర్ దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఆయన శవమై కనిపించగా, 8 ఏళ్ల కుమారుడు కత్తిపోట్లతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ దారుణం జరిగిన ఇంట్లోనే ఉన్న ఆయన భార్య, డాక్టర్ ప్రియాంక ఏమీ పట్టనట్లు ఫోన్ చూసుకుంటూ కనిపించడం కలకలం రేపింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Dharwad Murder Case | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటక (Karnataka)లోని ధార్వాడ్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో 45 ఏళ్ల డాక్టర్ కిరణ్ హొన్నానవర్ రక్తపు మడుగులో దారుణంగా హత్యకు గురయ్యారు. పక్క గదిలో 8 ఏళ్ల కుమారుడు కత్తిపోట్లతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ, అదే ఇంట్లో ఉన్న ఆయన భార్య, డాక్టర్ ప్రియాంక మాత్రం ఏమీ పట్టనట్లు బెడ్‌పై పడుకుని మొబైల్ ఫోన్ (Mobile phone) చూసుకుంటూ ఉండటం పోలీసులను సైతం నివ్వెరపరిచింది.

తలుపులు బద్దలుకొట్టి చూస్తే

మృతుడు కిరణ్ హొన్నానవర్ అనస్థీటిస్ట్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తున్నా.. ఎలాంటి స్పందన లేదు. దీనితో అనుమానం వచ్చిన బంధువులు నేరుగా కర్ణాటక యూనివర్సిటీ రోడ్డులోని రంకా స్టెల్లో అపార్ట్‌మెంట్స్‌ (Ranka Stello Apartments) కు చేరుకున్నారు. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వారు షాక్‌కు గురయ్యారు.

అసలేం జరిగింది?

మెడపై బలమైన కత్తిపోట్లతో డాక్టర్ కిరణ్ కింద పడిపోయి ప్రాణాలు వదిలారు. మరో గదిలో వారి 8 ఏళ్ల కొడుకు తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. బాలుడికి ఇంకా శ్వాస ఆడుతుండటంతో వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పిల్లాడికి చికిత్స అందుతోంది. అయితే, అదే ఇంట్లో ఉన్న కంటి డాక్టర్ ప్రియాంక బెడ్‌పై రిలాక్స్‌డ్‌గా పడుకుని ఫోన్ స్క్రోలింగ్ (Scrolling) చేస్తుండటం సంచలనంగా మారింది.

Dharwad Doctor Murder Husband Dead Son Stabbed Wife Found Scrolling Phone

పొంతనలేని సమాధానాలు

అంతకుముందు బంధువులు ఫోన్ చేసినప్పుడు డాక్టర్ ప్రియాంక ఎత్తి పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఒకసారి భర్త విశ్రాంతి తీసుకుంటున్నారని, మరోసారి ఆయన బయటకు వెళ్లారని బుకాయించినట్లు హుబ్బళ్ళి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ వెల్లడించారు. ఈ హై-సెక్యూరిటీ అపార్ట్‌మెంట్‌లోకి బయటి వ్యక్తులు ఎవరూ రాలేదని.. ఆ సమయంలో ఇంట్లో భార్యాభర్తలు, వారి పిల్లాడు మాత్రమే ఉన్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

పోలీసుల అదుపులో భార్య

ఈ ఘటనపై సబర్బన్ పోలీస్ స్టేషన్‌లో మర్డర్ కేసు (Murder case) నమోదు చేశారు. డాక్టర్ ప్రియాంకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె ప్రస్తుతం తీవ్రమైన షాక్‌లో ఉన్నారని, అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడం లేదని పోలీసులు తెలిపారు.

భార్యాభర్తల మధ్య ఉన్న కుటుంబ కలహాలే ఈ దారుణానికి దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లాడికి ఆటిజం (Autism) ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా.. అది ఇంకా నిర్ధారణ కాలేదు. డాక్టర్ కిరణ్ పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని (CCTV footage) పరిశీలిస్తూ లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement