త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | వచ్చే ఎన్నిక‌ల్లో రేవంత్ 9 సీట్లు కూడా గెల‌వ‌డు

Harish Rao | వ‌చ్చే ఎన్నిక‌ల్లో 117 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే శంకరగిరి మాన్యాలు పట్టినట్టేన‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 9 సీట్లు కూడా గెలవదన్నారు. ఈసారి మెదక్ జిల్లాలో 10 కి 10 ఎమ్మెల్యే స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుంద‌ని జోస్యం చెప్పారు. షాబాద్ హంత‌కుడికి, రేవంత్‌రెడ్డికి ఏం తేడా లేద‌న్నారు.

S

Telangana | Published On Jul 13, 2026, 4.15 pm IST

Harish Rao | వచ్చే ఎన్నిక‌ల్లో రేవంత్ 9 సీట్లు కూడా గెల‌వ‌డు
Advertisement
  • పీక‌లు కోస్తా అంటున్న సీఎంపై కేసు న‌మోదు చేయాలి
  • షాబాద్ హంతకుడికి, రేవంత్ రెడ్డికి ఏమైనా తేడా ఉందా?
  • కాంగ్రెస్ నేత 20 లక్షలు తీసుకుని కాపాడటం వల్లే షాబాద్ హ‌త్య‌లు
  • సింగూరును ఖాళీ చేయించి 30 పైస‌ల ప‌ని కూడా చేయ‌లే
  • బసవేశ్వర ప్రాజెక్టునూ బంద్ చేశారు
  • త్వరలో బసవేశ్వర స్ఫూర్తితో భారీ పాదయాత్ర
  • ముఖ్యమంత్రికి దమ్ముంటే నారాయణఖేడ్ సమస్యలపై సమాధానం చెప్పాలి
  • నారాయణఖేడ్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఫైర్

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: వ‌చ్చే ఎన్నిక‌ల్లో 117 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే శంకరగిరి మాన్యాలు పట్టినట్టేన‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 9 సీట్లు కూడా గెలవదన్నారు. ఈసారి మెదక్ జిల్లాలో 10 కి 10 ఎమ్మెల్యే స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుంద‌ని జోస్యం చెప్పారు. షాబాద్ హంత‌కుడికి, రేవంత్‌రెడ్డికి ఏం తేడా లేద‌న్నారు. నీళ్ల‌డిగితే పీక‌లు కోస్తా అంటున్న రేవంత్‌పై డీజీసీ స్పందించి కేసు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే నారాయణఖేడ్ సమస్యలపై సమాధానం చెప్పాలన్నారు. సోమ‌వారం నారాయణఖేడ్‌లోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో జ‌రిగిన‌ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయ‌న మాట్లాడుతూ రేవంత్ పాల‌న‌పై ఫైర‌య్యారు.

బీఆర్ఎస్ కార్యకర్త ఒక చిన్న పోస్ట్ పెడితే నిమిషాల్లో వెళ్లి అరెస్ట్ చేసే పోలీసులు.. మైనర్ అమ్మాయిని రేప్ చేసిన సైకో రాజ్‌కుమార్‌ను 40 రోజుల వరకు ఎందుకు పట్టుకోలేకపోయారు. పోలీసు స్టేషన్లు కాంగ్రెస్ నేతల సెటిల్మెంట్ కేంద్రాలుగా మారాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తీవ్ర భ‌యాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఒక మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు 20 లక్షల రూపాయలు తీసుకుని పోక్సో కేసు నుండి ఆ రేపిస్ట్‌ను కాపాడాడు. పోలీసులకు 45 రోజులు టైం ఇచ్చి బెయిల్ ఇప్పించాడు. ఆ కాంగ్రెస్ నేత అండ చూసుకునే వాడు బయటకు వచ్చి ఏకంగా ఆరుగురిని కిరాతకంగా ఊచకోత కోశాడు అని హ‌రీశ్ రావు ఆరోపించారు.

సామాన్యుడికైనా, ముఖ్యమంత్రికైనా చ‌ట్టం ఒక్కటే

ఈ సైకో వ్యవహారంపై పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా స్పందించి మాట్లాడుతున్నారు. కానీ మన ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా కరువు పరిస్థితులపై విలేకర్లు ప్రశ్నిస్తే మీ పీకలు కోసి రక్తం చల్లితే వానలు పడతాయి అని మాట్లాడుతున్నాడు. ఈ సైకో రాజ్‌కుమార్‌కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమైనా తేడా ఉందా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటేనా ఇది. కోస్తాం, రక్తం చల్లుతాం అని హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి మీద డీజీపీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదు. పోలీసులు కండ్లు మూసుకున్నారా? చట్టం సామాన్యుడికైనా, ముఖ్యమంత్రికైనా ఒక్కటే. రేవంత్ రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు.

ఒకపక్క కరువు వస్తుంటే.. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వండయ్యా అని అడిగితే మీ పీకలు నొక్కుతా అంటున్నాడు. రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ లేకుండానే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చని సలహా ఇస్తే వాళ్లను జైల్లో పెడతా అంటున్నాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని. రిపేర్లు చేస్తామని సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేయించారు. తీరా వానాకాలం వచ్చినా 30 పైసల పని కూడా జరగలేదు. ఉన్న నీళ్లు వృథాగా పోయాయి, ఇప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేశారు అని విమ‌ర్శించారు.

ఎన్నికల ముందు ప్రతి గింజా కొంటాం, అన్నింటికీ బోనస్ ఇస్తాం అని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడేమో కేంద్రం ఏది కొనుమంటే అదే కొంటాం, ఎంత కొనుమంటే అంతే కొంటాం అంటూ చేతులెత్తేశారు. 20% ప్రభుత్వం కొంటే, మిగతా 80% రైతులు అడ్డికి పావుశేరు చొప్పున బయట అమ్ముకుని నష్టపోవాలా? ఢిల్లీ చెప్పినట్లే వినడానికి ఆ ముఖ్యమంత్రి కుర్చీ ఎందుకు? అని ప్ర‌శ్నించారు.

పూరీలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు.. కానీ

కేసీఆర్ హయాంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే.. ఇప్పుడు అది 8 గంటలకు పడిపోయింది. రుణమాఫీ పేరుతో దేవుళ్ల మీద ఒట్లు వేసి, తీరా గెలిచాక దేవుళ్లకే శఠగోపం పెట్టారు. కౌలు రైతులకు ఇస్తామన్న రైతుబంధు ఎగ్గొట్టారు. 30 నెలల్లో రైతులకు 19 వేల కోట్ల రూపాయల రైతుబంధు ఎగవేశారు. ఎల్ఐసీకి ప్రీమియం కట్టకుండా రైతుల బీమా ఆపేశారు. డబ్బులు లేవని చెప్పే రేవంత్ రెడ్డి.. తన మనవడి కోసం ఫుట్ బాల్ మ్యాచ్ పెట్టి వందల కోట్లు వృథా చేశాడు. ఇంట్లో పూరీలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ.. డబ్బులు లేవంటూనే మూసీ సుందరీకరణకు, ఫ్యూచర్ సిటీకి లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నాడు. అందాల పోటీలకు వందల కోట్లు ఎక్కడివి అని నిల‌దీశారు.

ఈ జిల్లా మంత్రి ఏం చేస్తున్నట్టు?

బడులు తెరిచి నెల రోజులవుతున్నా పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్స్ రాలేదు. సీఎం కమీషన్ల కక్కుర్తికి ప్రభుత్వ, గురుకుల పాఠశాలల పిల్లలు అవస్థలు పడుతున్నారు. 20 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల ఫీజు రీయింబర్స్ మెంట్ బంద్ పెట్టి వారి బతుకులను ఆగం చేస్తున్నాడు. ఏ స్కీం ఆగలేదు అంటున్న రేవంత్ రెడ్డి.. గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, కేసీఆర్ కిట్, రైతుబీమా అన్నీ బంద్ పెట్టాడు. కేసీఆర్ మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తే.. నేడు నారాయణఖేడ్‌లో మూడు రోజులకు ఒక్కసారి నల్లా వస్తోంది. నారాయణఖేడ్, ఆందోల్ ప్రజల సాగునీటి కోసం కేసీఆర్ 'సంగమేశ్వర - బసవేశ్వర' ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తే, రేవంత్ రెడ్డి ఆ పనులను బంద్ పెట్టించాడు. మూసీ ముద్దు - బసవేశ్వర వద్దా రేవంత్ రెడ్డి? ఈ జిల్లా మంత్రి ఏం చేస్తున్నట్టు? ఇక్కడి ఎమ్మెల్యే ఎందుకు అడగటం లేదు అని హ‌రీశ్ రావు ప్ర‌శ్నించారు.

 

Advertisement
Advertisement