త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Palampet Shiva temple | రామప్ప చెంతనే ఉన్న కాకతీయ శివాలయానికి జాతీయ హోదా

రామప్ప ఆలయం పక్కనే కాలగర్భంలో కలిసిపోతున్న మరో కాకతీయ శివాలయానికి కేంద్రం జాతీయ వారసత్వ హోదా కల్పించింది. ఈ గుడి ప్రత్యేకతలు తెలుసుకుందాం పదండి.

J

Warangal | Published On Jul 8, 2026, 7.11 pm IST

Palampet Shiva temple | రామప్ప చెంతనే ఉన్న కాకతీయ శివాలయానికి జాతీయ హోదా

సంక్షిప్త సారాంశం

ములుగు జిల్లా పాలంపేటలో రామప్ప గుడికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న పురాతన శివాలయానికి జాతీయ స్మారక హోదా (National Monument Status) లభించింది. 1958 పురాతన కట్టడాల చట్టం కింద కేంద్ర పురావస్తు శాఖ (ASI) దీనిపై తుది గెజిట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేసింది. సర్వే నంబర్లు 382/1, 382/1/2 పరిధిలోని 0.275 ఎకరాల భూమిని రక్షిత ప్రాంతంగా కేంద్ర పురావస్తు శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇకపై ఈ శిథిల ఆలయ పునరుద్ధరణ, భద్రత, పర్యాటక అభివృద్ధి పనులను కేంద్ర నిధులతో ASI స్వయంగా పర్యవేక్షించనుంది.

Advertisement

Palampet Shiva temple | త్రినేత్ర.న్యూస్ : యునెస్కో (UNESCO) గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద 'రామప్ప ఆలయం' గురించి అందరికీ తెలిసిందే. కానీ, ఆ అద్భుత కట్టడానికి కూతవేటు దూరంలోనే, కాలగర్భంలో కలిసిపోతున్న మరో కాకతీయ శివాలయం ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు ఆ పురాతన శివాలయానికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత గుర్తింపునిచ్చింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ఈ శిథిల ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడంగా (National Monument Status) ప్రకటిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏఎస్ఐ ఆధీనంలోకి రక్షిత ప్రాంతం

1958 పురాతన కట్టడాలు, పురాతత్వ ప్రదేశాల చట్టం కింద భారతీయ పురావస్తు శాఖ (ASI) ఈ ఆలయానికి జాతీయ వారసత్వ సంపద హోదా కల్పించింది. రామప్ప గుడికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి జాతీయ హోదా కల్పించేందుకు ASI అధికారులు ఫిబ్రవరి 16, 2026న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ కోసం రెండు నెలల సమయం ఇవ్వగా.. ఎలాంటి ఆక్షేపణలు రాకపోవడంతో కేంద్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ జనరల్ యదుబీర్ సింగ్ రావత్ ఆదేశాలతో తుది గెజిట్ విడుదలైంది.

ఈ అధికారిక ప్రకటనతో ఈ ప్రాచీన శైవక్షేత్రం పూర్తిగా ASI ఆధీనంలోకి వెళ్లింది. ఆలయం చుట్టూ ఉన్న సర్వే నంబర్లు 382/1, 382/1/2 పరిధిలోని సుమారు 0.275 ఎకరాల స్థలాన్ని రక్షిత ప్రాంతంగా (Protected Area) ప్రకటించారు. ఇకపై ఇక్కడ ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టాలన్నా, తవ్వకాలు చేయాలన్నా ASI అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

కేంద్ర నిధులతో అభివృద్ధి

జాతీయ స్మారక కట్టడంగా గుర్తింపు దక్కడంతో ఈ గుడికి మహర్దశ పట్టనుంది. ఇన్నాళ్లూ సరైన నిధులు, పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరిన ఈ గుడి పునరుద్ధరణ (Restoration), టూరిజం డెవలప్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయనుంది. నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ (NMA) పర్యవేక్షణలో ఇక్కడ రక్షణ చర్యలు కట్టుదిట్టంగా అమలు కానున్నాయి.

కాకతీయుల అద్భుత శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయం.. భవిష్యత్తులో రామప్పను దర్శించుకునే టూరిస్టులకు మరో అద్భుతమైన ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా (Tourism destination) మారబోతోందని స్థానికులు, చరిత్రకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement