త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | న‌ర్సాపూర్ మున్సిపాలిటీలో ఉద్రిక్త‌త‌.. అంగీలు చినిగేలా కొట్టుకున్న బీజేపీ, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) పోలింగ్ కొన‌సాగుతున్న‌ది. అక్క‌డ‌క్క‌డ చెదురుమ‌దురు ఘ‌ట‌నలు మిన‌హా పోలింగ్ ప్ర‌శాంతంగా సాగుతున్న‌ది.

G

Telangana | Published On Feb 11, 2026, 11.23 am IST

Municipal Elections | న‌ర్సాపూర్ మున్సిపాలిటీలో ఉద్రిక్త‌త‌.. అంగీలు చినిగేలా కొట్టుకున్న బీజేపీ, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు
Advertisement

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) పోలింగ్ కొన‌సాగుతున్న‌ది. అక్క‌డ‌క్క‌డ చెదురుమ‌దురు ఘ‌ట‌నలు మిన‌హా పోలింగ్ ప్ర‌శాంతంగా సాగుతున్న‌ది. ఉద‌యం నుంచే పెద్ద సంఖ్య‌లో ఓట‌ర్లు త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకుంటున్నారు. ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 12 శాతం పోలింగ్ న‌మోద‌యింది. మోత్కూరు మున్సిపాలిటిలోని 9వ వార్డు 20వ పోలింగ్‌ కేంద్రంలో వందేండ్ల‌ వృద్ధురాలు రంగమ్మ త‌న‌ ఓటు వేశారు. దీంతో పోలింగ్ రోజును సెల‌వుదినంగా భావించే యువ‌త‌, ప్ర‌జ‌ల‌కు ఆమె ఆదర్శంగా నిలిచారు.

మ‌రోవైపు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ గౌడ్ ఓటు వేశారు. మధిర 9వ వార్డులో భట్టి విక్రమార్క, నల్ల‌గొండ పబ్లిక్ స్కూల్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నిజామాబాద్ ప‌ట్ట‌ణంలో పీసీసీ చీఫ్ త‌మ‌ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు వేయనున్నారు. కరీంనగర్ 50వ డివిజన్‌లో కుటుంబసభ్యులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజ‌య్ ఓటు వేశారు.

న‌ర్సాపూర్‌లో ఉద్రిక్త‌త‌..

న‌ర్సాపూర్ మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. 15వ వార్డులో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న‌ది. ఇరు పార్టీల కార్య‌క‌ర్త‌లు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ప‌లువురి అంగీలు చినిగిపోయాయి. పోలీసులు వారిని చెదరగొట్టారు.

మ‌హ‌బూబాబాద్ మున్సిపాలిటీ 14 వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఘ‌ర్ష‌ణకు దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నాగేశ్వరరావుపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కృష్ణ చేయి చేసుకున్నారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ నాగేశ్వ‌ర‌రావుపై దాడిచేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెల‌రేగింది.

పోలింగ్ కేంద్ర వ‌ద్ద డ‌బ్బు పంచుతూ..

జగిత్యాల 31వ వార్డులో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం వర్గీయుల వాగ్వాదం, తోపులాట జ‌రిగింది. నినాదాల విషయంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య‌ వాగ్వాదంచోటుచేసుకుంది. మ‌రోవైపు భూపాల‌ప‌ల్లి 22వ వార్డు పోలింగ్ కేంద్ర వ‌ద్ద డ‌బ్బు పంచుతూ బీఆర్ఎస్ నాయ‌కులు ప‌ట్టుబ‌డ్డారు. ఓట‌ర్ల‌కు పోలింగ్ చిట్టీల‌తోపాటు రూ.5 వేల చొప్పున పంచారు. స్థానికుల స‌మాచారంతో పోలీసులు అక్క‌డికి చేరుకోవడంతో డ‌బ్బులు వ‌దిలేసి అక్క‌డి నుంచి పారిపోయారు. దీంతో రూ.ల‌క్ష‌కుపైగా న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలోని 24వ వార్డు పోలింగ్‌ కేంద్రం వద్ద బీఆర్ఎస్ నాయ‌కులు డబ్బుల పంపిణీ చేశారు. దీంతో పోలీసులు వారిని ప‌ట్టుకున్నారు. నిందితుడు ఫిరోజ్ ఖాన్ వద్ద రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు.

బోగస్‌ ఓట్లు వేస్తున్నారని..

వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గాల మ‌ధ్య‌ వాగ్వాదం చోటుచేసుకున్న‌ది. మున్సిపాలిటీలోని 13వ వార్డు 27వ పోలింగ్‌ కేంద్రంలో బోగస్‌ ఓట్లు వేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్గీయుల ఆరోపించారు. దీంతో స్థానిక ఓటర్లే గుర్తింపు కార్డులతో ఓట్లు వేస్తున్నారన్న కాంగ్రెస్‌ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య తోపులాట చోటుచేసుకోవ‌డంతో వారిని పోలింగ్‌ కేంద్రం నుంచి పోలీసులు బయటకు పంపించారు.

 

Advertisement
Advertisement