త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivasa Reddy | అవి.. పచ్చి అబద్ధాలు.. మాపై బుర‌ద జ‌ల్లేందుకు హ‌రీశ్‌, కేటీఆర్ య‌త్నం

Ponguleti Srinivasa Reddy | బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లు అబద్ధాలే ఎజెండాగా పని చేస్తున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. నాదర్‌గుల్‌లో 373 ఎకరాల విలువైన భూములను తాను కబ్జా చేశానంటూ వస్తున్న వార్తలపై ఆయన సంపూర్ణ వివరణ ఇచ్చారు.

S

Telangana | Published On Apr 8, 2026, 6.57 pm IST

Ponguleti Srinivasa Reddy | అవి.. పచ్చి అబద్ధాలు.. మాపై బుర‌ద జ‌ల్లేందుకు హ‌రీశ్‌, కేటీఆర్ య‌త్నం
Advertisement

నాదర్‌గుల్ భూములను రిజిస్ట్రేషన్ చేసింది వారి హయాంలోనే
వట్టి నాగులపల్లి.. ఓ కుటుంబ వ్యవహారం
2014 నుంచి జరిగిన అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరుపుతాం
దోషులను కఠినంగా శిక్షిస్తాం

Ponguleti Srinivasa Reddy | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లు అబద్ధాలే ఎజెండాగా పని చేస్తున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. నాదర్‌గుల్‌లో 373 ఎకరాల విలువైన భూములను తాను కబ్జా చేశానంటూ వస్తున్న వార్తలపై ఆయన సంపూర్ణ వివరణ ఇచ్చారు. ఆ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం వారి హయాంలోనే ఆ కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేసిందని చెప్పారు. వట్టి నాగులపల్లిలో కూడా తనకు ఎలాంటి క్రషర్ లేదని స్పష్టతనిచ్చారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నేతలైన హరీశ్ రావు తదితరులు తనపై చేస్తున్న పలు ఆరోపణలకు ఆయన సాక్ష్యాధారాలతో సమాధానమిచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

ముక్కు నేలకు రాస్తా

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్‌గుల్ గ్రామంలోని వివాదాస్పద సర్వే నంబర్ 613లోని 373 ఎకరాలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 1న యునైటెడ్ ల్యాండ్ మార్క్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ఫా స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, ఒమెగా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు 2014 సెప్టెంబర్ 1న రిజిస్ట్రేషన్ జరిగింది. 2016 సెప్టెంబర్ 24న మ్యుటేషన్ జరిగింది. అంటే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ మీ ప్రభుత్వమే చేసింది కదా. ఇక్కడ మా ప్రభుత్వానికి ఏం సంబంధం? అలాగే గూగుల్ మ్యాప్‌ల ప్రకారం 2022 నవంబర్ 17 నాటికే ఈ వివాదాస్పద స్థలం చుట్టూ షీట్లు పెట్టి లోపల ఇన్నర్ రోడ్లు వేశారు. మీ హయాంలో ఇన్ని పనులు జరిగితే మా ప్రభుత్వంపై నిందలు మోపితే ఎలా? ఈ స్థలంపై ఆ కంపెనీలు 2022 లో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం కౌంటర్ దాఖలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చి 15న.. దాన్ని ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేశాం. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఈ 3 కంపెనీల్లో నా కొడుకు గానీ, నా భార్య గానీ, కుటుంబ సభ్యులు గానీ ఉంటే నేను ముక్కు నేలకు రాస్తా.

నాకు ఏ క్రషరూ లేదు

వట్టి నాగులపల్లి భూమి వ్యవహారం షా కుటుంబానికి చెందిన పంచాయితీ. వాళ్లందరూ 60 ఏండ్ల కిందట కొనుక్కున్న భూమి. షా కుటుంబ సభ్యుల వద్ద నుంచి కొంత ల్యాండ్‌ను ఓ కంపెనీ డెవలప్‌మెంట్‌కు తీసుకున్నది. ఆ కంపెనీలో ఉన్న నలుగురిలో నా కొడుకు ఒక పార్ట్‌న‌ర్ మాత్రమే. ఓఆర్ఆర్ కోసం సేకరించిన భూమిలో 21 ఎకరాలు వివాదాస్పదంగా మారింది. దాంతో అక్కడ గొడవలు మొదలయ్యాయి. అయితే అక్రమంగా మై హోం కంపెనీ.. ఆ 21 ఎకరాలు డెవలప్‌మెంట్ కోసం తీసుకొని అడ్డదారిలో 2023 ఆగస్టు 19న నాలా కన్వర్షన్ అనుమతి తెచ్చుకున్నది. కొత్వాల్ గూడలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ రేడియల్ రోడ్డు పని చేస్తున్నది. అందుకోసం అవసరమైన మెటీరియల్ .. అక్కడే ఉన్న తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ సరఫరా చేస్తున్నది. అంతే తప్ప.. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు క్రషర్ పనికి ఎలాంటి సంబంధం లేదు. అయినా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా.. 2014 నుంచి మైనింగ్ విభాగంలో జరిగిన అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరిపిస్తామన్నారు. తప్పనిసరిగా దోషులెవరో తేలుతారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement