త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Digwal Substation inspection | కోహీర్ సబ్‌స్టేషన్‌లో హరీశ్ రావు ఆకస్మిక తనిఖీ: 24 గంటల కరెంట్ ఏదీ రేవంత్ రెడ్డీ? లాగ్‌బుక్ సాక్షిగా బట్టబయలు!

జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలంలోని దిగ్వాల్ సబ్‌స్టేషన్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని లాగ్‌బుక్ ఆధారంగా ఆయన నిరూపించారు. రైతులకు వ్యవసాయ కనెక్షన్ల ఫీజును రూ. 4900 నుంచి రూ. 9700 కి పెంచడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

J

Medak | Published On Mar 12, 2026, 8.39 pm IST

Digwal Substation inspection | కోహీర్ సబ్‌స్టేషన్‌లో హరీశ్ రావు ఆకస్మిక తనిఖీ: 24 గంటల కరెంట్ ఏదీ రేవంత్ రెడ్డీ? లాగ్‌బుక్ సాక్షిగా బట్టబయలు!
Advertisement

Digwal Substation inspection | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై బీఆర్ఎస్ (BRS) వర్సెస్ కాంగ్రెస్ (Congress) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలంలోని దిగ్వాల్ (Digwal) 33/11 KV సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మాణిక్యరావుతో కలిసి లాగ్‌బుక్‌ను స్వయంగా పరిశీలించిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టారు.

లాగ్‌బుక్ చెబుతున్న నిజాలివే

రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో గొప్పలు చెబుతున్నారని.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని హరీశ్ రావు మండిపడ్డారు. "గత కొద్దిరోజులుగా రైతులు మాకు ఫోన్లు చేసి కోహీర్‌లో కరెంట్ సరఫరా బాగాలేదని, రోజుకు 5-6 సార్లు కరెంట్ ట్రిప్ అవుతోందని వాపోయారు. అందుకే ఈరోజు ఆకస్మిక తనిఖీకి వచ్చాను. ఇప్పుడే సబ్‌స్టేషన్ లాగ్‌బుక్ చూశాం. 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు త్రీఫేస్ కరెంట్ తీసేస్తే.. మళ్లీ 11వ తేదీ ఉదయం 3 గంటలకు ఇచ్చారు. అంటే దాదాపు 11 గంటల పాటు రైతులకు కరెంట్ కట్ చేశారు. ఇది నేను చెబుతున్నది కాదు.. మీ లాగ్‌బుక్ చెబుతున్న పచ్చి నిజం" అని ఆయన స్పష్టం చేశారు.

ఇచ్చిన 12 గంటల్లో.. 5 సార్లు ట్రిప్

మిగతా 13 గంటల్లో కూడా లైన్ బ్రేక్, ఎల్‌సీ (LC) పేరుతో కరెంట్ తీసేస్తున్నారని, ఆ సమయంలో కనీసం 5 సార్లు కరెంట్ ట్రిప్ అవుతోందని హరీశ్ రావు ఆరోపించారు. దీనివల్ల పారిన మడే పారుతోందని, వెనుక మడికి నీళ్లు అందడం లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ వస్తే.. కాంగ్రెస్ పాలనలో కనీసం 12 గంటలు కూడా రావడం లేదన్నారు.

రైతులంటే ఎందుకంత పగ రేవంత్ రెడ్డీ?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "మాటల్లో రైతు ప్రభుత్వం.. చేతల్లో రైతు వ్యతిరేక ప్రభుత్వం. రేవంత్ రెడ్డికి రైతులంటే ఎందుకంత పగ? ఎందుకంత చిన్నచూపు? కేసీఆర్ హయాంలో కరోనా, నోట్ల రద్దు లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతుబంధు ఆపలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన యాసంగికి బోనస్ ఇవ్వలేదు, వరంగల్‌లో వాన పరిహారం రెండు మూడేళ్లుగా ఇవ్వలేదు. ఇప్పుడు రైతులకు సరిగ్గా కరెంట్ కూడా ఇవ్వడం లేదు" అని విమర్శించారు.

వ్యవసాయ కనెక్షన్ ఫీజు డబుల్ చేశారు

కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయ కనెక్షన్ ఫీజు కేవలం రూ.4900 ఉండేదని.. రేవంత్ రెడ్డి వచ్చాక దాన్ని డబుల్ చేసి రూ.9700 చేశారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయని, స్టోర్‌లో మెటీరియల్ లేదని, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల భారం రైతుల మీదే పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

థర్డ్ డిస్కం.. కొత్త అప్పుల కోసమే!

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 'థర్డ్ డిస్కం'పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఎస్పీడీసీఎల్ (TSSPDCL), ఎన్పీడీసీఎల్ (TSNPDCL) అప్పులన్నీ థర్డ్ డిస్కంకు బదిలీ చేసి.. ఆ రెండు డిస్కంలకు అప్పుల్లేవని చూపిస్తూ మళ్లీ కొత్తగా అప్పులు తెచ్చేందుకే ఈ నాటకం ఆడుతున్నారు. ఒక గ్రామంలో ఇళ్లకు ఒక ఏఈ (AE), వ్యవసాయ బావులకు మరో ఏఈ అంటే ఇది ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యే పనేనా? కేవలం బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలను మోసగించడానికే ఈ థర్డ్ డిస్కం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదు. డిస్కంలు దాదాపు రూ.55 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి" అని వివరించారు.

బీఆర్ఎస్ పార్టీ డిమాండ్లు

  • దమ్ముంటే రేపటి నుంచే రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. లేదంటే 12 గంటలే ఇస్తామని బహిరంగంగా ఒప్పుకోవాలి.
  • పెంచిన వ్యవసాయ కనెక్షన్ ఫీజును వెంటనే తగ్గించి, పెండింగ్ కనెక్షన్లు విడుదల చేయాలి.
  • ఇళ్లకు మీటర్ల కోసం డబ్బులు కట్టిన వారికి వెంటనే మీటర్లు బిగించాలి (గత 6 నెలలుగా కొత్త మీటర్లు ఇవ్వడం లేదు).
  • పెండింగ్‌లో ఉన్న రైతుబంధు (Rythu Bandhu) నిధులను వెంటనే విడుదల చేయాలి.
  • రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న 19,647 మంది విద్యుత్ ఆర్టీజెన్స్‌ను (Artisans) వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. చనిపోయిన ఆర్టీజెన్స్ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
  • ఎన్పీడీసీఎల్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క విషయంలోనూ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, రైతులను దగా చేసిందని హరీశ్ రావు దుయ్యబట్టారు.

Advertisement

తాజావార్తలు

Advertisement