త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | ​సింగరేణిలో దోపిడీదారులకు స్థానం లేదు: భ‌ట్టి

Bhatti Vikramarka | సింగ‌రేణిలో దోపిడీదారుల‌కు స్థానం లేద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. బీఆర్ఎస్ నేతలపై ఆయ‌న‌ మరోసారి నిప్పులు చెరిగారు. తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు.

S

Telangana | Published On Jun 14, 2026, 4.06 pm IST

Bhatti Vikramarka | ​సింగరేణిలో దోపిడీదారులకు స్థానం లేదు: భ‌ట్టి
Advertisement
  • కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే క్షమించం
  • ​రాజకీయ స్వార్థం కోసం సింగరేణి ప్రతిష్టను దెబ్బతీస్తారా?
  • శ్రీరామ్‌పూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గని సంద‌ర్శ‌న‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైర్‌

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్‌: సింగ‌రేణిలో దోపిడీదారుల‌కు స్థానం లేద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. సింగరేణి కార్మికుల శ్రమను, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలపై ఆయ‌న‌ మరోసారి నిప్పులు చెరిగారు. తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. సింగరేణి గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సమాధానం చెప్పేందుకు ఆదివారం నాడు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపెన్ హౌస్ త‌నిఖీ నిర్వహించి, వాస్తవాలను వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా భ‌ట్టి మాట్లాడారు. సింగరేణి సంస్థపై జరుగుతున్న ప్రచారంలో ఏది నిజం, ఏది అబద్ధమనే వాస్తవాలను ప్రజలముందుకు తీసుకురావాలనే ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాల కోసమే అసత్యాలు మాట్లాడుతున్నార‌న్నారు. రాజకీయంగా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ​ప్రజా ప్రభుత్వం చెప్పేది కేవలం నిజాలు మాత్రమేనని, ఆ నిజాన్ని ప్రజల ముందు ఉంచడమే తమ బాధ్యతని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

సింగరేణి సంస్థ అభివృద్ధిలో కార్మికుల చెమట, కఠోర శ్రమ దాగి ఉన్నాయని, వారి ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేసేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదు. సింగరేణి యాజమాన్య నిబద్ధతను, సంస్థలోని పారదర్శక విధానాలపై బీఆర్ఎస్ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి మకుటాయమానమైన సింగరేణి సంస్థను అభాసుపాలు చేయాలనే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కేంద్రానికి లేఖలు రాయడం సత్యదూరంగా ఉన్నాయి. ​సొంత రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ భవిష్యత్తును, సింగరేణి సంస్థను వాడుకోవడం స‌రికాదు అని భ‌ట్టి హెచ్చిరించారు.

ఇది ప్ర‌జ‌ల ఆస్తి..

​సింగరేణి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ఇక్కడి వనరులు, ఈ వ్యవస్థ, ఈ శక్తి అంతా ప్రజల నుంచి వచ్చిందే. ఇది ఎప్పటికీ ప్రజలకే చెందుతుంది. ​​సింగరేణి సంస్థపై దోపిడీదారులు, డేగలు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడేలా ప్రజా ప్రభుత్వం అత్యంత ఖచ్చితత్వంతో పని చేస్తుంది. రాజకీయ అవసరాల కోసం సంస్థను వాడుకోవాలని చూస్తే ఊరుకోం. భవిష్యత్తులోనూ సింగరేణి అత్యంత పారదర్శకంగా ముందుకు సాగుతుంది అని డిప్యూటీ సీఎం భ‌ట్టి స్పష్టం చేశారు.

సింగరేణి బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, రవాణా ప్రక్రియలో పూర్తి పారదర్శకతను ప్రజలకు తెలియజెప్పడమే ప్రజా ప్రభుత్వం బాధ్యత‌న్నారు. మైన్ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు అక్కడ అమలు అవుతున్న భద్రతా ప్రమాణాలు, బొగ్గు రవాణాకు సంబంధించిన లెక్కలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ​శ్రీరాంపూర్ ఓసీ మైన్ నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం మరో 28 సంవత్సరాల పాటు ఇక్కడ బొగ్గు ఉత్పత్తి కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ​సింగరేణి సంస్థలో జరుగుతున్న ప్రతి ప్రక్రియ అత్యంత ఆధునికంగా, కంప్యూటరైజ్డ్ విధానంలో పారదర్శకంగా సాగుతోందని వివరించారు.

క్యాథ్ ల్యాబ్..

సింగరేణి కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, వారికి అత్యుత్తమ వైద్య సదుపాయాలతో పాటు వారి పిల్లల భవిష్యత్తు కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. కార్మికుల ఆరోగ్యం, పిల్లల చదువు, వారి భవిష్యత్తుపై సింగరేణి యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. కార్మికులకు అవసరమైన అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా అత్యంత ఆధునికమైన క్యాథ్ ల్యాబ్ (Cath Lab) వంటి వసతులను ఏర్పాటు చేస్తున్నాం అని ఆయ‌న తెలిపారు.

​కార్మికుల పిల్లల చదువు కోసం ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలను ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే స్థానికంగా ఉన్న పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నాం. ​ప్రతి కార్మికుడి ఆరోగ్యం, వారి పిల్లల విద్యా ప్రమాణాలు, వారి భవిష్యత్తు కోసం సింగరేణి యాజమాన్యం పూర్తి నిబద్ధతతో ముందుకు సాగుతోంది అని భ‌ట్టి విక్ర‌మార్క స్పష్టం చేశారు.

రూ.కోటీ 25 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా..

​రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ మహమ్మారి విస్తరిస్తోంది. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స అందించేందుకు వీలుగా, పూర్తి ఆధునిక పరికరాలతో కూడిన 'క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సులను' మంజూరు చేస్తున్నాం. ఈ బస్సులు ఊరూరా తిరిగి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తాయి. వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరితగతిన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటాం అని ఆయ‌న పేర్కొన్నారు. ​సింగరేణి కార్మికుల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు దేశంలోనే మొదటిసారి రూ.కోటి 25 లక్షల ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం అని మ‌ల్లు భట్టి విక్ర‌మార్క‌ గుర్తు చేశారు.

​కార్మికుల పిల్లల ఉన్నత ఆశయాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. సింగరేణి కార్మికుల పిల్లలు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతుంటే, వారికి ప్రిలిమ్స్, మెయిన్స్ రాయడానికి, ఇంటర్వ్యూలకు వెళ్ల‌డానికి అవసరమైన పూర్తి ఆర్థిక సహాయాన్ని, సహకారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్ల‌లో మేళవించి సింగరేణిని ముందుకు తీసుకువెళతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, సింగరేణి సంస్థ సీఎండి జ్యోతి బుద్ధ ప్రకాష్, ఇతర నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement