త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Naveen Nicolas | ‘ప‌ది’ విద్యార్థుల‌కు ప్ర‌త్యేక ఆన్‌లైన్ డిజిట‌ల్ క్లాసులు.. స్కూల్ ఎడ్యుకేష‌న్‌, టీ-శాట్‌ మ‌ధ్య కుదిరిన ఎంవోయూ

Naveen Nicolas | ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు సాయంత్రం వేళ‌ల్లో ప్ర‌త్యేక ఆన్‌లైన్ డిజిట‌ల్ క్లాసులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ న‌వీన్ నికోల‌స్ తెలిపారు. స్కూల్ ఎడ్యుకేష‌న్, టీ-శాట్‌ మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం కుదిరిన‌ట్లు చెప్పారు.

S

Telangana | Published On Aug 22, 2026, 3.46 pm IST

Naveen Nicolas | ‘ప‌ది’ విద్యార్థుల‌కు ప్ర‌త్యేక ఆన్‌లైన్ డిజిట‌ల్ క్లాసులు.. స్కూల్ ఎడ్యుకేష‌న్‌, టీ-శాట్‌ మ‌ధ్య కుదిరిన ఎంవోయూ
Advertisement
  • సాయంత్రం వేళ‌ల్లో నిర్వ‌హ‌ణ‌
  • ఎంవోయూపై డైరెక్టర్ నవీన్ నికోలస్, టి-శాట్‌ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి సంతకాలు

Naveen Nicolas | త్రినేత్ర‌.న్యూస్: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు సాయంత్రం వేళ‌ల్లో ప్ర‌త్యేక ఆన్‌లైన్ డిజిట‌ల్ క్లాసులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ న‌వీన్ నికోల‌స్ తెలిపారు. స్కూల్ ఎడ్యుకేష‌న్, టీ-శాట్‌ మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం కుదిరిన‌ట్లు చెప్పారు. హైద‌రాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేష‌న్ కార్యాల‌యంలో శ‌నివారం టీ-శాట్‌ సీఈవో బోద‌న‌ప‌ల్లి వేణుగోపాల్‌రెడ్డితో క‌లిసి సంత‌కాలు చేసి ఒప్పంద ప‌త్రాల‌ను మార్చుకున్న‌ట్లు వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా న‌వీన్ నికోల‌స్‌, వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు డిజిటల్ లెర్నింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. డిజిటల్ కంటెంట్ ప్రసారాల విషయంలో ఎంవోయూ ఫలితంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, టీ-శాట్‌ మధ్య కార్యక్రమాల ప్రసారాల విషయంలో స్పష్టత వస్తుందని చెప్పారు.

‘మా జిల్లా.. మా పాఠశాల’ పేరుతో..

తొమ్మిది, పదో తరగతి పిల్లలకు సాయంత్రం వేళల్లో డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28 వేల పాఠశాలల్లో చదువున్న విద్యార్థుల తల్లిదండ్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ముఖాముఖి’, ‘మా జిల్లా.. మా పాఠశాల’ పేరుతో డీఈవోలు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం, ఉపాధ్యాయుల కోసం ‘టి.ఎల్.ఎమ్’ మేళా వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఇక నుండి టీ-శాట్‌ వేదికగా ప్రసారం చేసుకునేందుకు ఎంవోయూ ఉపయోగపడుతుందని నవీన్ నికోలస్, వేణుగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

డిజిటల్ ప్రసారాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని టీ-శాట్‌ ద్వారా నిర్వహించే విధంగా సమగ్ర శిక్ష, ఎస్.ఇ.ఆర్.టి తదితర విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని నవీన్ నికోలస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ అడిషనల్ డైరెక్టర్ పీవీ శ్రీహరి, టి-సాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎండీ సాధిక్, జనరల్ మేనేజర్ లింగారెడ్డి ప్రాజెక్ట్ జేడీలు, కో-ఆర్డినేటర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement