త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Demat 2.0 | డీమ్యాట్‌ 2.0: బాండ్లలో డిజిటల్‌ విప్లవం.. ఇక నగదు, బాండ్‌ ఒకేసారి సెటిల్‌మెంట్‌

Demat 2.0 | భారత ఆర్థిక మార్కెట్లలో మరో కీలక మార్పుకు అడుగు పడింది. కార్పొరేట్‌ బాండ్లను టోకెనైజేషన్‌ చేయడాన్ని పరీక్షించేందుకు మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలు డీమ్యాట్‌ 2.0 పేరుతో కొత్త వ్యవస్థను అభివృద్ధి చేశాయి. డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ, అంటే డీఎల్‌టీ ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థలో కార్పొరేట్‌ బాండ్‌ను భాగస్వామ్య ఎలక్ట్రానిక్‌ లెడ్జర్‌పై డిజిటల్‌ టోకెన్‌గా సృష్టిస్తారు.

S

Business | Published On Sep 11, 2026, 12.30 pm IST

Demat 2.0 | డీమ్యాట్‌ 2.0: బాండ్లలో డిజిటల్‌ విప్లవం.. ఇక నగదు, బాండ్‌ ఒకేసారి సెటిల్‌మెంట్‌
Advertisement

Demat 2.0 | భారత ఆర్థిక మార్కెట్లలో మరో కీలక మార్పుకు అడుగు పడింది. కార్పొరేట్‌ బాండ్లను టోకెనైజేషన్‌ చేయడాన్ని పరీక్షించేందుకు మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలు డీమ్యాట్‌ 2.0 పేరుతో కొత్త వ్యవస్థను అభివృద్ధి చేశాయి. డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ, అంటే డీఎల్‌టీ ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థలో కార్పొరేట్‌ బాండ్‌ను భాగస్వామ్య ఎలక్ట్రానిక్‌ లెడ్జర్‌పై డిజిటల్‌ టోకెన్‌గా సృష్టిస్తారు. ఈ లెడ్జర్‌ యాజమాన్యం డిపాజిటరీల వద్దే ఉంటుంది. అయితే బాండ్‌ మాత్రం అదే చట్టబద్ధమైన ఆర్థిక సాధనంగా కొనసాగుతుంది. పెట్టుబడిదారులకు ప్రస్తుతం ఉన్న రక్షణలు, హక్కుల్లో ఎలాంటి మార్పు ఉండదు. ముంబైలో జరిగిన గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2026లో ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా, సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే సంయుక్తంగా ఈ పైలట్‌ ప్రాజెక్టును ప్రకటించారు. ప్రస్తుత నియంత్రిత సెక్యూరిటీస్‌ మార్కెట్‌ వ్యవస్థలోనే టోకెనైజేషన్‌, డీఎల్‌టీని ఉపయోగించే దిశగా భారత్‌ ముందుకు సాగుతున్నట్లు ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది.

డీమ్యాట్ 2.0 అంటే..

డీమ్యాట్‌ 2.0ను ఆర్‌బీఐ హోల్‌సేల్‌ సీబీడీసీ, అంటే ఈ-₹ (రుపీ)తో యూనిఫైడ్‌ మార్కెట్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా అనుసంధానించారు. దీని వల్ల అటామిక్‌ సెటిల్‌మెంట్‌ సాధ్యమవుతుంది. అంటే బాండ్‌, దానికి సంబంధించిన డబ్బు వేర్వేరుగా కాకుండా ఒకేసారి బదిలీ అవుతాయి. దీనివల్ల సెటిల్‌మెంట్‌ సమయం తగ్గడమే కాకుండా, లావాదేవీలో ఒకవైపు మాత్రమే బదిలీ జరిగి మరోవైపు ఆలస్యం కావడం వల్ల ఏర్పడే ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే స్మార్ట్‌ కాంట్రాక్టుల ద్వారా వడ్డీ చెల్లింపులు, బాండ్‌ రిడెంప్షన్‌ వంటి ప్రక్రియలను ఆటోమేట్‌ చేయవచ్చు. లెడ్జర్‌లో ముందుగా నిర్దేశించిన షరతులు నెరవేరినప్పుడు ఈ సూచనలు ఆటోమేటిగ్గా అమలవుతాయి. జారీదారులకు ప్రధాన ప్రయోజనం వేగం. ప్రస్తుతం బాండ్‌ బిడ్డింగ్‌ పూర్తైన తర్వాత నిధులు జారీదారులకు చేరడానికి సాధారణంగా రెండు నుంచి మూడు రోజులు పడుతోంది. డీమ్యాట్‌ 2.0 ద్వారా అదే రోజు నిధులు అందే అవకాశం ఉంటుంది. సెకండరీ మార్కెట్‌లో బాండ్లను విక్రయించే పెట్టుబడిదారులకు కూడా ఇదే ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా రెండు నుంచి మూడు రోజులు వేచి చూడాల్సిన అవసరం లేకుండా విక్రయించిన వెంటనే నిధులు అందేలా వ్యవస్థ రూపొందిస్తున్నారు. ఇంటర్మీడియరీల విషయంలోనూ మాన్యువల్‌ ఫైల్‌ షేరింగ్‌, రీకన్సిలియేషన్‌, డేటా ధ్రువీకరణ వంటి పనులు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల బాండ్ల జారీ, నిర్వహణకు అయ్యే ఖర్చులు కూడా తగ్గనున్నాయి.

బాండ్ స‌ర్వీసింగ్ ప్ర‌క్రియ ఆటోమేటిగ్గా..

డీమ్యాట్‌ 2.0లో బాండ్‌ సర్వీసింగ్‌ ప్రక్రియను ఆటోమేట్‌ చేయడం లక్ష్యంగా నిర్ణ‌యించుకున్నారు. ప్రస్తుతం జారీదారులు లేదా రిజిస్ట్రార్లు డిపాజిటరీల నుంచి బాండ్‌ హోల్డర్ల వివరాలను తీసుకుని, ప్రతి పెట్టుబడిదారుడికి చెల్లించాల్సిన మొత్తాన్ని లెక్కించి, బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేస్తుంటారు. కొత్త విధానంలో అధీకృత సంస్థలు భాగస్వామ్య లెడ్జర్‌లో ఉన్న బాండ్‌ హోల్డర్‌ సమాచారాన్ని యాక్సెస్ చేస్తాయి. వడ్డీ, రిడెంప్షన్‌ చెల్లింపులు స్మార్ట్‌ కాంట్రాక్టుల ద్వారా ఆటోమేటిక్‌గా ప్రారంభమయ్యేలా చేయవచ్చు. నిర్ణీత గడువు రోజున పెట్టుబడిదారుడి సీబీడీసీ వాలెట్‌లో ఈ-₹ (రుపీ) రూపంలో నగదు జమ అవుతుంది. డీమ్యాట్‌ 2.0 పైలట్‌ ఇప్పటికే వాస్తవ బాండ్‌ జారీల దశకు చేరుకుంది. మూడు కంపెనీలు కలిసి మొత్తం రూ.1,025 కోట్ల విలువైన టోకెనైజ్డ్‌ బాండ్లను జారీ చేశాయి. సెప్టెంబర్‌ 7న ఆర్‌ఈసీ తొలిసారిగా రూ.500 కోట్లను 18 మంది పెట్టుబడిదారుల నుంచి సమీకరించింది. సెప్టెంబర్‌ 9న ఎల్‌అండ్‌టీ రూ.500 కోట్ల బాండ్‌ను నలుగురు పెట్టుబడిదారులకు జారీ చేసింది. అదే రోజు ఐఐఎఫ్‌ఎల్‌ రూ.25 కోట్లను ఒక పెట్టుబడిదారుడి నుంచి సమీకరించింది. సెబీ రెగ్యులేటరీ శాండ్‌బాక్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కింద టోకెనైజ్డ్‌ కార్పొరేట్‌ బాండ్‌ను పైలట్‌ ప్రాతిపదికన జారీ చేసిన తొలి సంస్థగా ఆర్‌ఈసీ నిలిచింది.

క్రిప్టో క‌రెన్సీనా..?

అయితే డీమ్యాట్‌ 2.0 అంటే క్రిప్టోకరెన్సీ కాదు. డీమ్యాట్‌ 2.0 కొత్త క్రిప్టోకరెన్సీని సృష్టించడం కాదు. అలాగే నియంత్రణలు లేని బాండ్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేయడం కూడా కాదు. బాండ్‌ యాజమాన్యాన్ని నమోదు చేయడం, దాని సర్వీసింగ్‌ నిర్వహించే సాంకేతిక విధానం మాత్రమే మారుతోంది. బాండ్‌ వెనుక ఉన్న అసలు సెక్యూరిటీ మాత్రం అదే కొనసాగుతుంది. జారీదారుడి పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించాల్సిన బాధ్యతలో ఎలాంటి మార్పు ఉండదు. పెట్టుబడిదారుల హక్కులు కూడా కొనసాగుతాయి. క్రెడిట్‌ రేటింగ్‌ నిబంధనలు, డిబెంచర్‌ ట్రస్టీలు, లిస్టింగ్‌ నిబంధనలు, డిస్క్లోజర్‌ ప్రమాణాలు యథావిధిగా వర్తిస్తాయి. టోకెనైజ్డ్‌ బాండ్లు కూడా పూర్తిగా కొత్త మార్కెట్‌లో కాకుండా ఇప్పటికే ఉన్న నియంత్రిత మార్కెట్‌ మౌలిక వ్యవస్థలోనే ట్రేడ్‌ అయ్యేలా ఈ విధానాన్ని రూపొందిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు ద్వారా లభించే అనుభవం ఆధారంగా డీమ్యాట్‌ 2.0 మౌలిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్తులో దీనిని విస్తృత స్థాయిలో అమలు చేయగలమా అన్నది ఈ ప్రయోగం ద్వారా స్పష్టమవుతుంది.

ల‌క్ష్య‌మేంటి..?

కార్పొరేట్‌ బాండ్ల జారీ, సెటిల్‌మెంట్‌, సర్వీసింగ్‌ ప్రక్రియలను వేగవంతం చేయడం, సమర్థత పెంచడం డీమ్యాట్‌ 2.0 ప్రధాన లక్ష్యం. అదే సమయంలో పెట్టుబడిదారులకు ప్రస్తుతం ఉన్న నియంత్రణ పరమైన రక్షణల్లో ఎలాంటి మార్పు చేయడం లేదు. అందువల్ల డీమ్యాట్‌ 2.0 అనేది బాండ్‌ మార్కెట్‌ను పూర్తిగా మార్చేయడం కంటే, మార్కెట్‌ వెనుక పనిచేసే సాంకేతిక వ్యవస్థను ఆధునీకరించే ప్రయత్నంగా చెప్ప‌వ‌చ్చు.

Advertisement
Advertisement