త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Prajavani | ప్ర‌జ‌ల విశ్వాసం పెరిగేలా అధికారులు ప‌ని చేయాలి

CM Prajavani | ప్ర‌జ‌ల విశ్వాసం పెరిగేలా అధికారులు ప‌ని చేయాల‌ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్, సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి సూచించారు.

S

Telangana | Published On Sep 15, 2026, 6.03 pm IST

CM Prajavani | ప్ర‌జ‌ల విశ్వాసం పెరిగేలా అధికారులు ప‌ని చేయాలి
Advertisement
  • సీఎం ప్రజావాణిలో గద్వాల్‌ విజయలక్ష్మి

CM Prajavani |  త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌జ‌ల విశ్వాసం పెరిగేలా అధికారులు ప‌ని చేయాల‌ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్, సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి సూచించారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన 255వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో ఆమె చర్చించారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న ప్రజల సమస్యల పరిష్కారమే "సీఎం ప్రజావాణి" ధ్యేయమన్నారు.

ప్రజలు ప్రస్తావించిన సమస్యలను గద్వాల్ విజయలక్ష్మి ఓపికతో విని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్జీలపై ప్రత్యేకంగా నోట్స్ రాసి అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆమె కృషి చేశారు.

ప్రజావాణికి వెళితే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ఉన్న ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా అధికారులు అంకితభావంతో కృషి చేయాలని గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. సీఎం ప్రజావాణిలో ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, హోం శాఖల అంశాలపై అర్జీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. మండలం, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు తెలిపారు.

ఈ ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 23, విద్యుత్ శాఖకు 8, బీసీ సంక్షేమ శాఖకు 7, ఇతర శాఖలకు 36 కలిపి మొత్తం 74 దరఖాస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్, ప్రవాసి ప్రజావాణి నుంచి మంద భీమ్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement