త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana DGP appointment | తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు సీరియస్.. 4 వారాల్లో తేల్చాల్సిందే

తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇన్‌చార్జ్ డీజీపీల పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 4 వారాల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని యూపీఎస్సీని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి హెచ్చరికలు చేసింది.

J

Telangana | Published On Feb 5, 2026, 4.26 pm IST

Telangana DGP appointment | తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు సీరియస్.. 4 వారాల్లో తేల్చాల్సిందే

సంక్షిప్త సారాంశం

తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేవలం ఇన్‌చార్జ్ డీజీపీలతో నెట్టుకురావడంపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం, నాలుగు వారాల్లోగా అర్హులైన అధికారుల పేర్లను సిఫార్సు చేయాలని యూపీఎస్సీని ఆదేశించింది.

Advertisement
  • ఇన్‌చార్జ్ పాలన చెల్లదు
  • 4 వారాల్లో తెలంగాణ డీజీపీ నియామకం తేల్చండి: సుప్రీంకోర్టు ఆదేశం

Telangana DGP appointment | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ శాశ్వత డీజీపీ (Director General of Police) నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర డీజీపీ నియామకానికి సంబంధించి నాలుగు వారాల్లోగా తగిన సిఫార్సులు చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)ను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి స్పష్టమైన గడువు విధించింది.

ఇన్‌చార్జ్ పాలనపై ఆగ్రహం

రాష్ట్రంలో రెగ్యులర్ డీజీపీని నియమించకుండా, కేవలం 'యాక్టింగ్' లేదా 'ఇన్‌చార్జ్' డీజీపీలతో కాలం వెళ్లదీయడంపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు సకాలంలో డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలు (Proposals) పంపడంలో విపరీతమైన జాప్యం చేస్తున్నాయని కోర్టు పేర్కొంది.

మెరిట్ ఉన్న ఆఫీసర్లకు అన్యాయం

"రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ జాప్యం వల్ల నిజాయితీ, సమర్థత కలిగిన ఐపీఎస్ అధికారులకు తీరని అన్యాయం జరుగుతోంది. అర్హత ఉండి కూడా పదవి దక్కకుండా పోతోంది," అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అధికారుల యోగ్యతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని యూపీఎస్సీ సిఫార్సులు చేయాలని సూచించింది.

రాష్ట్రాలకు సుప్రీం వార్నింగ్

డీజీపీ నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. రాష్ట్రాలు ప్రతిపాదనలు ఆలస్యం చేస్తే యూపీఎస్సీ చూస్తూ ఊరుకోకూడదని, వెంటనే ఆయా రాష్ట్రాలకు లేఖలు రాయాలని ఆదేశించింది. లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే, కమిషన్ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని వెసులుబాటు కల్పించింది. దీంతో తెలంగాణ డీజీపీ నియామక ప్రక్రియ రాబోయే నెల రోజుల్లో వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

 

Advertisement
Advertisement