త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | వాట్సాప్‌లోనే వాతావ‌ర‌ణ స‌మాచారం.. మండ‌లాల వారీగా రైతుల‌కు చేర‌వేత‌

Tummala Nageshwar Rao | వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాళ్లుగా మారుతున్న పరిస్థితుల్లో రైతులకు క‌చ్చితమైన, సమయానుకూల వాతావరణ సమాచారం అందించడం అత్యంత అవసరమని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు అన్నారు.

S

Telangana | Published On May 30, 2026, 5.36 pm IST

Tummala Nageshwar Rao | వాట్సాప్‌లోనే వాతావ‌ర‌ణ స‌మాచారం.. మండ‌లాల వారీగా రైతుల‌కు చేర‌వేత‌
Advertisement
  • గ్రామ స్థాయి వ‌ర‌కు సేవ‌లు విస్త‌రించండి
  • వాయిస్ రూపంలో అడిగి స‌మాధానాలు పొందేలా చూడండి
  • డీఐఎల్ ఇండియా, ఎవిడెన్స్ యాక్షన్ సంస్థల‌ ప్ర‌తినిధుల‌కు సూచించిన మంత్రి తుమ్మ‌ల

Tummala Nageshwar Rao | త్రినేత్ర‌.న్యూస్‌:  ఇక నుంచి మండలాల వారీగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ సూచనలను రైతులకు వాట్సాప్ లోనే చేరవేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో శ‌నివారం ప్రారంభించిన‌ ‘తెలంగాణ వాతావ‌ర‌ణ స‌ల‌హా కార్య‌క్ర‌మం’ లో ఆయ‌న మాట్లాడారు.

తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా (DIL India), ఎవిడెన్స్ యాక్షన్ సంస్థల సహకారంతో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన‌ట్లు చెప్పారు. ఈమేర‌కు అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్న‌ట్లు మంత్రి తెలిపారు. రాబోయే రుతుపవనాలు, వర్షపాతం పరిస్థితులకు సంబంధించి తొలి వాతావరణ సూచన సందేశాన్ని మంత్రి చేతుల మీదుగా వాట్సాప్ ద్వారా రైతులకు పంపించారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతులకు క్షేత్రస్థాయిలో ఉపయోగపడే సూచనలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. కృత్రిమ మేధస్సు ఆధారిత వాతావరణ అంచనాలను వినియోగించడం ద్వారా రైతులు సరైన సమయంలో సాగు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా పంట నష్టాలను తగ్గించి ఉత్పాదకతను పెంచుకోచ్చు. రైతుల ఆదాయ వృద్ధి, వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాల ప్రోత్సాహానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది అని మంత్రి తెలిపారు.

రైతులు నేరుగా వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ సూచనలకు సంబంధించిన ప్రశ్నలను వాయిస్ రూపంలో అడిగి సమాధానాలు పొందే విధంగా ఈ వేదికను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సేవలను మండల స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు విస్తరించేలా అవసరమైన సాంకేతిక మార్పులు చేపట్టాలని సంస్థ ప్రతినిధులను మంత్రి కోరారు.

15 లక్షల మంది రైతుల‌కు స‌మాచారం..

వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్రమోహన్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో ఉందన్నారు. తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యాల సాధనలో భాగంగా కృత్రిమ మేధస్సును వినియోగించి రాష్ట్ర రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు సుస్థిర వ్యవసాయాభివృద్ధికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందని తెలిపారు.
రాబోయే కాలంలో ఎల్‌నినో, వంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ సాగు పద్ధతులను అవలంబించేందుకు రైతులకు క‌చ్చితమైన, సమయానుకూల సమాచారాన్ని అందించే సామర్థ్యం ఈ కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవస్థకు ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతు భరోసా నందు ఫోన్ నెంబర్ నమోదైన 17 జిల్లాలోని 304 మండలాలకు చెందిన 15 లక్షల మంది రైతులకు వాట్సాప్ ద్వారా ఈ సమాచారం అందుతుంద‌ని పేర్కొన్నారు.

మ‌రిన్ని సేవ‌లు అందిస్తాం: అంకుర్ గ‌ర్‌

ఎవిడెన్స్ యాక్షన్ సంస్థ కంట్రీ డైరెక్టర్ అంకుర్ గర్ న్యూఢిల్లీ నుండి జూమ్ ద్వారా పాల్గొని తమ సంస్థ రైతుల కోసం కృత్రిమ మేధస్సు ఆధారంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది తెలంగాణ రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మంత్రి తుమ్మ‌ల‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి భవిష్యత్తులో మరిన్ని సేవలను రైతులకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్రమోహన్‌, వ్యవసాయ శాఖ సంచాలకులు బి.గోపి, సహకార శాఖ ప్రత్యేక సంచాలకులు రాహుల్ రాజ్, ఇతర ఉన్నతాధికారులు, డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా, ఎవిడెన్స్ యాక్షన్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement