త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ayushman Card | ఆయుష్మాన్ కార్డుతో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం.. కార్డును ఎలా పొందాలి..

Ayushman Card | దేశంలో వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) కీలక భరోసాగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా లభించే ఆయుష్మాన్ కార్డు ఉంటే ప్రభుత్వంతోపాటు ఎంపిక చేసిన ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా చికిత్స పొందే అవకాశం కల్పిస్తోంది.

S

Business | Published On Jun 5, 2026, 3.12 pm IST

Ayushman Card | ఆయుష్మాన్ కార్డుతో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం.. కార్డును ఎలా పొందాలి..
Advertisement

Ayushman Card | దేశంలో వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) కీలక భరోసాగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా లభించే ఆయుష్మాన్ కార్డు ఉంటే ప్రభుత్వంతోపాటు ఎంపిక చేసిన ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా చికిత్స పొందే అవకాశం కల్పిస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు ఈ పథకం పెద్ద ఊరటనిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆధారిత ఆరోగ్య బీమా పథకాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రయోజనాలను పొందేందుకు జారీ చేసే డిజిటల్ గుర్తింపు పత్రాన్నే ఆయుష్మాన్ కార్డు లేదా పీఎం-జేఏవై కార్డు అని పిలుస్తారు.

కార్డును పొంద‌డం ఇలా..

ఈ కార్డు కలిగిన వారికి ఆసుపత్రిలో చేరిన సమయంలో చికిత్స కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. సుమారు 1,900కు పైగా వ్యాధులు, శస్త్రచికిత్సలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఆసుపత్రిలో చేరే ముందు మూడు రోజుల వరకు, డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు జరిగే పరీక్షలు, మందుల ఖర్చులు కూడా పథకంలో భాగంగా కవరవుతాయి. అంతేకాకుండా దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నా పథకానికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందే సౌకర్యం ఉంటుంది. ఆయుష్మాన్ కార్డు పొందే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. లబ్ధిదారులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం లేదా ఆయుష్మాన్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డం చేయాలి. అనంతరం మొబైల్ నంబర్‌తో ఓటీపీ ఆధారంగా లాగిన్ అయి రాష్ట్రం, పథకం వివరాలను ఎంపిక చేయాలి. జిల్లా వివరాలు నమోదు చేసిన తర్వాత ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డు ద్వారా పేరు వెతకాలి. జాబితాలో పేరు కనిపిస్తే ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి, లైవ్ ఫోటో అప్‌లోడ్ చేయాలి. వివరాలు సరిపోలితే వెంటనే ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాత డిజిటల్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.

స‌మ‌స్య‌ల‌కు హెల్ప్‌లైన్ నంబ‌ర్..

ఇటీవల కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ, వారి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఈ పథకాన్ని విస్తరించింది. వీరు వయో వందన’ కార్డు కోసం కూడా ఇదే విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పథకానికి సంబంధించిన సందేహాలు లేదా సమస్యల న‌మోదు కోసం 14555 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. అలాగే సమీపంలోని మీ-సేవా కేంద్రాల సహాయాన్ని పొందవచ్చు. ఆరోగ్య భద్రతను అందరికీ చేరువ చేసే దిశగా ఆయుష్మాన్ భారత్ కీలక అడుగుగా నిలుస్తోంది.

Advertisement
Advertisement