త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pinarayi Vijayan Letter to Revanth Reddy | రేవంత్ భాష మార్చుకో.. ఆటిట్యూట్ తగ్గించుకో.. వ్యక్తిగత దూషణలొద్దు : కేరళ సీఎం స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటు లేఖ రాశారు. కేరళ అభివృద్ధిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, నీతి ఆయోగ్ ర్యాంకుల్లో తెలంగాణ అవినీతిలో ఉందని, కేరళ అభివృద్ధిలో నంబర్ వన్ అని గణాంకాలతో సహా స్పష్టం చేశారు.

J

Telangana | Published On Apr 7, 2026, 7.09 pm IST

Pinarayi Vijayan Letter to Revanth Reddy | రేవంత్ భాష మార్చుకో.. ఆటిట్యూట్ తగ్గించుకో.. వ్యక్తిగత దూషణలొద్దు : కేరళ సీఎం స్ట్రాంగ్ కౌంటర్

సంక్షిప్త సారాంశం

కేరళ అభివృద్ధి, ఎల్‌డిఎఫ్ (LDF) ప్రభుత్వ పనితీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన విమర్శలకు కేరళ సీఎం పినరయి విజయన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు తగవని హితవు పలికారు. నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం కేరళ దేశంలోనే అత్యంత తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రమని, తెలంగాణ అత్యంత అవినీతి రాష్ట్రాల్లో 6వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. అలాగే విద్య, వైద్యం, ఐటీ, పేదరిక నిర్మూలన, కేంద్రంపై పోరాటంలో కేరళ సాధించిన విజయాలను ఈ లేఖలో సవివరంగా పేర్కొన్నారు.

Advertisement

Pinarayi Vijayan Letter to Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వంపై, అక్కడి అభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డికి ఆయన ఒక సుదీర్ఘమైన, ఘాటైన లేఖను రాశారు. రాజకీయంగా విభేదాలు ఉండటం సహజమేనని, కానీ వ్యక్తిగత దూషణలతో విమర్శలు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని విజయన్ స్పష్టం చేశారు. కేరళ ప్రజల అనుభవం, మీరు చెబుతున్న దానికి పూర్తి భిన్నంగా ఉందని లేఖలో పేర్కొన్నారు.

నీతి ఆయోగ్ ర్యాంకుల్లో మీరేక్కడ.. మేమెక్కడ?

అభివృద్ధి, అవినీతి విషయాల్లో రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు విజయన్ నీతి ఆయోగ్ గణాంకాలతో బదులిచ్చారు.

అవినీతి: నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ అని, కానీ తెలంగాణ దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రాల్లో 6వ స్థానంలో ఉందని విజయన్ చురకలంటించారు.

సస్టెయినబుల్ డెవలప్‌మెంట్: జాతీయ సుస్థిర అభివృద్ధి సూచీలో కేరళ 79 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ 6వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల్లోనూ కేరళ మొదటి ర్యాంకు సాధించిందని తెలిపారు.

కాంగ్రెస్ ఘనత కాదు.. వామపక్షాల కృషే

కేరళ సాధించిన సామాజిక అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసిన కృషేనంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విజయన్ కొట్టిపారేశారు. స్వాతంత్య్రం వచ్చిన తొలి దశాబ్దంలోనే జమీందారీ వ్యవస్థను రద్దు చేసేందుకు కేరళలోని తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వం 'అగ్రేరియన్ రిలేషన్స్ బిల్లు'ను తీసుకువచ్చిందని, అయితే అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసి ఆ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిందని చరిత్రను గుర్తుచేశారు. 1980లలో అక్షరాస్యత ఉద్యమం, 1996లో అధికార వికేంద్రీకరణ వామపక్ష ప్రభుత్వాల ఘనతేనని స్పష్టం చేశారు.

నవ కేరళ - అభివృద్ధి ప్రస్థానం

నవ కేరళ మిషన్ల ద్వారా తమ ప్రభుత్వం సాధించిన విజయాలను విజయన్ వివరించారు.

వైద్యం: 'ఆర్ద్రం మిషన్' ద్వారా 670 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునిక ఫ్యామిలీ హెల్త్ సెంటర్లుగా మార్చాం.

విద్య: 13,000 ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేశాం. 45,000 తరగతి గదులను హైటెక్ వసతులతో తీర్చిదిద్దాం.

పేదరిక నిర్మూలన: నవంబర్ 1, 2025 నాటికి తీవ్ర నిరుపేదలు లేని భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ రికార్డు సృష్టించింది. 64,006 కుటుంబాలను గుర్తించి వారికి ప్రత్యేక పథకాలు అమలు చేశాం.

ఐటీ రంగం: 2026 నాటికి భారతదేశ ఐటీ ఎగుమతుల్లో 10% వాటాను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇప్పటికే 20,000 డీప్-టెక్ స్టార్టప్‌లతో డిజిటల్ సైన్స్ పార్కును అభివృద్ధి చేస్తున్నాం.

మౌలిక సదుపాయాల జాప్యానికి కాంగ్రెస్సే కారణం

జాతీయ రహదారుల విస్తరణ, గెయిల్ పైప్‌లైన్, ఎడమన్-కొచ్చి పవర్ హైవే వంటి కీలక ప్రాజెక్టులను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దాదాపు వదిలేశాయని, వాటిని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వమే పునరుద్ధరించిందని పినరయి విజయన్ తెలిపారు. కొచ్చి మెట్రో, విజింజమ్ అంతర్జాతీయ ఓడరేవు ప్రాజెక్టుల జాప్యానికి గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

బీజేపీపై మా పోరాటం ఆగదు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎల్‌డిఎఫ్ తీవ్రంగా విమర్శించడం లేదన్న రేవంత్ ఆరోపణలకు విజయన్ దీటైన బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, రాష్ట్రాల హక్కుల హననంపై ఆర్టికల్ 131, 32 ల కింద సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది కేరళ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీయేతర రాష్ట్రాలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. ఒక విషయంపై బలమైన స్టాండ్ తీసుకోవడానికి హద్దులు మీరిన, అసభ్యకరమైన భాష వాడాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డికి చురకలంటించారు.

"మేము వెళ్తాం, కానీ ముందుకు మాత్రమే. అందరికీ ఆదర్శంగా నిలిచే నవ కేరళను సృష్టించడం ద్వారా మేము ముందుకు సాగుతాం" అని విజయన్ తన లేఖను ముగించారు.

Advertisement
Advertisement