త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NSE IPO | ఈ నెల‌లోనే ఎన్‌ఎస్‌ఈ ఐపీవో..? భారీ ఆఫర్..

NSE IPO | భారత స్టాక్‌ మార్కెట్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్‌ ఇష్యూ దిశగా కీలక అడుగు పడింది. ఎన్‌ఎస్‌ఈ ఐపీవో సెప్టెంబర్‌ 18న ప్రారంభమై సెప్టెంబర్‌ 22న ముగిసే అవకాశం ఉందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. సెప్టెంబర్‌ 25న షేర్ల లిస్టింగ్‌ జరిగే అవకాశం ఉంది.

S

Business | Published On Sep 9, 2026, 3.00 pm IST

NSE IPO | ఈ నెల‌లోనే ఎన్‌ఎస్‌ఈ ఐపీవో..? భారీ ఆఫర్..
Advertisement

NSE IPO | భారత స్టాక్‌ మార్కెట్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్‌ ఇష్యూ దిశగా కీలక అడుగు పడింది. ఎన్‌ఎస్‌ఈ ఐపీవో సెప్టెంబర్‌ 18న ప్రారంభమై సెప్టెంబర్‌ 22న ముగిసే అవకాశం ఉందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. సెప్టెంబర్‌ 25న షేర్ల లిస్టింగ్‌ జరిగే అవకాశం ఉంది. అయితే తుది తేదీలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ఐపీవో పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో ఉండనుంది. ఎన్‌ఎస్‌ఈలో ఇప్పటికే వాటాలు కలిగి ఉన్న షేర్‌హోల్డర్లు సుమారు 14.89 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఇది ఎన్‌ఎస్‌ఈ చెల్లించిన ఈక్విటీ మూలధనంలో దాదాపు 6 శాతానికి సమానం. కొత్తగా ఎలాంటి షేర్లను ఎన్‌ఎస్‌ఈ జారీ చేయడం లేదు. అందువల్ల ఐపీవో ద్వారా వచ్చే మొత్తం నిధులు సంస్థకు కాకుండా వాటాలను విక్రయిస్తున్న ప్రస్తుత షేర్‌హోల్డర్లకు వెళ్తాయి.

రూ.30వేల కోట్ల ఆఫ‌ర్‌..

ఈ మెగా ఐపీవో పరిమాణం సుమారు రూ.30వేల కోట్లుగా ఉంటుంద‌ని ఇప్పటివరకు అంచనాలు ఉన్నాయి. అలా జరిగితే 2024లో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా సమీకరించిన రూ.27,870 కోట్ల ఐపీవోను అధిగమించి, దేశంలోనే అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూగా ఎన్‌ఎస్‌ఈ ఐపీవో నిలిచే అవకాశం ఉంది. ఎన్‌ఎస్‌ఈ షేర్ల ముఖ విలువ ఒక్కో షేరుకు రూ.1గా ఉంది. ఎన్‌ఎస్‌ఈ విలువను రూ.5 లక్షల కోట్లకు పైగా అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన నివేదికల్లో ఐపీవో ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.1,700 నుంచి రూ.1,785 మధ్య ఉంటుంద‌ని సమాచారం వెలువడింది. ఈ ధరల వద్ద ఎన్‌ఎస్‌ఈ విలువ సుమారు రూ.4.4 లక్షల కోట్లకు చేరుతుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ధరల శ్రేణి, తుది ఇష్యూ పరిమాణంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ అంచనాలను తుది వివరాలుగా పరిగణించకూడదు.

రిటెయిల్ ఇన్వెస్ట‌ర్ల‌కు ఎప్పుడు..

ప్రస్తుత సమాచారం ప్రకారం ధరల శ్రేణిని సెప్టెంబర్‌ 15న ప్రకటించే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 17న యాంకర్‌ ఇన్వెస్టర్ల బుకింగ్ జరిగే అవ‌కాశం ఉంద‌ని, అనంతరం సెప్టెంబర్‌ 18 నుంచి సాధారణ పెట్టుబడిదారుల కోసం ఐపీవో ప్రారంభం అవుతుంద‌ని సమాచారం. ఈ ఐపీవోలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా పలువురు ప్రస్తుత వాటాదారులు తమ షేర్లను విక్రయించనున్నారు. అయితే ఎన్‌ఎస్‌ఈలో అతిపెద్ద వాటాదారైన ఎల్‌ఐసీ ఈ ఆఫర్‌లో తన వాటాలను విక్రయించడం లేదు. దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఎస్‌ఈ లిస్టింగ్‌ ప్రక్రియకు ఇటీవల సెబీ ఆమోదం లభించింది. కో-లొకేషన్‌ వివాదం, నియంత్రణపరమైన అంశాల కారణంగా ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్‌ లిస్టింగ్‌ ప్రక్రియ చాలా కాలం ఆలస్యమైంది. ఇప్పుడు నియంత్రణపరమైన అడ్డంకులు తొలగడంతో ఐపీవోకు మార్గం సుగమమైంది.

భారీగా ఆస‌క్తి..

ఎన్‌ఎస్‌ఈ ఐపీవోపై దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో భారీ ఆసక్తి నెలకొంది. భారత క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రలోనే అత్యంత కీలకమైన లిస్టింగ్‌లలో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. అయితే తుది ధరల శ్రేణి, లాట్‌ పరిమాణం, ఇష్యూ పరిమాణం వంటి వివరాలు అధికారికంగా వెల్లడైన తర్వాతే పెట్టుబడిదారులకు పూర్తి స్పష్టత రానుంది.

Advertisement
Advertisement