త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Youth Unemployment | యువతకు ఉద్యోగాల సంక్షోభం.. భారత్ లోనే కాదు, ప్రపంచమంతా ఇదే పరిస్థితి..

India Youth Unemployment | భారత్‌లో యువ నిరుద్యోగుల‌ సమస్య తీవ్రంగా ఉందని గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు క‌లిగిన భారతీయుల్లో నిరుద్యోగుల సంఖ్య‌ సుమారు 15 శాతంగా నమోదైంది.

S

Business | Published On Jul 3, 2026, 2.23 pm IST

India Youth Unemployment | యువతకు ఉద్యోగాల సంక్షోభం.. భారత్ లోనే కాదు, ప్రపంచమంతా ఇదే పరిస్థితి..
Advertisement

India Youth Unemployment | భారత్‌లో యువ నిరుద్యోగుల‌ సమస్య తీవ్రంగా ఉందని గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు క‌లిగిన భారతీయుల్లో నిరుద్యోగుల సంఖ్య‌ సుమారు 15 శాతంగా నమోదైంది. ఈ గణాంకాల నేపథ్యంలో లక్షలాది మంది యువత చదువు పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా, పెరుగుతున్న జీవన వ్యయం, అందుబాటులో లేని గృహాలు వారి భవిష్యత్తుపై అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి. అయితే ఈ సమస్య భారత్‌కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా యువత ఉద్యోగాల కోసం ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) 2026 నివేదిక ప్రకారం ప్రపంచ యువ నిరుద్యోగిత (Unemployment) రేటు 2024లో 12.3 శాతం ఉండగా, 2025లో 12.4 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల ఎక్కువ‌ కాకపోయినా, ప్రపంచవ్యాప్తంగా యువతపై ఒత్తిడి పెరుగుతుంద‌నే సంకేతాన్ని ఇస్తోంది.

స్పెయిన్‌లో అత్య‌ధికం..

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను పరిశీలించినా ఇదే ధోరణి కనిపిస్తోంది. అమెరికాలో గ‌త‌ మే నాటికి యువ నిరుద్యోగిత 9.4 శాతంగా నమోదైంది. చైనాలో విద్యార్థులను మినహాయించి 16 నుంచి 24 ఏళ్ల వయస్సు క‌లిగిన యువతలో నిరుద్యోగిత 15.6 శాతంగా ఉంది. బ్రిటన్‌లో యువ నిరుద్యోగిత ఏడాది క్రితం 14.3 శాతం ఉండగా, ప్రస్తుతం 16.2 శాతానికి పెరిగింది. ఫ్రాన్స్‌లో ఇది 21.3 శాతం, ఇటలీలో 15 నుంచి 24 ఏళ్ల వయస్సు క‌లిగిన వారిలో 15.1 శాతంగా నమోదైంది. స్పెయిన్‌లో యువ నిరుద్యోగిత అత్యధికంగా 23.7 శాతంగా ఉంది. అయితే ఈ గణాంకాల ఉద్దేశం దేశాల మధ్య పోటీ చూపడం కాక‌పోయినా ప్రతి దేశం యువత వయస్సు నిర్వచనాన్ని భిన్నంగా ఉపయోగిస్తుండటంతో నేరుగా పోల్చడం సరైంది కాద‌ని నిపుణులు చెబుతున్నారు. సంపన్న దేశాలైనా, అభివృద్ధి చెందుతున్న దేశాలైనా యువతకు స్థిరమైన ఉద్యోగాలు ల‌భించ‌డం కష్టమవుతోందనే విషయం మాత్రం స్పష్టమవుతోంద‌ని అంటున్నారు. భారత్‌లోని పరిస్థితి కూడా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న పెద్ద సమస్యలో భాగంగానే ఉంది.

యుద్ధం ప్ర‌భావం..

ఈ పరిస్థితికి ప్రధాన కారణాలపై కేర్‌ఎడ్జ్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా స్పందిస్తూ పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచిందని తెలిపారు. అనిశ్చితి పెరిగినప్పుడు కంపెనీలు పెట్టుబడుల‌ను తగ్గిస్తాయి. విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తాయి. ఫలితంగా కొత్త ఉద్యోగాల నియామకాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ప్రారంభ స్థాయి ఉద్యోగాలే మొదట ప్రభావితమవుతాయి. అందువల్ల ఉద్యోగ మార్కెట్‌లోకి కొత్తగా అడుగుపెడుతున్న యువతే ఎక్కువగా దెబ్బతింటున్నారని తెలిపారు. వస్తువుల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, సరఫరా గొలుసు అంతరాయాలు కూడా సంస్థలను నియామకాల విషయంలో వెనుకడుగు వేయిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ అనిశ్చితి దాదాపు నిరంతరంగా కొనసాగుతుండటంతో యువ ఉద్యోగార్థులపై ఒత్తిడి పెరుగుతుంద‌ని ఆమె అభిప్రాయపడ్డారు.

క్రృత్రిమ మేధ‌స్సు..

సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఏర్ప‌డిన ఉద్యోగాల కోతలు యువతపై తీవ్ర ప్రభావం చూపాయని రజనీ సిన్హా తెలిపారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావం మరింత పెరిగింది. ఒకప్పుడు మనుషులు నిర్వహించిన అనేక పనులను ఇప్పుడు అల్గోరిథమ్‌లు చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం సాఫ్ట్‌వేర్ రంగానికే పరిమితం కాకుండా కస్టమర్ సపోర్ట్, ప్రాథమిక డేటా విశ్లేషణ, ప్రారంభ స్థాయి కంటెంట్ క్రియేష‌న్ వంటి అనేక ఉద్యోగాలపై ప్రభావం చూపుతోంద‌ని, ఫలితంగా యువ గ్రాడ్యుయేట్లకు తొలి స్థిరమైన ఉద్యోగం పొందే అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నాయ‌ని అన్నారు. వేల కిలోమీటర్ల దూరంలో జరిగే యుద్ధం లేదా విదేశాల్లో అభివృద్ధి చేసిన ఏఐ మోడల్ కూడా ముంబై నుంచి మాంచెస్టర్ వరకు ఉద్యోగ నియామకాలపై ఒకే సమయంలో ప్రభావం చూపిస్తుంద‌ని ఆమె వివరించారు.

బ‌ల‌మైన త‌యారీ రంగం లేదు..

అయితే ప్రపంచ పరిస్థితులతోపాటు భారత్‌కు ప్రత్యేకమైన నిర్మాణాత్మక సమస్యలు కూడా ఉన్నాయని ఎలారా క్యాపిటల్ ఎకనామిస్ట్ గరిమా కపూర్ తెలిపారు. మొదటి సమస్య విద్యా వ్యవస్థ, ఉద్యోగ అవసరాల మధ్య ఉన్న అంతరమని ఆమె పేర్కొన్నారు. భారతీయ గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు ఉన్నప్పటికీ పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక, వృత్తి నైపుణ్యాలు చాలామందిలో ఉండడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. రెండో ప్రధాన సమస్య భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఉందని ఆమె చెప్పారు. సాధారణంగా దేశాలు వ్యవసాయం నుంచి తయారీ రంగానికి, ఆ తర్వాత సేవల రంగానికి మారుతాయి. కానీ భారత్ మాత్రం బలమైన తయారీ రంగాన్ని నిర్మించకుండానే నేరుగా సేవల రంగంపై ఎక్కువగా ఆధారపడిందని తెలిపారు. దీనినే ఆమె మిస్సింగ్ మిడిల్ గా అభివర్ణించారు. తయారీ రంగం పెద్ద సంఖ్యలో తక్కువ నైపుణ్యాలు కలిగిన కార్మికులకు ఉపాధి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాంటి బలమైన తయారీ రంగం లేకపోవడంతో భారత్‌లోని యువతకు ఉద్యోగ అవకాశాలు పరిమితమవుతున్నాయని అన్నారు.

త‌క్కువ మంది ఉద్యోగులు, ఏఐ..

గతంలో ఐటీ రంగం భారీ స్థాయిలో గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు కల్పించేది. కానీ గత రెండున్నర నుంచి మూడు సంవత్సరాలుగా ఐటీ రంగంలో ఉద్యోగాల పెరుగుదల నిలిచిపోయిందని, కొన్ని చోట్ల తగ్గిందని గరిమా కపూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం వృద్ధి ఎక్కువగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీలు) వైపు మళ్లింది. సంప్రదాయ ఐటీ సేవల సంస్థల మాదిరిగా ఇవి కొత్తవారిని పెద్దఎత్తున నియమించకుండా అనుభవజ్ఞులైన, అధిక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను మాత్రమే ఎక్కువగా తీసుకుంటున్నాయని తెలిపారు. ఏఐ కారణంగా ఉత్పాదకత పెరగడంతో అదే పనిని తక్కువ మంది ఉద్యోగులతో పూర్తి చేయగలుగుతున్నారని ఆమె చెప్పారు. భారత్‌లో మరో సమస్య ఉద్యోగాల లెక్కింపులో కూడా ఉందని గరిమా కపూర్ అభిప్రాయపడ్డారు. గిగ్ ఎకానమీ వేగంగా విస్తరించడంతో కొందరు యువత సంవత్సరంలో కొంతకాలమే పని చేస్తుండగా, మరికొందరు తమ ఇష్టానుసారం మధ్య మధ్యలో మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఏ సమయంలో ఎవరు నిజంగా ఉద్యోగంలో ఉన్నారు, ఎవరు నిరుద్యోగులు అన్న విష‌యాన్ని క‌చ్చితంగా అంచనా వేయడం కష్టమవుతోంది.

త‌గ్గుతున్న మాన‌వ శ్ర‌మ అవ‌స‌రం..

భారత్‌లో మహిళల శ్రామిక భాగస్వామ్యం సమాన ఆదాయ స్థాయి కలిగిన ఇతర దేశాలతో పోలిస్తే ఇంకా తక్కువగా ఉండటం కూడా మొత్తం ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపుతోందని ఆమె పేర్కొన్నారు. అలాగే పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కొంతమంది యువత ఉద్యోగాల్లో చేరడాన్ని ఆలస్యం చేస్తున్నాయేమోననే అభిప్రాయం ఉన్నప్పటికీ, దీనిని నిర్ధారించే స్పష్టమైన గణాంకాలు ప్రస్తుతం లేవని ఆమె స్పష్టం చేశారు. అమెరికా వంటి దేశాల్లో తగిన నైపుణ్యాలున్న ఉద్యోగుల కొరత కంటే, మొత్తం ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉండటం లేదా పెట్టుబడులు శ్రమ ఆధారిత రంగాల నుంచి మూలధన ఆధారిత రంగాల వైపు మళ్లడం ప్రధాన సమస్యగా ఉంటుంద‌ని గరిమా కపూర్ తెలిపారు. ఇదే ధోరణి భారత్‌లో కూడా కనిపిస్తోందని, ఆటోమొబైల్ తయారీ వంటి పరిశ్రమలు కూడా వేగంగా యంత్రాలపై ఆధారపడుతూ మానవ శ్రమ అవసరాన్ని తగ్గిస్తున్నాయని అన్నారు.

దీర్ఘ‌కాలిక ప‌రిష్కార‌మేమిటి..?

భారత్‌లో యువ నిరుద్యోగిత గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, వాటిని కేవలం దేశీయ వైఫల్యంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉపాధి సంక్షోభంలో భాగంగా చూడాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పరిష్కారాలు మాత్రం భారత్‌కు అనుగుణంగా ఉండాల్సిందే. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, విద్యను పరిశ్రమల అవసరాలకు అనుసంధానం చేయడం, భారీ స్థాయిలో ఉపాధి కల్పించే రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement
Advertisement