త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MGNREGS Field Assistants Telangana | ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.. రూ.25 వేల వేతనం ఇవ్వాలి

ఉపాధి హామీ పథకంలో 20 ఏళ్లుగా సేవలందిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ఫిక్స్‌డ్ టర్మ్ ప్రభుత్వ ఉద్యోగులుగా (FTE) గుర్తించి, రూ.25 వేల కనీస వేతనం ఇవ్వాలని ఐఎన్టీయూసీ (INTUC) నేతలు పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ దివ్యకు వినతిపత్రం అందజేశారు.

J

Telangana | Published On Apr 22, 2026, 8.20 pm IST

MGNREGS Field Assistants Telangana | ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.. రూ.25 వేల వేతనం ఇవ్వాలి
Advertisement

కమిషనర్‌కు ఐఎన్టీయూసీ వినతి

MGNREGS Field Assistants Telangana | త్రినేత్ర.న్యూస్ : 20 ఏళ్లుగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (MGNREGS) వెన్నెముకలా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను (Field Assistants) వెంటనే ఫిక్స్‌డ్ టర్మ్ ప్రభుత్వ ఉద్యోగులుగా (FTE) గుర్తించాలని ఐఎన్టీయూసీ (INTUC) తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (PR & RD) కార్యాలయంలో కమిషనర్ దివ్యను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రధాన డిమాండ్లు ఇవే..

ఐఎన్టీయూసీ రాష్ట్ర నేతలు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన ప్రధాన డిమాండ్లు:

  • ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఏపీఓ, ఈసీ, టీఏసీఓ ఉద్యోగుల మాదిరిగానే ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా ఎఫ్.టి.ఈ (FTE) లుగా గుర్తించాలి.
  • నెలకు కనీస వేతనం రూ.25,000 చెల్లిస్తూ, మండల స్థాయిలో బదిలీలకు అవకాశం ఇవ్వాలి.
  • ఎఫ్.ఏ.హెచ్.ఆర్ ను సవరించి అందరికీ హెల్త్ కార్డులు అందించాలి. విధి నిర్వహణలో మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం అకారణంగా తొలగించిన 265 ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.
  • రిటైరైన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. వికలాంగులు, వితంతువులైన ఫీల్డ్ అసిస్టెంట్లకు గతంలో ఇచ్చిన విధంగా ఆసరా పెన్షన్‌ను పునరుద్ధరించాలి.
  • ఎన్.ఎం.ఎం.ఎస్ (NMMS) విధానంలో పని చేయడానికి సరైన శిక్షణతో పాటు, అధునాతన మొబైల్ ఫోన్లు సమకూర్చాలి. ఉపాధి కూలీలకు ఏటా 150 రోజుల పని కల్పించి, రోజుకు రూ. 400 వేతనం చెల్లించాలి.

మ్యానిఫెస్టో హామీని నిలబెట్టుకోవాలి

ఈ సందర్భంగా మొగుళ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో స్పష్టంగా హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అలాగే, గత సంవత్సరం జులై నెలలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో జరిగిన చర్చల సందర్భంగా ఆమె ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క మానవతా దృక్పథంతో స్పందించి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి. చంద్రశేఖర్, తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్స్ అండ్ అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్గురి రవి, ప్రధాన కార్యదర్శులు కంకల సిద్దిరాజు, చల్ల వెంకటేశ్వర్లు, నాయకుడు పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement