త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kodada Mega Job Mela | కోదాడలో ఉద్యోగాల సునామీ: 350 కంపెనీలు.. 32 వేల మంది అభ్యర్థులు

కోదాడ మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత పోటెత్తింది. 350 ప్రముఖ కంపెనీలు హాజరుకాగా, తొలి రెండు గంటల్లోనే వందలాది మంది కొలువులు సాధించారు. పూర్తి వివరాలివే!

J

Telangana | Published On Sep 19, 2026, 7.26 pm IST

Kodada Mega Job Mela | కోదాడలో ఉద్యోగాల సునామీ: 350 కంపెనీలు.. 32 వేల మంది అభ్యర్థులు
Advertisement
  • తొలి 2 గంటల్లోనే 700 మందికి కొలువులు ఖరారు

Kodada Mega Job Mela | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ గ్రామీణ ప్రాంత నియామక చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం వేలాది మంది నిరుద్యోగ యువతతో శనివారం కిక్కిరిసిపోయింది. కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి అభ్యర్థులు పోటెత్తారు. దేశ, విదేశాలకు చెందిన దాదాపు 350 ప్రముఖ కంపెనీలు ఒకే వేదికపైకి వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించగా.. ప్రాథమికంగా 5,620 మంది షార్ట్‌లిస్ట్ అయ్యారు. వీరిలో సుమారు 3,500 మందికి పైగా ఉద్యోగాలు దక్కనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

32 వేల రిజిస్ట్రేషన్లు.. 2 గంటల్లోనే 700 కొలువులు

ఈ జాబ్ మేళాకు ముందస్తుగానే ఆన్‌లైన్ ద్వారా 22 వేల మంది దరఖాస్తు చేసుకోగా, శనివారం ఉదయం వేదిక వద్ద మరో 10 వేల మంది నేరుగా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో మొత్తం అభ్యర్థుల సంఖ్య రికార్డు స్థాయిలో 32 వేలు దాటింది.

కార్యక్రమం ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే వివిధ రంగాలకు చెందిన కంపెనీలు వేగంగా స్క్రీనింగ్ టెస్టులు, ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఏకంగా 700 మందికి పైగా అభ్యర్థులకు అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు అందజేసి ఆశ్చర్యపరిచాయి.

గూగుల్, ఎల్&టీ, ఫాక్స్‌కాన్ వంటి దిగ్గజ సంస్థల రాక

ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, ఏవియేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, రిటైల్ రంగాలకు చెందిన అగ్రశ్రేణి కంపెనీలు ఈ మేళాలో కొలువుల వర్షం కురిపించాయి. ఫాక్స్‌కాన్‌, ఎల్‌అండ్‌టీ, టాటా, మహీంద్రా, గూగుల్‌, ఇండిగో, అరవింద్‌, ఎంఎస్ఎన్, మెట్రో, అపోలో, మెడ్‌ప్లస్ వంటి దిగ్గజ సంస్థలు పాల్గొన్నాయి.

నిర్మాణ రంగ దిగ్గజం ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థ ఒక్కటే తొలి విడతలో 40 మంది స్థానిక యువకులను ఎంపిక చేసి, సగటున నెలకు రూ.21 వేల వేతనం ఆఫర్ చేసింది. విమానయాన రంగంలో విస్తరిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు స్థానిక యువతకు ప్రత్యేక ఏవియేషన్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అభ్యర్థులు తమకు నచ్చిన రంగాలను ఎంచుకునేందుకు వీలుగా కంపెనీల సమాచారం, లోగోలను ప్రాంగణంలోనూ, ప్రత్యేక వెబ్‌సైట్‌లోనూ డిజిటల్‌గా ప్రదర్శించారు.

గ్రామీణ యువత ముంగిటకే మల్టీనేషనల్ కొలువులు: మంత్రి ఉత్తమ్

ఈ ఉపాధి జాతరకు రాష్ట్ర మంత్రులు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఎన్. పద్మావతిరెడ్డి హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు నేరుగా నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాకు వచ్చిన అపూర్వ స్పందన తెలంగాణ గ్రామీణ యువతలోని ప్రతిభకు, వారి ఆకాంక్షలకు నిదర్శనమన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్లాల్సిన పనిలేకుండా, కార్పొరేట్ కంపెనీలను నేరుగా పల్లె ముంగిటకే తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు స్పష్టం చేశారు. కంపెనీల తుది సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి కొలువులు సాధించే వారి సంఖ్య మరింత పెరగనుంది.

Advertisement
Advertisement