త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Seethakka | మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే దిశగా మరో ముందడుగు : మంత్రి సీతక్క

Minister Seethakka | గ్రామీణ మహిళల వ్యాపార కలలకు బలమైన వేదికగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక మహిళా ఇంక్యుబేటర్ కేంద్రాలను ప్రారంభించింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కొమరం భీం ఆదివాసీ భవన్‌లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు.

P

Telangana | Published On May 29, 2026, 8.29 pm IST

Minister Seethakka | మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే దిశగా మరో ముందడుగు : మంత్రి సీతక్క
Advertisement

Minister Seethakka | గ్రామీణ మహిళల వ్యాపార కలలకు బలమైన వేదికగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక మహిళా ఇంక్యుబేటర్ కేంద్రాలను ప్రారంభించింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కొమరం భీం ఆదివాసీ భవన్‌లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల చేతుల్లో కేవలం బ్యాంక్ పాస్‌బుక్స్ మాత్రమే కాకుండా పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ మహిళల ప్రతిభ, ఆలోచనలు, వ్యాపార కలలకు ఈ ఇంక్యుబేటర్లు బలమైన వేదికగా నిలుస్తాయని చెప్పారు. బిట్స్ పిలానీ, టీ హ‌బ్ భాగస్వామ్యంతో రెండు ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి కేంద్రానికి రూ.10.70 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ట్రైనింగ్‌, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, డిజిటల్ సపోర్ట్‌, ఫైనాన్షియల్ గైడెన్స్‌, బిజినెస్ మెంటారింగ్ వంటి సేవలు అందించడంతో పాటు తొలి విడతలో 300 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.

తెలంగాణలో 67 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారని, ఇప్పటికే 6.43 లక్షల మహిళలు వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, ఇప్పటివరకు రూ.60 వేల కోట్లకు పైగా బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని చెప్పారు. మధిరలో మహిళల కోసం ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా నెలకు రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తోందని, మహిళలు నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులు నెలకు రూ.4 లక్షల వరకు లాభాలు ఆర్జిస్తున్నాయని తెలిపారు. మేడారం జాతరలో 554 మంది మహిళలకు రూ.6 కోట్ల సాయం అందించగా, వారు కేవలం 15 రోజుల్లోనే రూ.9.5 కోట్ల వ్యాపారం నిర్వహించారని వివరించారు.

గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. చేర్యాల మహిళలు తయారు చేసిన చింతగింజల మాస్క్‌లు నెదర్లాండ్స్‌కు ఎగుమతి కావడం తెలంగాణ మహిళల సృజనాత్మకతకు నిదర్శనమన్నారు. మేడ్ ఇన్ తెలంగాణ‌.. మేడ్ బై వుమెన్ అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా మారుమోగాలని ఆకాంక్షించారు. మహిళలు ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, ప్రతి గ్రామంలో ఒక మహిళా వ్యాపారవేత్త తయారవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. మహిళలు ఐక్యంగా ముందుకు సాగితే తెలంగాణ మహిళలు దేశానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.

Advertisement
Advertisement