త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kunamneni | ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే: కూనంనేని సాంబశివరావు

Kunamneni | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రాజకీయ ప్రయోజనాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజా ద్రోహమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ చేసిన పరిపక్వత లేని వ్యాఖ్యలు తెలుగు ప్రజల మధ్య అనవసర ఉద్రిక్తతలకు దారితీసేలా ఉన్నాయని విమర్శించారు.

P

Telangana | Published On Jun 3, 2026, 8.40 pm IST

Kunamneni | ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే: కూనంనేని సాంబశివరావు
Advertisement

Kunamneni | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రాజకీయ ప్రయోజనాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజా ద్రోహమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ చేసిన పరిపక్వత లేని వ్యాఖ్యలు తెలుగు ప్రజల మధ్య అనవసర ఉద్రిక్తతలకు దారితీసేలా ఉన్నాయని విమర్శించారు. బుధవారం మఖ్దూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహాతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అజెండాను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవించాలని కమ్యూనిస్టు పార్టీ ఎప్పటినుంచో కోరుకుంటోందని చెప్పారు. వ్యక్తిగతంగా చేసిన కొన్ని వ్యాఖ్యలను పెద్దదిగా చేసి రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజకీయాలు చేయడం అందరి హక్కేనని.. అయితే, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం మాత్రం సమర్థనీయం కాదన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉన్న సోదరభావాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

కమ్యూనిజం చచ్చిపోలేదు

కమ్యూనిజం చచ్చిపోయిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను కూనంనేని తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో పవణ్ కళ్యాణ్ చేగువేరా చిత్రాన్ని ప్రదర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు భావజాలం సజీవంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల బాధలపై స్పందించి ప్రశ్నించే ప్రతి వ్యక్తిలో కమ్యూనిస్టు ఆలోచన ఉంటుందని, దానిని ఎవరూ అంతం చేయలేరని వ్యాఖ్యానించారు. గతంలో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ క‌ల్యాన్‌, ఇప్పుడు అదే పార్టీలపై విమర్శలు చేయడం ఆశ్చర్యకరమన్నారు. ప్రజాగాయకుడు గద్దర్‌కు కమ్యూనిస్టు పార్టీ ఎప్పటికప్పుడు అండగా నిలిచిందని చెప్పారు. గద్దర్‌కు తానే కారు ఇచ్చానంటూ ప్రచారం చేసుకోవడం సరికాదని, ప్రజల ప్రేమాభిమానాలే ఆయనను నిలబెట్టాయని వ్యాఖ్యానించారు. ఒక చేత్తో చేసిన సహాయం మరో చేతికి తెలియకుండా ఉండాలనే సంస్కారం అవసరమని సూచించారు. గద్దర్ కుమార్తె వెన్నెల కూడా ఈ అంశాన్ని ఖండించిన విషయాన్ని ప్రస్తావించారు.

నాగేశ్వర్‌పై కేసులకు నిరసన

ప్రొఫెసర్ కే నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో నమోదు చేసిన కేసులను నిరసిస్తూ గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సీపీఐ ఆధ్వర్యంలో మేధావులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు కూనంనేని వెల్లడించారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఈ అంశానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, పెరుగుతున్న ధరలను నిరసిస్తూ ఈ నెల 10న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు 45 నియోజకవర్గాల్లో భారీ పాదయాత్రలు చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లో ఎండగట్టనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 28న వేలాదిమందితో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Advertisement
Advertisement