త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG | ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెంపు..? కేంద్రం కొత్త ప్లాన్‌తో వినియోగదారులపై భారం..?

LPG | వంటగ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్, పైప్డ్‌ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) ధరలు రానున్న రోజుల్లో పెరిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వంటగ్యాస్, సహజవాయువు వినియోగదారులపై కొత్త ఫీజు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

S

Business | Published On Aug 6, 2026, 4.02 pm IST

LPG | ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెంపు..? కేంద్రం కొత్త ప్లాన్‌తో వినియోగదారులపై భారం..?
Advertisement

LPG | వంటగ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్, పైప్డ్‌ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) ధరలు రానున్న రోజుల్లో పెరిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వంటగ్యాస్, సహజవాయువు వినియోగదారులపై కొత్త ఫీజు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సుమారు 42 బిలియన్ డాలర్ల‌ (దాదాపు రూ.3.6 లక్షల కోట్లు) విలువైన వ్యూహాత్మక ఇంధన నిల్వలను ఏర్పాటు చేసే ప్రణాళికపై ప్రభుత్వం పనిచేస్తున్న‌ట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనకు ఇంకా తుది ఆమోదం లభించలేదు. ప్రస్తుతం వివిధ మంత్రిత్వ శాఖల మధ్య దీనిపై చర్చలు కొనసాగుతున్న‌ట్లు సమాచారం.

వ్యూహాత్మ‌క ఇంధ‌న నిల్వ‌ల కోస‌మే..?

రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ ప్రణాళిక అమల్లోకి వస్తే తొలిసారిగా ముడిచమురు నిల్వలతోపాటు ఇతర ఇంధనాల వ్యూహాత్మక నిల్వలను కూడా భారత్ విస్తరించనుంది. ఇందులో దాదాపు రెండు నెలల ముడిచమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) అవసరాలకు సరిపడే నిల్వలు, అలాగే సుమారు ఆరు వారాల ఎల్పీజీ లేదా వంటగ్యాస్ నిల్వలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. ఈ నిల్వల కోసం అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి వంటగ్యాస్, సహజవాయువు వినియోగదారులపై ప్రత్యేక ఫీజు విధించే ప్రతిపాదన ఉంది. దీని ద్వారా ప్రతి ఏడాది సుమారు 1.5 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని సమాచారం.

ఎంత పెంచుతారు..?

రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్పీజీపై కిలోకు రూ.1.29 ఫీజు విధించే ప్రతిపాదన ఉంది. దీంతో ఏడాదికి సుమారు 460 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుంది. ఈ ఫీజు అమల్లోకి వస్తే 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర దాదాపు రూ.18 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పీఎన్‌జీపై ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు రూ.1.43 ఫీజు విధించాలని కూడా ప్రతిపాదించారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి మరో 1 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. ఈ రెండు ఫీజుల ద్వారా మొత్తం సుమారు 1.5 బిలియన్ డాలర్ల‌ను సమీకరించి గ్యాస్ నిల్వల మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న‌ట్లు తెలిసింది.

ఆసియా దేశాల‌తో పోలిస్తే త‌క్కువే..

అయితే ఈ ఫీజును ఏ విధంగా వసూలు చేస్తారన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. విశ్వ‌స‌నీయ సమాచారం ప్రకారం ఈ నిధులను ప్రధానంగా సహజవాయువు, వంటగ్యాస్ నిల్వల మౌలిక వసతుల అభివృద్ధికే వినియోగించనున్నార‌ని స‌మాచారం. ఇక ముడిచమురు వ్యూహాత్మక నిల్వల కోసం అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే కొనసాగించి సమకూర్చనుంది. ప్రస్తుతం భారత్‌లో అత్యవసర ఇంధన నిల్వలు ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఆధీనంలోని ప్రస్తుత నిల్వలు దేశ అవసరాలకు పది రోజుల కంటే తక్కువ కాలానికే సరిపోతున్నాయి. కాగా జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఈ సామర్థ్యం 100 రోజులకుపైగా ఉండటం గమనార్హం.

Advertisement
Advertisement