త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha – Chinna Reddy | సురేఖ బర్తరఫ్.. చిన్నారెడ్డి రాజీనామా

Konda Surekha - Chinna Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించారు. చిన్నారెడ్డితో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయించారు. దీంతో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలకు ఎట్టకేలకు తెరపడింది.

S

Telangana | Published On Sep 3, 2026, 6.51 pm IST

Konda Surekha – Chinna Reddy | సురేఖ బర్తరఫ్.. చిన్నారెడ్డి రాజీనామా
Advertisement

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలిగా
కేకే కూతురు విజయలక్ష్మి
రాజీనామాకు సురేఖ ససేమిరా
బ‌ర్త‌ర‌ఫ్‌కు సీఎం నిర్ణ‌యం
సీఎస్ ద్వారా గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ‌
ఆమోదించిన గ‌వ‌ర్న‌ర్

Konda Surekha - Chinna Reddy | త్రినేత్ర‌.న్యూస్ :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించారు. చిన్నారెడ్డితో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయించారు. దీంతో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలకు ఎట్టకేలకు తెరపడింది. తీవ్ర ఉత్కంఠ‌ తతో పూట‌కో మ‌లుపు తీసుకున్న సీఎం వర్సెస్ మంత్రి పంచాయితీకి హ‌స్తిన‌లో శుభం కార్డు ప‌డింది.

హైదరాబాద్ చేరుకునేలోపు.. రాజీనామా, బర్తరఫ్

సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత రాజకీయ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. అడపాదడపా సీనియర్ నేత అయిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కూడా .. స్థానిక వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఉద్దేశించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో.. అసమ్మతి వర్గానికి గుణపాఠం చెప్పేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత గత సోమవారం నాడు ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లతో ఆయన భేటీ అయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అసమ్మతి నేతలతో ప్రభుత్వానికి జరుగుతున్న నష్టంపై వారితో చర్చించారు. కఠినమైన సందేశాన్ని పంపకపోతే.. అసమ్మతి ధోరణులు రోజురోజుకూ పెరిగిపోతాయని సీఎం రేవంత్ రెడ్డి అధిష్ఠానానికి వివరించారు. సీనియర్ నేత అయిన చిన్నారెడ్డికి.. వనపర్తి శాసనసభ టికెట్ ఇవ్వలేకపోయినా..ఆయనకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించామని ..అయినా ఆయన హద్దులు మీరి క్రమశిక్షణను ఉల్లంఘించేలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో.. అధిష్టానం పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదికలను తెప్పించుకున్నది. ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ తో సంప్రదించింది. ఢిల్లీ ఎపిసోడ్ కు ముందే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో రాయబారం నడిపింది. మంత్రి కొండా సురేఖను రాజీనామా చేయాలని ..డిప్యూటీ సీఎంతో చెప్పించింది. అయితే ఇందుకు ఆమె ససేమిరా అనడంతో.. చివరికి బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అధిష్ఠానం నుంచి ఆదేశాలు రాగానే.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి చిన్నారెడ్డి బుధవారం సాయంత్రమే రాజీనామా పంపారు. ముఖ్యమంత్రి దీనిని ఆమోదిస్తూ ఆయన స్థానంలో సీనియర్ నేత కేకే కూతురు విజయలక్ష్మి కి ఆ బాధ్యతలు అప్పగించారు. విజ‌య‌ల‌క్ష్మి స్థానంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద నియమించారు. కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ చైర్‌ప‌ర్స‌న్‌గా రాజ్య‌స‌భ మాజీ ఎంపీ గుండు సుధారాణిని నియ‌మిస్తూ ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన సీఎం రేవంత్ రెడ్డి.. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో విమానం ఎక్కగానే.. ఇటు హైదరాబాద్ లో బర్తరఫ్ ఉత్తర్వులు.. నూతన నియామక ఆదేశాలు చకచకా విడుదలయ్యాయి.

పార‌ని బీసీ పాచిక‌..!

రాష్ట్రంలో బీసీల‌కో న్యాయం.. బ‌డా వ‌ర్గాల‌కో న్యాయ‌మా అంటూ కొండా సురేఖ... సీఎం రేవంత్ రెడ్డిని ప‌లుమార్లు నిల‌దీశారు. త‌న‌పై క్ర‌మ‌శిక్ష‌ణా అస్త్రాలు ఝుళిపించిన టీ పీసీసీ.. కోట్లాది రూపాయాల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఇత‌ర మంత్రుల‌పై చ‌ర్య‌లు తీసుకోకుండా ఎందుకు క‌ళ్లు మూసుకుంటుంద‌ని ప్ర‌శ్నించారు. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఎన్నిసార్లు హ‌ద్దులు దాటినా ప‌ట్టించుకోలేదని తన విషయాన్ని మాత్రమే సాగదీస్తున్నారని ఆమె బాహాటంగానే ఢిల్లీలో వ్యాఖ్యానించారు. తన తప్పేం లేదని సురేఖ చెప్పుకునే ప్రయత్నం చేసినా.. హైక‌మాండ్ మాత్రం క‌ఠినంగానే వ్య‌హ‌రించింది.

తెలంగాణ‌లో.. ప్రతిసారీ ఓ మంత్రి బ‌ర్త‌ర‌ఫ్

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తి ట‌ర్మ్‌లో ఓ మంత్రి బ‌ర్త‌ర‌ఫ్ కావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తున్న‌ది. 2015లో ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న రాజయ్య‌ను ఆనాడు కేసీఆర్ ప్ర‌భుత్వం నుండి బ‌ర్త‌ర‌ఫ్ చేశారు. అంతేకాదు 2021లో మంత్రిగా ఉన్న ఈటల రాజేంద‌ర్ ను కూడా కేసీఆర్ ప్రభుత్వం నుండి బ‌ర్త‌ర‌ఫ్ చేశారు. 2026లో ఇప్పుడు మంత్రిగా ఉన్న కొండా సురేఖ‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం నుండి బ‌ర్త‌రఫ్ చేశారు. ఇందులో ఇద్ద‌రు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా నేత‌లు కాగా, ఈట‌ల రాజేంద‌ర్ ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన నాయ‌కులు. వ‌రంగ‌ల్ జిల్లా నుంచి ఇద్ద‌రు మంత్రులు రాజ‌య్య‌, సురేఖ బ‌ర్త‌ర‌ఫ్ అయ్యారు.

Advertisement
Advertisement