త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Ramakrishna Rao | ఒకే కార్డుతో అన్ని ప్రభుత్వ సేవలు : సీఎస్ రామకృష్ణారావు

CS Ramakrishna Rao | రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంచడం, అన్ని సంక్షేమ పథకాల లబ్ధిని ఒకే వేదికపై అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం “యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డు” రూపకల్పనపై దృష్టి సారించింది.

P

Telangana | Published On May 29, 2026, 9.20 pm IST

CS Ramakrishna Rao | ఒకే కార్డుతో అన్ని ప్రభుత్వ సేవలు : సీఎస్ రామకృష్ణారావు
Advertisement

CS Ramakrishna Rao | రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంచడం, అన్ని సంక్షేమ పథకాల లబ్ధిని ఒకే వేదికపై అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం “యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డు” రూపకల్పనపై దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ కార్యక్రమంలో “ఒకే కార్డు–అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి” అనే విధానంతో కార్యాచరణ రూపొందించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

రేషన్‌, పెన్షన్‌, మహాలక్ష్మి వంటి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఈ కార్డుకు అనుసంధానం చేసి ప్రజలకు సేవలను మరింత సులభతరం చేయాలని సూచించారు. అంతేకాకుండా జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆరోగ్య ప్రొఫైల్‌, పెన్షన్ డేటా వంటి కీలక సమాచారాన్ని కూడా ఈ కార్డుతో అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసిన సీఎస్‌, వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న స్మార్ట్ కార్డు విధానాలను అధ్యయనం చేసి తెలంగాణకు అనువైన నమూనాను రూపొందించాలని సూచించారు. ఈ అంశంపై సమగ్ర ప్రణాళికను రాబోయే 10 రోజుల్లో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ఒకే కార్డు ద్వారా అనేక సేవలు పొందే విధంగా డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సమావేశంలో అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్‌, సబ్యసాచి ఘోష్‌, ముఖ్యకార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానీయా, శైలజా రామయ్యర్‌, యోగితారాణా, క్రిస్టినా చొంగ్తు, సీజీజీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రవిగుప్తా, కార్యదర్శులు గౌరవ్ ఉప్పల్‌, రఘునందన్ రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement