త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో.. అదే నా ర‌స్తా: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Pawan Kalyan | ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో.. ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో.. గెలుస్తుందో ఓడుతుందో.. కానీ ముందుకు పోతుందో.. అదే నా రస్తా.

G

Telangana | Published On Jun 3, 2026, 9.11 am IST

Pawan Kalyan | అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో.. అదే నా ర‌స్తా: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
Advertisement

Pawan Kalyan | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌లో కూడా జ‌న‌సేన ఉంటుందని, తాము పోటీచేసి తీరుతామ‌ని ఆ పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తానే స్వ‌యంగా ప్ర‌చారం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాదం కంటే ప్రాంతీయ వాదం హానిక‌ర‌మ‌ని చెప్పారు. ప్రాంతీయ విద్వేషాల‌ను రెచ్చ‌గొడితే జ‌న‌సేన స‌హించ‌దంటూ కాంగ్రెస్ ల‌క్ష్యంగా ఆయ‌న ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విరుచుకుప‌డ్డారు.

అవును తెలంగాణ మా అయ్య జాగీరే అంటూ మంత్రి పొన్న ప్ర‌భాక‌ర్ ఏపీ డిప్యూటీ సీఎంపై ఫైర్ అయ్యారు. ఏపీలోనే పీకలేక పోతున్న.. ఇక్కడేం పీకుతా అని నువ్వే అన్నావని, మళ్లీ ఎందుకు ఇదంత అని నిల‌దీశారు. బీజేపీ వాళ్లు ఎవరో స్క్రిప్ట్ సరిగ్గా రాసి ఇవ్వడంలేదని మండిప‌డ్డారు.

సినిమాలు పోయిన డిప్రెషన్‌లో తెలంగాణ మీద ఏది అంటే అది మాట్లాడకు పవన్ కల్యాణ్ అంటూ జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమ‌ర్శించారు. ఏపీ ప్రజలు నిన్ను గెలిపిస్తే వాళ్ల‌ను వదిలేసి తెలంగాణలో ఉంటున్నావని దుయ్య‌బ‌ట్టారు. తాను జడ్చర్లలో పోటీ చేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా గెలిచానని, పవన్ కల్యాణ్ లాగా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోలేద‌న్నారు. తెలంగాణ వచ్చాక 11 రోజులు తినకుండా ఉన్న చరిత్ర నీద‌ని, నిన్ను.. నీ భూటకపు నాటకాలను నమ్మే స్థితిలో తెలంగాణ సమాజం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దుయ్య‌బ‌ట్టారు.

అదే నా రస్తా..

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్స్ వేదిక‌గా ట్వీట్ చేశారు. `ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో.. ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో.. గెలుస్తుందో ఓడుతుందో.. కానీ ముందుకు పోతుందో.. అదే నా రస్తా.

ఏ రస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో.. ఏ రస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో.. ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా..` అంటూ మ‌హాక‌వి శేషేంద్ర (Maha Kavi Seshendra) ర‌చించిన ఆధునిక మ‌హాభార‌తంలోని (Aadunikha MahaBharatham) క‌విత‌ను పోస్ట్ చేశారు.

రాహుల్‌, ప్రియాంక ఎక్క‌డైనా పోటీచేయోచ్చా..?

రాహుల్‌, ప్రియాంక దక్షిణాదిలో ఎక్కడైనా పోటీ చేయవచ్చా? పవన్ క‌ల్యాణ్‌ ప్రశ్నించారు. ఇందిరాగాంధీ మెదక్‌లో పోటీ చేశారని గుర్తు చేశారు. ప్రాంతీయ వాదమే, కాంగ్రెస్‌ వాదమా?, కాంగ్రెస్‌ పార్టీకి ఒక పద్ధతి అంటూ ఉందా?, జాతీయ పార్టీ ప్రాంతీయ వాదం మాట్లాడవచ్చా?, ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు తీసుకుని వెళ్లాలా? అంటూ పలు ప్రశ్నలు సంధించారు. ప్రాంతీయత పేరుతో జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన అంగీకరించదని స్పష్టం చేశారు. ప్రాంతీయవాదం తీసుకువస్తే దేశ సుస్థిరత దెబ్బతింటుందని అన్నారు. ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం హానికరమని వెల్లడించారు. ఇది భారతదేశం అనుకున్నారా? పాకిస్థాన్‌, పాలస్తీనా అనుకున్నారా? అని ప్రశ్నించారు.

Advertisement
Advertisement