త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srisailam Reservoir Empty | కరెంటు కోసం పోటీ.. శ్రీశైలమంతా ఖాళీ.. మిగిలింది 44 టీఎంసీలే..!

విద్యుత్ ఉత్పత్తి కోసం రెండు రాష్ట్రాలు పోటీ పడటంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. డ్యామ్‌లో కేవలం 44 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉండటంతో, రాబోయే రోజుల్లో తాగు, సాగు నీటి కష్టాలు తప్పవని ఆందోళన నెలకొంది.

J

Telangana | Published On Mar 31, 2026, 8.47 pm IST

Srisailam Reservoir Empty | కరెంటు కోసం పోటీ.. శ్రీశైలమంతా ఖాళీ.. మిగిలింది 44 టీఎంసీలే..!
Advertisement
  • 2725 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసిన తెలంగాణ
  • ఏపీ కన్నా 650 మిలియన్ యూనిట్లు అధికం
  • అందుకోసం 523 టీఎంసీల వినియోగం
  • 18 ఏళ్లలో ఇదే టాప్
  • కనిష్ట స్థాయికి మించి వాడకం
  • 2 రాష్ట్రాల మధ్య కొరవడిన సమన్వయం
  • మంత్రి హెచ్చరిస్తే తప్ప దారికి రాని ఏపీ
  • నీళ్ల విషయంలో అనేక ప్రశ్నలకు తావిస్తున్న ముఖ్యమంత్రి మౌనం

Srisailam Reservoir Empty | త్రినేత్ర.న్యూస్ : శ్రీశైలం ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించిన ప్రాజెక్టే. కానీ కాలక్రమేణా ఈ జలాశయంపై ఆధారపడి ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించారు. అయితే అటు కరెంటు ఉత్పత్తికి, ఇటు ఎత్తిపోతల కాల్వలకు, రెండు రాష్ట్రాల విభజన తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో.. శ్రీశైలం ప్రాజెక్టులో కనిష్ట స్థాయిని మించి ఎడాపెడా నీళ్లను వాడుకుంటున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి సంభవిస్తే.. రాబోయే వర్షాకాలం సరిపడా వర్షాలు పడకపోతే అప్పుడు ఆ జలాశయంపైనే ఆధారపడిన తాగునీటి పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు ఏమవుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది.

2007 తరువాత ఈ సారే అత్యధికం

శ్రీశైలంలో ఎడమగట్టు నుంచి తెలంగాణ, కుడి గట్టు నుంచి ఏపీ విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. గత వర్షాకాలం నుంచి ఇప్పటివరకు శ్రీశైలం డ్యాంలోకి 2385 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. దీంతో తెలంగాణ 523 టీఎంసీలను వాడుకొని 2725 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసింది. కాగా, కుడివైపు విద్యుత్ కేంద్రం సామర్థ్యం 1752 మిలియన్ యూనిట్లే అయినప్పటికీ ఏపీ అంతకు మించి 2060 యూనిట్ల విద్యుత్ కోసం 346 టీఎంసీలను వినియోగించింది. ఇది గత పద్దెనిమిదేళ్లలో అత్యధికం. చివరిసారిగా 2007-08 సంవత్సరంలో ఉత్పత్తి చేసిన విద్యుత్ ను అధిగమించి, ఈ ఏడాది ఉత్పత్తి చేశాయి. ఏపీ అయితే ఏకంగా అప్పటి ఉత్పత్తి కంటే రెట్టింపు విద్యుత్ ను ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. సోమవారం నాటి నీటి లెక్కల ప్రకారం డ్యాం నీటి నిల్వ 44.08 టీఎంసీలకు తగ్గిపోయింది. ప్రస్తుతం 824.10 అడుగుల మట్టంలో 44.08 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2,400 క్యూసెక్కులు ఎత్తిపోస్తే.. ఏపీ ప్రభుత్వం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా 741 క్యూసెక్కులు ఎత్తిపోస్తోంది. కాగా, నల్గొండ, పాలమూరు జిల్లాల్లో పంటలు చేతికి వచ్చే దశలో ఉన్నాయి. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం కనిష్ట స్థాయి కన్నా 10 అడుగులు కిందికే నీటి మట్టం ఉన్నది. ఈ రిజర్వాయర్ పై ఆధారపడి ఉన్న ఎత్తిపోతల కాల్వలకు నిర్దిష్ట సమయంలో నీరందించే విధంగా ఎలాంటి వ్యూహం, ప్రణాళిక లేకపోవడంతో నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరేదాకా తెలంగాణ నేతలు వేచిచూశారు.

బయటపడ్డ సమన్వయ లోపం

పక్క రాష్ట్రంతో తాము గొడవ పడదలుచుకోలేదని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పుకుంటూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. శ్రీశైలం నీళ్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారు. సాక్షాత్తూ మంత్రే.. తాను శ్రీశైలం వద్ద నిరసనకు దిగుతానని హెచ్చరించే పరిస్థితి నెలకొన్నది. చివరికి కథ ప్రస్తుతానికి సుఖాంతమైనా.. రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల విషయంలో ఎలాంటి సమన్వయం, ముందుచూపు లేదని అర్థమవుతున్నది.

Advertisement

తాజావార్తలు

Advertisement