త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

కూలీల బాధ ఇక ఉండదు.. రూ. 15 లక్షలకే పత్తి ఏరే యంత్రం.. ప్రారంభించిన కేంద్ర మంత్రి

పత్తి తీయడానికి కూలీలు దొరకడం లేదా? ఖర్చు తడిసి మోపెడవుతోందా? అయితే ఈ వార్త మీకోసమే. మహాశివరాత్రి పర్వదినాన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పత్తి రైతులకు అద్భుతమైన కానుక ఇచ్చారు. కేవలం రూ. 15 లక్షల్లో అందుబాటులోకి రానున్న కొత్త పత్తి కోత యంత్రాన్ని జాతికి అంకితం చేశారు. దీని ప్రత్యేకతలు ఇవే.

J

Agriculture | Published On Feb 15, 2026, 5.52 pm IST

కూలీల బాధ ఇక ఉండదు.. రూ. 15 లక్షలకే పత్తి ఏరే యంత్రం.. ప్రారంభించిన కేంద్ర మంత్రి
Advertisement

త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా ఉన్న పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. పత్తి ఏరడానికి కూలీలు దొరక్క, పెరిగిన కూలీల రేట్లతో సతమతమవుతున్న అన్నదాతల కష్టాలను తీర్చేందుకు అత్యాధునికమైన, తక్కువ ధరలో లభించే 'కాటన్ హార్వెస్టర్' అందుబాటులోకి వచ్చింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భోపాల్‌లోని ఐసీఏఆర్ - సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ యంత్రాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జాతికి అంకితం చేశారు.

రైతుల చిరకాల కోరిక నెరవేరింది

ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. "పత్తిని చేతితో తీయడం అనేది అత్యంత శ్రమతో కూడిన పని. దీనివల్ల సమయం వృథా కావడమే కాకుండా, రైతులపై ఆర్థిక భారం పడుతోంది. యంత్రాల ద్వారా పత్తిని సులభంగా తీయాలన్నది రైతుల ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ఈ రోజు ఆ కల నెరవేరింది" అని పేర్కొన్నారు.

యంత్రం ప్రత్యేకతలు - ధర వివరాలు

సాధారణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తి కోత యంత్రాలు కోట్లాది రూపాయల ఖరీదు ఉంటాయి. కానీ మన శాస్త్రవేత్తలు దీనిని సామాన్య రైతులకు అందుబాటులో ఉండేలా రూపొందించారు.

ధర: ఈ యంత్రాన్ని తయారు చేయడానికి సుమారు రూ.12 లక్షలు ఖర్చయ్యిందని, అన్ని పన్నులు, ఇతర ఖర్చులు కలుపుకుని రైతులకు దాదాపు రూ.15 లక్షలకే ఇది అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు.

పనితీరు: ఈ యంత్రం పత్తిని తీసే విధానాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. ట్రాక్టర్ నడిపి పనితీరును పరీక్షించారు. కేవలం ఒకటి, రెండు నిమిషాల్లోనే భారీ మొత్తంలో పత్తిని ఈ మెషీన్ హార్వెస్ట్ చేసిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రైతులకు లాభాల పంట

ఈ యంత్రాన్ని వాడటానికి ముందు, పత్తి ఆకులపై ప్రత్యేక స్ప్రే చేసి అవి రాలిపోయేలా చేస్తారు. దీనివల్ల పత్తిలో చెత్త కలవకుండా నాణ్యంగా వస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ వల్ల పత్తి సాగు లాభసాటిగా మారుతుందని, ఎకరాకు ఎక్కువ మొక్కలు నాటే పద్ధతికి ఇది దోహదం చేస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. త్వరలోనే చిన్నపాటి మార్పులు చేసి దీనిని పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు.

https://x.com/ChouhanShivraj/status/2022960843428901268

Advertisement
Advertisement