త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallu Ravi vs Jeevan Reddy | కేసీఆర్ చేతిలో జీవన్ రెడ్డి మోసపోవడం ఖాయం : ఎంపీ మల్లు రవి ఘాటు విమర్శలు

కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్, మాజీ ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. నమ్మించి మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని, రావణుడి చేతిలో విభీషణుడిలా కేసీఆర్ చేతిలో జీవన్ రెడ్డి మోసపోవడం ఖాయమని ఆయన ఘాటు విమర్శలు చేశారు.

J

Telangana | Published On Apr 21, 2026, 5.45 pm IST

Mallu Ravi vs Jeevan Reddy | కేసీఆర్ చేతిలో జీవన్ రెడ్డి మోసపోవడం ఖాయం : ఎంపీ మల్లు రవి ఘాటు విమర్శలు
Advertisement

Mallu Ravi vs Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నైజం, జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

నమ్మించి మోసం చేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య

నమ్మించి మోసం చేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని మల్లు రవి ఆరోపించారు. కేసీఆర్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని గత ఎన్నికల్లోనే ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చి ప్రూవ్ చేశారన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, కేసీఆర్ ఎన్ని మాయమాటలు మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

రావణుడి చేతిలో విభీషణుడిలా..

సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంపై మల్లు రవి తీవ్రంగా స్పందించారు. "రావణుడి చేతిలో విభీషణుడు భంగపడినట్లు.. కేసీఆర్ చేతిలో జీవన్ రెడ్డి కూడా భవిష్యత్తులో మోసపోవడం ఖాయం" అని జోస్యం చెప్పారు. 42 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో అనేక ఉన్నత పదవులు అనుభవించిన జీవన్ రెడ్డి, ఇప్పుడు అదే పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం తాను చెప్పినట్లు పార్టీ వినలేదన్న కారణంతోనే ఆయన కాంగ్రెస్‌ను వీడిపోయారని విమర్శించారు.

తన ప్రతిష్టను తానే దిగజార్చుకున్నారు

నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ద్వారా సంపాదించుకున్న వ్యక్తిగత ప్రతిష్టను జీవన్ రెడ్డి తన తాజా నిర్ణయంతో తానే దిగజార్చుకున్నారని మల్లు రవి అన్నారు. ఎప్పుడూ లెఫ్ట్ (వామపక్ష) భావజాలం గురించి మాట్లాడే జీవన్ రెడ్డి.. ఇప్పుడు బీఆర్ఎస్ లాంటి పార్టీలో చేరడం అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఇకపై కాంగ్రెస్ గురించి జీవన్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా.. తనను తాను తిట్టుకున్నట్లే అవుతుందని ఎద్దేవా చేశారు.

వారి ఆలోచనల మేరకే కులగణన

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఆలోచనల మేరకు, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక ఆర్థిక కులగణనను చేపట్టారని మల్లు రవి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement