త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Waterlogging Hotspots | మొద‌లైన వాన‌లు.. వ‌ర‌ద ముప్పు ప్రాంతాల్లో హైడ్రా, ట్రాఫిక్ ఉన్న‌తాధికారుల ప‌ర్య‌ట‌న‌

Waterlogging Hotspots | వ‌ర్షాకాలం మొద‌లైంది. వాన‌లు కురుస్తున్న వేళ‌లో నగరంలో వరద ముప్పు ఎక్కువగా ఎదురయ్యే ప్రాంతాలను ముందే గుర్తించి, స‌మ‌స్య‌ను నివారించేందుకు అధికారులు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో క్షేత్ర‌స్థాయిలో సోమ‌వారం రాజేంద్రనగర్, శంషాబాద్ పరిధిలోని జలమయమయ్యే పాయింట్లలో ఉన్నతాధికారుల సంయుక్త బృందం ప‌రిశీలించింది.

P

Telangana | Published On Jun 15, 2026, 8.28 pm IST

Waterlogging Hotspots | మొద‌లైన వాన‌లు.. వ‌ర‌ద ముప్పు ప్రాంతాల్లో హైడ్రా, ట్రాఫిక్ ఉన్న‌తాధికారుల ప‌ర్య‌ట‌న‌
Advertisement

Waterlogging Hotspots | వ‌ర్షాకాలం మొద‌లైంది. వాన‌లు కురుస్తున్న వేళ‌లో నగరంలో వరద ముప్పు ఎక్కువగా ఎదురయ్యే ప్రాంతాలను ముందే గుర్తించి, స‌మ‌స్య‌ను నివారించేందుకు అధికారులు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో క్షేత్ర‌స్థాయిలో సోమ‌వారం రాజేంద్రనగర్, శంషాబాద్ పరిధిలోని జలమయమయ్యే పాయింట్లలో ఉన్నతాధికారుల సంయుక్త బృందం ప‌రిశీలించింది. వర్షపు నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ అంతరాయం వంటి సమస్యలు తరచూ ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ విభాగాలు కలిసి సమగ్రంగా పరిస్థితిని పరిశీలించాయి. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌, హైద‌రాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ డీ జోయ‌ల్ డేవిస్‌, ట్రాఫిక్‌-3 డీసీపీ రాహుల్ హెగ్డే, శంషాబాద్ జోన్ డీసీపీ బీ రాజేశ్‌, జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి క‌లిసి ప‌ర్య‌టించారు.

రామ్‌దేవ్ బాబా వాటర్‌లాగింగ్ పాయింట్‌తో పాటు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేలోని పిల్లర్ నంబర్ 265, 191 ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. భారీ వర్షాల సమయంలో నీరు నిలిచిపోవడానికి గల కారణాలు, డ్రైనేజీ వ్యవస్థ సామర్థ్యం, నీటి ప్రవాహ మార్గాల్లో ఉన్న అడ్డంకులను ప్రత్యక్షంగా సమీక్షించారు. స్థానికంగా ఉన్న సమస్యలను వెంటనే గుర్తించి, ఇంజనీరింగ్ సిబ్బందికి తక్షణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. క్యాచ్ పిట్లు, పిల్లర్ పరిసరాల్లో పేరుకుపోయిన పూడిక, ప్లాస్టిక్ వ్యర్థాలు, మలినాలను యుద్ధప్రాతిపదికన తొలగించాలని జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బందిని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు నీరు నిలిచిపోయే ప్రాంతాల్లో వెంటనే పని చేసేలా అధిక సామర్థ్యం గల డీవాటరింగ్ పంపులను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

అవసరమైతే వెంటనే వినియోగించేందుకు వీలుగా వాటిని శాశ్వతంగా అందుబాటులో ఉంచనున్నారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. డైవర్షన్ మార్గాలు, అత్యవసర మళ్లింపులు, వాహనాల తొలగింపు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనున్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా వాహనదారులకు ముందుగానే హెచ్చరికలు ఇవ్వడం, అవసరమైన చోట క్రేన్ల సహాయంతో వాహనాలను తొలగించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు కలిసి 24 గంటల సమన్వయంతో పనిచేసేలా వ్యవస్థను బలోపేతం చేయ‌నున్నారు. వర్షాకాల అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు వైర్‌లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించనున్నారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. వర్షాలు వచ్చినా నగరంలో సాధారణ జీవనం అంతరాయం లేకుండా కొనసాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement