త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | మ‌హిళా బిల్లు తేక‌పోతే ఓట్లేయ‌మ‌ని చెప్పాలి.. ఆ ట్రెండ్ తేవాలి

Kavitha | రాజకీయాల్లో మ‌హిళ‌లు పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉంటేనే మార్పు సాధ్యమని.. అందుకు మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌ప‌రంగా 33 శాతం రిజ‌ర్వేష‌న్లు ఉండాల్సిందేన‌ని టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత స్ప‌ష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ సభ నిర్వహిద్దామ‌ని పేర్కొన్నారు.

S

Telangana | Published On Jun 27, 2026, 6.54 pm IST

Kavitha | మ‌హిళా బిల్లు తేక‌పోతే ఓట్లేయ‌మ‌ని చెప్పాలి.. ఆ ట్రెండ్ తేవాలి
Advertisement
  • రాజ‌కీయాల్లో ప‌వ‌ర్‌ఫుల్ పొజిష‌న్‌లో ఉంటేనే మార్పు సాధ్యం
  • అందుకు 33 శాతం మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు ఉండాల్సిందే
  • ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ స‌భ పెట్టి శ‌క్తిని చాటుదాం
  • మ‌హిళ‌లంతా కాల‌ర్ ఎగిరేసుకునేలా ప‌ని చేస్తా
  • చ‌ట్ట స‌భ‌ల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్స్ సాధ‌న స‌భ‌లో టీఆర్ఎస్ చీఫ్‌ క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్య‌లు

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: రాజకీయాల్లో మ‌హిళ‌లు పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉంటేనే మార్పు సాధ్యమని.. అందుకు మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌ప‌రంగా 33 శాతం రిజ‌ర్వేష‌న్లు ఉండాల్సిందేన‌ని టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత స్ప‌ష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ సభ నిర్వహిద్దామ‌ని పేర్కొన్నారు. బిల్లు సత్వరమే అమలు చేయాలంటే మ‌హిళా శక్తిని ప్రదర్శించాల‌ని పిలుపునిచ్చారు. హిమాయత్‌నగర్‌లో ఎన్‌సీఆర్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో శ‌నివారం నిర్వహించిన "చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్స్ సాధన సభ"లో ఆమె పాల్గొని ప్రసంగించారు. స‌రైన మ‌హిళా నాయ‌కులుంటే టీఆర్ఎస్ పార్టీ ప‌రంగా 50 శాతం టికెట్లు ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌న్నారు. మహిళా బిల్లు తేకపోతే ఓట్లు వేయమని చెప్పాలన్నారు. ఆ ట్రెండ్ తీసుకొచ్చేలా ప‌ని చేయాల‌ని కోరారు.

మ‌హిళ‌ల‌కు 50 శాతం టికెట్లు ఇస్తం..

మా పార్టీ పరంగా కచ్చితంగా 33 శాతానికి తగ్గకుండా మహిళలకు సీట్లు కేటాయిస్తాం. స‌రైన మహిళ నాయకులు ఉంటే 50 శాతం టికెట్లు ఇవ్వటానికి కూడా సిద్ధం. మహిళా బిల్లు తేకపోతే ఓట్లు వేయమని మనం చెప్పాలి. ఆ ట్రెండ్ తేవాలి. కచ్చితంగా మహిళలంతా కాలర్ ఎగిరేసుకునేలా వారికోసం పనిచేస్తా. మేం మహిళ బిల్లులో ఓబీసీ మహిళ కోటా పెట్టాలంటే అసలు ఓబీసీ కోటలో రిజర్వేషన్లే లేవని అంటున్నారు. అంటే మనం ఓబీసీ రిజర్వేషన్లను కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది అని క‌విత పేర్కొన్నారు.

యంగ్ ఉమెన్ లీడ‌ర్లు రిజర్వేష‌న్లు ఎందుకంటున్న‌రు..

మహిళా బిల్లు అమలు చేయకుంటే ఓట్లు వేయమని మహిళలమంతా గట్టిగా చెప్పాలి. మహిళల కోసం ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి పార్టీ పెట్టాను. మీరంతా గర్వపడేలా మంచి రాజకీయాలు చేస్తానని హామీ ఇస్తున్నా. మహిళలు కచ్చితంగా పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉండాల్సిందే. అందుకోసం మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కచ్చితంగా ఉండాల్సిందే. ఇటీవల కొంతమంది నన్ను కలుస్తున్న యంగ్ ఉమెన్ లీడర్లు మనకు రిజర్వేషన్లు ఎందుకు అంటున్నారు? కానీ ఒక స్థాయి వరకు మహిళలు ఎదిగిన తర్వాత వారికి అడ్డుకట్ట వేస్తారు. అందుకే కచ్చితంగా మహిళలకు రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసం మన శక్తిని ప్రదర్శించాల్సిందే. నెక్లెస్ రోడ్ లోనో, రామ్‌లీల మైదానంలోనో పెద్ద ఎత్తున మహిళలమంతా పోరాటానికి దిగాలి అని ఆమె పిలుపునిచ్చారు.

33 శాతం మహిళా రిజర్వేషన్లు కచ్చితంగా సాధించుకుంటాం. కానీ అందుకు తగిన విధంగా మహిళ లీడర్లను కూడా తయారు చేసుకోవాలి. మహిళలను లీడర్లుగా తయారు చేసేందుకు మనం స్పెషల్ డ్రైవ్‌లు కూడా నిర్వహించాలి. మహిళ బిల్లు ఆమోదం కోసం మేం 2022-23లో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశాం. అంతటితో ఆగకుండా పార్లమెంట్ ఈ అంశంపైనే మాట్లాడాలంటూ 18 పార్టీలతో మాట్లాడించాం. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగి మహిళ బిల్లుకు ఆమోదం లభించింది. కానీ మనకు ఆ బిల్లును పోస్ట్ డేటేడ్ చెక్ మాదిరిగా తయారు చేశారు. ఇప్పటికీ దాన్ని అమలు చేసేందుకు కొర్రీలు పెడుతున్నారు అని టీఆర్ఎస్ చీఫ్ మండిప‌డ్డారు.

యువ‌త‌లో చాలా అవేర్‌నెస్ ఉంది..

ఇప్పుడున్న యువత చాలా అవేర్‌నెస్‌తో ఉంది. అన్ని వర్గాల ప్రాతినిధ్యం గురించి వాళ్లు ఆలోచిస్తున్నారు. అందువ‌ల్ల‌ మనం అన్ని వర్గాలను కలుపుకొని వారికి అవకాశాలు కల్పించాలి. ఓబీసీ, మహిళ మైనారిటీ లీడర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. మైనారిటీల నుంచి మహిళ లీడర్లను తీసుకురావటం కష్టంగా మారింది. మైనారిటీ పురుష లీడర్లు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఎంఐఎం కాకుండా ఒక్క బోధన్ నుంచి మాత్రమే మైనారిటీ ఎమ్మెల్యే ఉండేవారు. అంటే వారి సంఖ్య ఎంత తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని క‌విత వివ‌రించారు.

బీసీలకు చట్టపరంగా 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే. మహిళలకు 33 శాతం రాజకీయ పార్టీలో టికెట్లు ఇవ్వవచ్చు కదా అని అందరూ అంటున్నారు. కానీ ఒక పార్టీ అలా టికెట్ ఇస్తే మిగతా అన్ని పార్టీలు కలిసి వాళ్లను ఓడిస్తారు. అంటే 33 శాతం మహిళలకు టికెట్లు ఇచ్చిన పార్టీ నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే మహిళలకు కచ్చితంగా చట్టపరంగానే 33 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఇక పొలిటికల్ పార్టీలు ఓట్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తాయి. ఇటీవల మహిళల్లో అవేర్‌నెస్ పెరగటంతో వారి ఓట్ల కోసం మహిళలకు ప్రత్యేక పథకాలు ఇస్తామంటున్నారు. మహిళా బిల్లు తేకపోతే ఓట్లు వేయమని చెప్పాలి. అలాంటి ట్రెండ్ రావాలంటే కచ్చితంగా మనం ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలి అని క‌ల్వ‌కుంట్ల క‌విత స్ప‌ష్టం చేశారు.

 

Advertisement
Advertisement