త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Chamala | నిప‌ర్‌లో పారదర్శకతపై చర్యలు తీసుకోవాలి : ఎంపీ చామల

MP Chamala | నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER) సంస్థల్లో పరిపాలనా పారదర్శకతను పెంపొందించడంతో పాటు ఖాళీల భర్తీపై తక్షణ చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. నిప‌ర్ కౌన్సిల్ మూడో సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

P

Telangana | Published On Jun 15, 2026, 9.20 pm IST

MP Chamala | నిప‌ర్‌లో పారదర్శకతపై చర్యలు తీసుకోవాలి : ఎంపీ చామల
Advertisement

MP Chamala | నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER) సంస్థల్లో పరిపాలనా పారదర్శకతను పెంపొందించడంతో పాటు ఖాళీల భర్తీపై తక్షణ చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. నిప‌ర్ కౌన్సిల్ మూడో సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశంలో ఔషధ విద్య, పరిశోధన రంగాలకు నిప‌ర్‌లు వెన్నెముకలుగా నిలుస్తున్నాయని పేర్కొన్న ఎంపీ, అన్ని నిప‌ర్‌ల‌లో ఐదేళ్ల పదవీకాలంతో రెగ్యులర్ రిజిస్ట్రార్లను నియమించాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ నిప‌ర్‌లో ఇప్పటికీ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ కొనసాగడం సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోందన్నారు.

పరిపాలనా ఖాళీలను వెంటనే భర్తీ చేసి, విద్యార్థుల ప్లేస్‌మెంట్ అవకాశాలను మరింత బలోపేతం చేయాలని కోరారు. గవర్నింగ్ బోర్డుల పదవీకాలం ముగిసిన తర్వాత కూడా అవే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం చట్టబద్ధమేనా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కౌన్సిల్‌ను ప్రశ్నించారు. కొత్త గవర్నింగ్ బోర్డుల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. బ‌యో-శ‌క్తి కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన జాతీయ బయో అవైలబిలిటీ కేంద్రాల పనితీరు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, వాటి ఫలితాలపై సమగ్ర వివరాలు వెల్లడించాలని కోరారు. దేశ ఫార్మా రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు ఈ రంగంలో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే, నిప‌ర్‌ల‌లో ఏర్పాటు చేసిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సంఖ్య, వాటి పనితీరు, పరిశ్రమలకు అందిస్తున్న సేవలపై పూర్తి సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికసిత భారత్–2047 లక్ష్యాలతో పాటు తెలంగాణ నిర్దేశించుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో లైఫ్ సైన్సెస్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొహాలీ నిప‌ర్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రఘురాం రావు అక్కినేపల్లి అంశాన్ని కూడా కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. కేసులో విముక్తి పొందినప్పటికీ ఆయనకు ఇప్పటికీ న్యాయం జరగలేదని పేర్కొంటూ, ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా దృష్టికి రెండుసార్లు తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. ప్రొఫెసర్ రఘురాం రావుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిల్‌ను కోరారు.

Advertisement
Advertisement