త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI | డిజిట‌ల్ చెల్లింపుల‌కు పోటీగా న‌గ‌దు వినియోగం.. ఎస్‌బీఐ నివేదిక‌లో వెల్ల‌డి..

SBI | దేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ నగదు వినియోగం ఏమాత్రం తగ్గ‌డం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజా నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి దేశంలో చెలామణీలో ఉన్న కరెన్సీ రూ.40 లక్షల కోట్లకు చేరి సరికొత్త రికార్డు నెలకొల్పిన‌ట్లు వెల్ల‌డైంది.

S

Business | Published On Feb 18, 2026, 10.10 am IST

SBI | డిజిట‌ల్ చెల్లింపుల‌కు పోటీగా న‌గ‌దు వినియోగం.. ఎస్‌బీఐ నివేదిక‌లో వెల్ల‌డి..
Advertisement

SBI | దేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ నగదు వినియోగం ఏమాత్రం తగ్గ‌డం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజా నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి దేశంలో చెలామణీలో ఉన్న కరెన్సీ రూ.40 లక్షల కోట్లకు చేరి సరికొత్త రికార్డు నెలకొల్పిన‌ట్లు వెల్ల‌డైంది. ఇది గతేడాదితో పోలిస్తే 11.1 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయగా, గత సంవత్సరం ఇదే స‌మ‌యంలో ఈ వృద్ధి 5.3 శాతంగానే ఉండడం గమనార్హం. UPI, డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తున్నా, గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో క‌రెన్సీ వినియోగం ఎక్కువ‌గా కొనసాగుతుండడంతో కాగితపు నోట్లకు డిమాండ్ తగ్గలేదని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

కార‌ణాలు ఇవే..

SBI విశ్లేషణ ప్రకారం కరెన్సీ చెలామణీ పెరగడానికి పలు కారణాలు ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం పెరగడం, తక్కువ వడ్డీ రేట్లు ప్రజలను ఖర్చు వైపు ప్రోత్సహించడం, ప్రత్యక్ష-పరోక్ష పన్ను రాయితీలు పట్టణ వినియోగాన్ని పెంచడం, అలాగే రూ.2000 నోట్ల ఉపసంహరణ తర్వాత త‌క్కువ‌ విలువ క‌లిగిన నోట్ల వినియోగం పెరగడం ప్రధాన కారణాలుగా SBI త‌న నివేదిక‌లో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం అదనంగా రూ.2.76 లక్షల కోట్ల మేర కరెన్సీ చెలామణీలోకి వచ్చిందని, గతేడాది ఇదే స‌మ‌యంలో ఈ పెరుగుదల రూ.88,517 కోట్లకే పరిమితమైందని నివేదిక వెల్లడించింది. రూ.2000 నోట్ల ఉపసంహరణ కూడా నగదు చెలామణీ పెరుగుదలలో కీలక పాత్ర పోషించింది. ఎక్కువ‌ విలువ క‌లిగిన నోట్ల స్థానంలో రూ.100, రూ.200, రూ.500 వంటి తక్కువ విలువ క‌లిగిన‌ నోట్లు అధికంగా చెలామ‌ణీలోకి రావడంతో మొత్తం నోట్ల సంఖ్య పెరిగింది. దీంతో కరెన్సీ చెలామ‌ణీగణాంకాలు మరింత పెరిగినట్లు SBI వివరించింది.

ఆర్‌బీఐ చ‌ర్య‌లు..

న‌గ‌దు వినియోగంతోపాటు డిజిటల్ చెల్లింపులు కూడా పెరుగుతుండ‌డంతో రెండింటి మ‌ధ్య పోటీ నెల‌కొంద‌ని ఎస్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. UPI లావాదేవీల విలువ పెరిగినప్పుడు నగదు అవసరం కొంత తగ్గినా, మొత్తం ఆర్థిక కార్యకలాపాలు విస్తరించడంతో నగదు డిమాండ్ మళ్లీ పెరుగుతోందని పేర్కొంది. డిజిటల్ రూపాయి (e-₹) మొత్తం కరెన్సీ విలువలో కేవలం 0.03 శాతమే ఉండగా, కాగితపు నోట్లు ఇప్పటికీ 98.99 శాతం వాటాతో ఆధిపత్యం కొనసాగిస్తున్న‌ట్లు తెలిపింది. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా చర్యలు చేపట్టింది. ఈ మేర‌కు ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్ల లభ్యతను పెంచాలని 2025 ఏప్రిల్ 28న బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. 2026 మార్చి నాటికి 96 శాతం ఏటీఎంలు ఈ త‌క్కువ‌ విలువ క‌లిగిన నోట్లను అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని తెలిపింది. ఈ చర్యల వల్ల తక్కువ విలువ క‌లిగిన నోట్ల సరఫరా మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement