త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cabinet Meeting | 5 గంట‌ల‌కు మేడారంలో కేబినెట్ భేటీ.. త‌ర‌లి రానున్న మంత్రులు, అన్ని శాఖ‌ల‌ ఉన్న‌తాధికారులు

Cabinet Meeting | తెలంగాణ ప్ర‌భుత్వం స‌రికొత్త సాంప్ర‌దాయానికి తెర‌తీసింది. ఎన్న‌డూ లేనివిధంగా హైద‌రాబాద్ వెలుప‌ల తొలిసారిగా మంత్రివ‌ర్గం భేటీ (Cabinet Meeting) కానుంది. ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు మేడారంలో (Medaram) వ‌న‌దేవ‌త‌లైన‌ స‌మ‌క్క‌, సార‌ల‌మ్మ (Sammakka Srakka) చెంత కేబినెట్ స‌మావేశ‌మ‌వుతుంది.

G

Telangana | Published On Jan 18, 2026, 11.55 am IST

Cabinet Meeting | 5 గంట‌ల‌కు మేడారంలో కేబినెట్ భేటీ.. త‌ర‌లి రానున్న మంత్రులు, అన్ని శాఖ‌ల‌ ఉన్న‌తాధికారులు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ప్ర‌భుత్వం స‌రికొత్త సాంప్ర‌దాయానికి తెర‌తీసింది. ఎన్న‌డూ లేనివిధంగా హైద‌రాబాద్ వెలుప‌ల తొలిసారిగా మంత్రివ‌ర్గం భేటీ (Cabinet Meeting) కానుంది. ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు మేడారంలో (Medaram) వ‌న‌దేవ‌త‌లైన‌ స‌మ‌క్క‌, సార‌ల‌మ్మ (Sammakka Srakka) చెంత కేబినెట్ స‌మావేశ‌మ‌వుతుంది. దీనికోసం మంత్రుల‌తోపాటు అన్ని శాఖ ఉన్న‌తాధికారులు మేడారానికి త‌ర‌లివ‌స్తున్నారు. మంత్రివ‌ర్గ స‌మావేశం నేప‌థ్యంలో హ‌రిత హోట‌ల్‌లో ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బందోబ‌స్తు క‌ట్టుదిట్టం చేశారు. హోట‌ల్ ప‌రిస‌ర ప్రాంతాల్లో పెద్ద సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మేడారం జాతర వేళ.. కేబినెట్ భేటీ విశేషంగా మారింది.

చ‌ర్చకు రానున్న‌ కీలక అంశాలు..

మేడారం వేదికగా జరగనున్న కేబినెట్ స‌మావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలపై వేగంగా కసరత్తు జ‌రుగుతున్న‌ది. కీలకమైన రిజర్వేషన్ల అంశం కూడా కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ అంశంపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రస్తుత రబీ సీజన్‌లో రైతు భరోసా నిధులను విడుదల చేయాల్సి ఉంది. ఈ విషయంపై కూడా మంత్రివ‌ర్గ స‌మావేశంలో చర్చించ‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది. గోదావరి పుష్కరాలతోపాటు ఉత్తర తెలంగాణలోని పలు ప్రాజెక్టులు చర్చకు రానున్నాయి. పొట్లపూర్‌ ఎత్తి పోతల పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

కాగా, ప్ర‌స్తుతం ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం మేడారం చేరుకుంటారు. ఆదివారం మ‌ధ్యాహ్నం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను ముఖ్య‌మంత్రి ప్రారంభిస్తారు. నర్సింగ్ కాలేజీ, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్​, జేఎన్‌టీయూ కాలేజీ , కూసుమంచిలో 100 పడకల ప్రభుత్వ ద‌వాఖాన‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రజా ప్రతినిధులతో సమావేశమ‌వుతారు.

మధ్యాహ్నం 2.30 గంట‌లకు బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో జ‌రుగ‌నున్న సీపీఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఖమ్మం నుంచి సాయంత్రం 4.30 గంట‌ల‌కు హెలికాప్టర్​లో ములుగు జిల్లా మేడారం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు సీఎం నేతృత్వంలో మేడారం హరిత హోటల్‌లో మంత్రివర్గ భేటీ జ‌రుగ‌నుంది. సాయంత్రం 6.30 గంట‌ల‌కు మేడారంలో అభివృద్ధి పనులను సీఎం పరిశీలిస్తారు. రాత్రి 7 గంటలకు మేడారం ఆలయ ఎగ్జిట్ సెంటర్‌లో జ‌రుగ‌నున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య‌మంత్రి పాల్గొంటారు. అనంత‌రం మేడారం హరిత హోటల్‌కు చేరుకుంటారు.

Advertisement

తాజావార్తలు

Advertisement