త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Phone Tapping Case | అధికార దుర్వినియోగంలో కేసీఆర్‌ని మించిన వారు లేరు : ఎంపీ చామ‌ల‌

Phone Tapping Case | అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మించిన వారు లేరని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట శనివారం విచారణకు హాజరైన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 2023లో తన ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు తనకు తెలిపార‌ని చామల వెల్లడించారు.

P

Telangana | Published On Jun 6, 2026, 5.22 pm IST

Phone Tapping Case | అధికార దుర్వినియోగంలో కేసీఆర్‌ని మించిన వారు లేరు : ఎంపీ చామ‌ల‌
Advertisement

Phone Tapping Case | అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మించిన వారు లేరని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట శనివారం విచారణకు హాజరైన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 2023లో తన ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు తనకు తెలిపార‌ని చామల వెల్లడించారు. ఆ సమయంలో తాను టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నానని, అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న కారణంగానే తన ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు అధికారులు వివరించారని చెప్పారు. హార్డ్‌డిస్క్‌లలో లభించిన ఆధారాల ప్రకారం తన ఫోన్ నిఘాలో ఉన్నట్లు సిట్ అధికారులు వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బృందంలో కీలక సభ్యుడిగా ఉన్నందునే తన ఫోన్‌ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.

అధికారాన్ని కాపాడుకోవడం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫోన్లను పెద్దఎత్తున ట్యాప్ చేసిందని చామల ఆరోపించారు. రాజకీయ నాయకులకే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా నిఘాలో ఉంచారని చెప్పారు. కుటుంబీకుల ఫోన్ల‌ను సైతం ట్యాప్ చేశార‌న్న ఆయ‌న‌.. దీన్ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు అంగీక‌రిస్తారో లేదో తెలియ‌న‌దు కానీ ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయ్యింద‌న్నారు. ఈ కార‌ణంగా కారణంగానే హరీష్ రావు తన డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడిని మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కవిత కూడా తన ఫోన్ ట్యాప్ అయిన విషయాన్ని బహిరంగంగానే వెల్లడించారని గుర్తు చేశారు. సొంత కుటుంబ సభ్యుల ఫోన్లనే ట్యాప్ చేసిన పరిస్థితిలో రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, త‌న వంటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం వారికి పెద్ద విషయం కాదని చామల విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని, స్వేచ్ఛాయుత వాతావరణం లేకుండా పోయిందని ఆరోపించారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలిచి భారీ మెజారిటీ సాధించిన తర్వాత కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారాన్ని సేకరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి? ఎవరిని పక్కన పెట్టాలి అనే అంశాలపై కూడా నిఘా సమాచారాన్ని ఉపయోగించుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అన్ని వ్యవస్థలను తన ఆధీనంలో ఉంచుకుని శాశ్వతంగా అధికారంలో కొనసాగాలని కేసీఆర్ భావించారని చామల ఆరోపించారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, ఇప్పుడు కేటీఆర్ రోడ్లపైకి వచ్చి ప్రజల్లో తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ అధికారుల వద్ద ఉన్న వివరాలు బయటకు వస్తే ప్రజలు ఆశ్చర్యపోతారని చామల అన్నారు.

వేల సంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడవుతోందని, రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తలు, మీడియా సంస్థల అధినేతలు, సినీ ప్రముఖుల ఫోన్లను కూడా నిఘాలో ఉంచినట్లు ఆరోపించారు. వ్యక్తిగత సంభాషణలను విని గోప్యతకు భంగం కలిగించారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు నీతులు, విలువల గురించి మాట్లాడే హక్కును కోల్పోయారని చామల వ్యాఖ్యానించారు. పదేళ్ల పాలనలో మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులపాలుచేసిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరగాలని, ఇందులో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement