త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG Pipeline | 1800 కి.మీ. కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్లు.. రూ.7వేల కోట్ల పెట్టుబడి..

LPG Pipeline | పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి (పీఎన్‌జీఆర్‌బీ) దేశంలో సుమారు 1800 కిలోమీటర్ల మేర కొత్త ద్రవీకృత పెట్రోలియం వాయువు (ఎల్‌పీజీ) పైప్‌లైన్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.7వేల కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా.

S

Business | Published On Aug 24, 2026, 1.44 pm IST

LPG Pipeline | 1800 కి.మీ. కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్లు.. రూ.7వేల కోట్ల పెట్టుబడి..
Advertisement

LPG Pipeline | పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి (పీఎన్‌జీఆర్‌బీ) దేశంలో సుమారు 1800 కిలోమీటర్ల మేర కొత్త ద్రవీకృత పెట్రోలియం వాయువు (ఎల్‌పీజీ) పైప్‌లైన్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.7వేల కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా. దేశంలో ఎల్‌పీజీ సరఫరా మౌలిక వసతులను బలోపేతం చేయడంతోపాటు, రోడ్డు మార్గం ద్వారా ఎల్‌పీజీ రవాణాపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ విస్తరణ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో తెలంగాణను మహారాష్ట్రతో అనుసంధానించే 556 కిలోమీటర్ల చ‌ర్లపల్లి-నాగ్‌పూర్ పైప్‌లైన్, ఉత్తరప్రదేశ్‌ను ఉత్తరాఖండ్‌తో కలిపే 611 కిలోమీటర్ల ఝాన్సీ-సితార్‌గంజ్ పైప్‌లైన్ ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానించే 633 కిలోమీటర్ల షిక్రాపూర్-గోవా-హుబ్లీ పైప్‌లైన్ కూడా ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఉంది.

9500 కిలోమీట‌ర్ల‌కు విస్త‌ర‌ణ‌..

ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత పీఎన్‌జీఆర్‌బీ ఆమోదించిన ఉమ్మడి-రవాణా ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ ప్రస్తుత సుమారు 7,700 కిలోమీటర్ల నుంచి దాదాపు 9,500 కిలోమీటర్లకు పెరగనుంది. అంటే నెట్‌వర్క్ పరిమాణం సుమారు 23.5 శాతం విస్తరించనుంది. గతంలో ఆమోదించిన 2,757 కిలోమీటర్ల కాండ్లా-గోరఖ్‌పూర్ ఎల్‌పీజీ పైప్‌లైన్‌కు ఈ కొత్త ప్రాజెక్టులు అదనంగా చేరనున్నాయి. ప్రస్తుతం కాండ్లా-గోరఖ్‌పూర్ పైప్‌లైన్ దేశంలోనే అత్యంత పొడవైన ఎల్‌పీజీ పైప్‌లైన్‌గా ఉంది. భారత్‌ తన ఎల్‌పీజీ అవసరాల్లో గణనీయమైన భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది. తీర ప్రాంతాల్లోని దిగుమతి టెర్మినళ్లకు చేరే ఎల్‌పీజీని అక్కడి నుంచి అంతర్గత ప్రాంతాల్లోని వినియోగ కేంద్రాలకు రవాణా చేస్తున్నారు. పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణతో ఈ రవాణా వ్యవస్థ మరింత సమర్థవంతంగా, విశ్వసనీయంగా మారే అవకాశం ఉంది.

ప‌ర్యావ‌ర‌ణ‌హితంగా..

పీఎన్‌జీఆర్‌బీ తెలిపిన ప్రకారం.. కొత్త పైప్‌లైన్ల వల్ల ఎల్‌పీజీ రవాణాకు రోడ్డు మార్గంపై ఆధారపడటం తగ్గుతుంది. ఫలితంగా రోడ్లపై ఎల్‌పీజీ ట్యాంకర్ల రాకపోకలు తగ్గి రహదారి భద్రత మెరుగుపడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో రవాణా వ్యయాలు తగ్గడంతోపాటు రోడ్లపై ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గనుంది. అంతర్గత మార్కెట్లకు ఎల్‌పీజీ సరఫరా మరింత స్థిరంగా ఉండేందుకు ఈ నెట్‌వర్క్ సహాయపడనుంది. రోడ్డు రవాణాకు బదులుగా పైప్‌లైన్ల వినియోగం పెరగడం వల్ల కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టులు దేశ ఇంధన రవాణా మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంతో పాటు, కీలక ప్రాంతాల్లో సురక్షితమైన, సమర్థవంతమైన, తక్కువ ఉద్గారాలతో కూడిన ఎల్‌పీజీ పంపిణీ వ్యవస్థకు దోహదపడనున్నాయి.

Advertisement
Advertisement